Telangana Tradition
-
వాడవాడలా బతుకమ్మ సంబరాలు
-
తెలంగాణ సంస్కృతిని చాటేందుకే..
కరీంనగర్, న్యూస్లైన్ : తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకే జాగృతి ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాలుగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మంగళవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాగృతి జిల్లా కన్వీనర్ బాలసంకుల అనంతరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, బతుకమ్మ, దసరా, దీపావళి, పీరీల పండుగ, హోలి లాంటి పండుగల్లో ఇంటిల్లిపాది ఆడపడుచులంతా పాల్గొని చేసుకునే సంస్కృతీ తెలంగాణదని అన్నారు. సీమాంధ్రలో ఒక్క సంక్రాంతి పండుగను మాత్రమే ఘనంగా నిర్వహించుకుంటారని, పండుగల ప్రాముఖ్యత వారికి తెలియదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాక సంస్కృతీ సాంప్రదాయలకు పెద్దపీట వేసేలా రాష్ట్ర పునర్నిర్మాణంలో జాగృతి ప్రముఖపాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి నల్లికుట్లోడని, సీమాంధ్రలో జరిగే ఉద్యమం ఆయన సృష్టించిందేనని మాజీ డీజీపీ దినేష్రెడ్డి వెల్లడించడం సీఎం ఎంతటి ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలంగాణలోని భూములు అమ్మి ఢిల్లీలో ఏపీ భవన్ను నిర్మించారని, తెలంగాణ ఆస్తులనమ్మి నిర్మించిన ఆ తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చంద్రబాబు దీక్షకు పూనడం అనైతికమని, వెంటనే ఏపీ భవన్ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. బంగారు బతుకమ్మ వేడుకల విజయవంతానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీ ఎంపీ బి.వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి, నగర అధ్యక్షుడు రవీందర్సింగ్, తెలంగాణ జాగృతి ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కన్వీనర్ తానిపర్తి తిరుపతిరావు, జిల్లా అధికారప్రతినిధి జాడి శ్రీనివాస్, యువజన, విద్యార్థి, మహిళా, ఆరోగ్య విభాగాల కన్వీనర్లు వంగల శ్రీనివాస్, పసుల చరణ్, శ్రీనివాస్కర్ణ, జవ్వాజి విమల, బుక్క్లబ్ రాష్ట్ర కన్వీనర్ నంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాంస్కృతిక సమ్మేళనం.. బతుకమ్మ
నల్లగొండ కల్చరల్, న్యూస్లైన్: తెలంగాణ ప్రజలకే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని, ఇది మహిళా సాంస్కృతిక సమ్మేళనమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంగారు బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆమె మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతగొప్పవో బతుకమ్మ పండగను చూస్తే తెలుస్తుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ మహిళలు 9 రోజులపాటు నిర్వహించుకునే అతి పెద్ద పూల పండగన్నారు. ఇంతటి గొప్ప పండగను సీమాంధ్రుల పరిపాలనలో అణగదొక్కాలని చూశారన్నారు. విదేశీయులెందరో ఉత్సాహంగా, ఆసక్తిగా బతుకమ్మ పండగలో పాల్గొంటున్నారన్నారు. కేంద్రం ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇక ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. ఆర్టీసీ కాలనీకి చెందిన కుంభం మల్లారెడ్డి తయారుచేసిన 7అడుగుల బతుకమ్మ ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు రామగిరిలోని రామాలయంలో మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలను తీసుకుని కవిత ఆధ్వర్యంలో గడియారం సెంటర్ మీదుగా సభావేదిక ఎన్జీ కళాశాలకు చేరుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శులు వేణుసంకోజు, జవహర్లాల్, జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్, కంచనపల్లి రమేష్బాబు, దుబ్బాక నర్పింహారెడ్డి, మాలె శరణ్యారెడ్డి, పున్న కైలాస్ నేత, జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకటేశ్వర్లు పలువురు మహిళలకు బహుమతులు అందజేశారు. -
పాలమూరులో పండుగ
మహబూబ్నగర్ కల్చరల్, న్యూస్లైన్: తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలు శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా స్థానిక జిల్లాస్టేడియంలో, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించారు. ఉదయం నుంచే పట్టణంలో పండుగ వాతావరణం ఏర్పడింది. పెత్తరమాస (పెద్దల పండుగ) అయినప్పటికీ మహిళలు, చిన్నారులు బతుకమ్మ పండుగకే అధిక ప్రాధాన్యతను ఇచ్చి రంగు, రంగుల పూలను సేకరించి బతుకమ్మలను అలంకరించారు. పట్ణణంలోని వివిధ మహిళా సంఘాలు, పాలమూరు యూనివర్సిటీ, ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థినులు పలురూపాల్లో సిద్ధం చేసిన బతుకమ్మలను, గౌరీ మాతను స్థానిక గడియారం చౌరస్తా నుంచి ఊరేగింపుగా జిల్లాస్టేడియానికి తీసుకొచ్చారు. బతుకమ్మ ఆటపాటలతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. మంత్రి డీకే అరుణ స్వయంగా ముందుండి నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ సతీమణి అన్నపూర్ణ, ఎమ్మెల్యే సతీమణి ప్రసన్న, మెప్మా పీడీ పద్మహర్ష, హార్టికల్చర్ ఏడీ సువర్ణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జ్యోతితో పాటు పలువురు మహిళా అధికారులు, వివిధ శ్రేణుల ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ ఆటాపాటా ప్రదర్శించారు. మైదానంలో ప్రదర్శించిన అన్ని బతుకమ్మల వద్ద మంత్రి సుమారు రెండు గంటల పాటు బతుకమ్మ వేశారు. కలెక్టర్ గిరిజాశంకర్, ఏజీసీ డాక్టర్ రాజారాం, వివిధ శాఖల అధిపతులు వేడుకల్లో పాల్గొన్నారు. బాలభవన్కు చెందిన చిన్నారి కళాకారిణులు ప్రదర్శించిన నృత్యాలు, టీటీడీ మహిళా సంఘం, భజన బృందాలు చేసిన భజనలు ఆకట్టుకున్నాయి. జిల్లాకు చెందిన విద్యావేత్త డాక్టర్ విజితారెడ్డి బతుకమ్మ ప్రాశ స్త్యాన్ని వివరించారు. రాష్ట్ర పండుగగా బతుకమ్మ: మంత్రి డీకే నాలుగేళ్లుగా బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం అధికారి కంగా నిర్వహిస్తోందని మంత్రి డీకే అరుణ పేర్కొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముందు రోజు చేపట్టిన ఈ పండుగ జిల్లా, రాష్ట్ర ప్రజలకు శుభాలు కలుజేయాలని అకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించినందుకు ఈ పండుగకు ప్రత్యేక విశిష్టత ఉందని అన్నారు. గౌరీమాత అందరినీ చల్లగా చూడాలని, రాబోయే కాలంలో ఈ వేడుకలను మరింత ఉత్సాహంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. -
ఊరూ వాడా ఉప్పొంగిన తెలం‘గానం’
హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో గురువారం రాత్రి నగరంలో తెలంగాణవాదుల సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అనేకమంది వీధుల్లోకొచ్చి ఆనందంతో మిఠాయిలు పంచిపెట్టి నృత్యాలు చేశారు. జెతైలంగాణ.. జైజై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఉద్యమకేంద్రం ఉస్మానియాలో విద్యార్థుల ఆనందం నింగినంటింది.