breaking news
telangana rtc employees
-
సీఎంకు పది వేల లేఖలు; ఆర్టీసీ ఉద్యోగుల వినూత్న నిరసన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి పేరుకుపోయిన బకాయిల కోసం ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. సీసీఎస్కు ఆర్టీసీ బకాయిపడ్డ రూ.1,000 కోట్లను వెంటనే విడుదల చేయించాలని కోరుతూ ఉద్యోగులు ముఖ్యమంత్రికి మూకుమ్మడి లేఖలు పంపుతున్నారు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 వేల లేఖలు పోస్టు చేశారు. కొంతకాలంగా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని సీసీఎస్కు జమ చేయకుండా ఆర్టీసీ సొంతానికి వినియోగించుకుంటోంది. ఇలా దాదాపు రూ.1,000 కోట్లు బకాయి (వడ్డీతో కలుపుకొని) పేరుకుపోయింది. గతంలో ఉద్యోగులు తీసుకున్న అప్పులు మరో రూ.800 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ.1,000 కోట్లను వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు తిరిగి రుణాలు ఇవ్వడం ప్రారంభించాలని చాలాకాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తమ వద్ద నిధులు లేనందున సమయం పడుతుందంటూ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందితే చెల్లిస్తామని చెబుతున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని వేడుకుంటూ ముఖ్యమంత్రికి లేఖలు పంపాలని ఇటీవల నిర్ణయించారు. ఈ మేరకు మొత్తం 10 వేల లేఖలు సిద్ధం చేసి, డిపోల వారీగా ఉద్యోగుల సంతకాలతో పోస్టు చేస్తున్నారు. సీసీఎస్లో నిధులు లేకపోవడంతో ఉద్యోగులకు రుణాలు అందకపోవటమే కాకుండా, రిటైర్ అయి సీసీఎస్లో నగదు డిపాజిట్ చేసుకున్న విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ ఇవ్వటం లేదని, సీసీఎస్లో సభ్యత్వం రద్దు చేసుకున్న వారికి చెల్లింపులు జరపటం లేదని, రిటైర్ అయిన వారికి సెటిల్మెంట్ చేయటం లేదని ఆ లేఖల్లో పేర్కొన్నారు. 27న జనరల్ బాడీ సమావేశం.. సీసీఎస్కు సంబంధించి ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలి. కానీ, ఏడాది కాలంలో ఓసారి సమ్మె వల్ల, మరోసారి కోవిడ్ వల్ల ఈ సమావేశాలు జరుగలేదు. రెండేళ్లుగా సీసీఎస్లో నిధులు లేక రుణాలు అందని దుస్థితి నెలకొన్నందున ఇప్పుడు అత్యవసరంగా సమావేశం నిర్వహించాలని సీసీఎస్ పాలక మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 27 తేదీని ఖరారు చేశారు. ఉద్యోగుల ప్రతినిధులుగా ఉండే 250 మంది, ఆర్టీసీ ఎండీ, ఇతర సభ్యులైన అధికారులు, ఎక్స్అఫీషియో సభ్యులు పాల్గొనాలి. కానీ, లోన్ల విషయంలో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నందున జనరల్ బాడీ సమావేశంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉండనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీసీఎస్కు బకాయి పడ్డ మొత్తాన్ని ఇవ్వలేక చేతులెత్తేసినందున, ఈ సమావేశంతో గందరగోళం నెలకొంటుందని భావిస్తున్న ఆర్టీసీ అధికారులు, భేటీ జరుగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమావేశాన్ని నిర్వహించి తీరుతామని సీసీఎస్ పాలకమండలి స్పష్టం చేస్తోంది. -
ఆర్టీసీపై ‘రెఫరల్’ భారం
సాక్షి, హైదరాబాద్ : అసలే రకరకాల సమస్యలతో కొట్టుమిట్టా డుతూ నష్టాల బాటలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)పై సొంత ఆసుపత్రి మరింత ఆర్థిక భారం మోపుతోంది. సరైన వసతులు లేకపోవడం, స్పెషలిస్టు వైద్యులు కరువవడం, ఆపరేషన్లు చేసే వెసులుబాటు లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఓ మోస్తరు వైద్యానికి కూడా ప్రైవేటు ఆసుపత్రులవైపు చూడాల్సి వస్తోంది. ఫలితంగా రెఫరల్ ఆసుపత్రులకు భారీగా బిల్లులు చెల్లించాల్సి రావడం ఆర్టీసీని బెంబేలెత్తిస్తోంది. వేసవిలో సిబ్బంది కోసం బస్టాండ్లలో మజ్జిగ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఆర్టీసీ... ప్రతి సంవత్సరం ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ మొత్తం రెఫరల్ బిల్లులు చెల్లిస్తోంది. అందులో కనీసం ఏటా రూ. 10 కోట్లు సొంత ఆసుపత్రి అభివృద్ధికి వెచ్చించి ఉంటే ఈపాటికి అది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో అభివృద్ధి చెంది ఉండేదని సొంత ఉద్యోగులు వాపోతున్నారు. ఇదీ సంగతి.... ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం కోసం హైదరాబాద్లోని తార్నాకలో ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతే చికిత్స చేసి మందులు ఇచ్చేందుకు స్థానికంగా డిస్పెన్సరీలు ఉన్నా పెద్ద సమస్యలు వస్తే తార్నాకలోని ఆసుపత్రికే వస్తుంటారు. వైద్యులు వారి సమస్యలు గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ ఆసుపత్రి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. కొన్ని రకాల సమస్యలకు సంబంధించి ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులు లేరు. అలాగే ఆయా సమస్యలకు సంబంధించి నిర్వహించాల్సిన ఆపరేషన్ల కోసం వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఇటీవలి కాలంలో మందులకూ కొరత ఏర్పడ్డా ఇప్పుడిప్పుడే ఆ సమస్య పరిష్కారమవుతోంది. వెరసి చిన్నచిన్న చికిత్సలు మాత్రమే ఆసుపత్రిలో అందిస్తున్నారు. కాస్త పెద్ద సమస్యతో వచ్చే వారిని వెంటనే రెఫరల్ ఆసుపత్రులకు పంపేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సంస్థకు ఏటా ఈ రెఫరల్ ఆసుపత్రుల బిల్లు తడిసి మోపెడవుతోంది. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించలేకపోతున్న ఆర్టీసీ... రెఫరల్ ఆసుపత్రుల బిల్లులకు మాత్రం సగటున ప్రతి సంవత్సరం రూ. 30 కోట్లకుపైగా చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తంలో సగం కంటే తక్కువ నిధులను ఆసుపత్రి అభివృద్ధికి ఖర్చు చేస్తే ఈపాటికి ముఖ్యమైన చికిత్సలకు సంబంధించి పరికరాలు, ఇతర వసతులు సమకూరి ఉండేవన్న వాదన సొంత ఉద్యోగుల నుంచే వినిపిస్తోంది. ఒక్కో సంవత్సరం కనీసం రూ.10 కోట్లు ఖర్చు చేసినా.. అన్ని ముఖ్యమైన పరికరాలు సమకూరి ఉండేవన్నది వారి మాట. మూడేళ్ల రెఫరల్ బిల్లు రూ. 105 కోట్లు... 2015–16లో ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న రోగులకు అందించిన మందుల ఖర్చు రూ. 9.14 కోట్లు అవగా ప్రస్తుత ఉద్యోగుల రెఫరల్ వ్యయం రూ. 28.45 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల రెఫరల్ వ్యయం రూ. 5 కోట్లు అయింది. గడచిన మూడేళ్లలో సొంత ఆసుపత్రిలో చికిత్స చేసి మందులు ఇచ్చినందుకు రూ. 32 కోట్లు ఖర్చవగా రెఫరల్ ఆసుపత్రులకు చెల్లించిన బిల్లు మాత్రం రూ. 105 కోట్ల వరకు అయింది. చేతిలో చాలినన్ని నిధుల్లేక కొన్నేళ్లుగా కొత్త బస్సులు కొనడాన్ని నిలిపివేసిన ఆర్టీసీ... గత్యంతరం లేని స్థితిలో ఈ బిల్లుల భారాన్ని మాత్రం మోయాల్సి వస్తోంది. ప్రభుత్వ వైద్యుల సేవలు వాడుకునే అవకాశం ఉన్నా... ఆర్టీసీలో దాదాపు 51 వేల మంది పనిచేస్తున్నారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు కలిపి 2 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇంతమందికి వైద్యం అందించే ప్రధాన ఆసుపత్రి అయినందున ఇక్కడ అన్ని విభాగాలకు చెందిన వైద్యులు, చికిత్సకు అవసరమైన పరికరాలు ఉండాలి. అయితే సాధారణ వైద్యులు మాత్రమే ఉండటంతో గుండె, కిడ్నీ, ఆర్థో సహా ఇతర పెద్ద సమస్యలతో వచ్చే వారిని నేరుగా రెఫరల్ ఆసుపత్రులకు పంపుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రిల్లో ఉన్న స్పెషలిస్టు వైద్యుల్లో కొందరిని గుర్తించి విడతలవారీగా ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యం అందించేలా చేసే అవకాశం ఉన్నా అధికారులు అలా చేయడం లేదు. అలాగే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వైద్యులను గౌరవ భృతిపై పిలిపించే ఒప్పందం ఉన్నా అది కూడా సరిగా అమలు కావడం లేదు. దీంతో స్కానింగ్, ఎమ్మారైలకు కూడా వేరే చోటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ వసతులు, స్పెషలిస్టు డాక్టర్లు లేనందున ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం కంటే ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయించుకొనేందుకే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కొత్తగా ఆర్టీసీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో రెఫరల్ జాబితాను విడుదల చేసింది. అందులో మూడు మాత్రమే పెద్ద ఆసుపత్రులు ఉండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తార్నాక ఆసుపత్రిలో అన్ని విభాగాలకు పూర్తిస్థాయి వసతులు, స్పెషలిస్టు వైద్యులు లేనందున రెఫరల్ ఆసుపత్రుల జాబితాలో సన్షైన్, కిమ్స్, గ్లోబుల్, యశోద, అపోలో, ఉషా ముళ్లపూడి, కామినేని లాంటి ఆసుపత్రులను కూడా చేర్చాలి’అని ఆర్టీసీ బోర్డు మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో కోరారు. సొంత ఆసుపత్రిపై నమ్మకం లేక ఇలాంటి డిమాండ్లు తరచూ వినిపిస్తున్నాయి. 2015–16 2016–17 2017–18 2018–19 (అంకెలు రూ. కోట్లలో) మందుల ఖర్చు 9.14 5.91 17.15 8.95 ప్రైవేట్ రెఫరల్ వ్యయం 33.51 38.20 35.21 31.69 -
ఆర్టీసీ ఉద్యోగులకు టి.ఇంక్రిమెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో చివరిసారిగా పొం దిన దానికి సమానమైన ఇంక్రిమెంటును మంజూరు చేస్తూ రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీఎస్ ఆర్టీసీలో వివిధ దశల్లో పని చేస్తున్న 58,770 మంది అధికారులు, ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తమ రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక పెంపుతో 56 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇంద్ర బస్సుల పేర్లను రాజధానిగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ ఇంక్రిమెంట్లు ప్రకటించడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.