breaking news
Tealanga
-
యూఏఈకి ఉచిత వీసాలు.. అబుదాబి కంపెనీ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు అబుదాబిలోని ఏడీఎన్హెచ్ కంపెనీ (Abu Dhabi company) తెలంగాణలోని జీటీఎం సంస్థ ద్వారా ఉచితంగా వీసాలను (free visa) జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పలుమార్లు అనేకమందికి ఉచితంగా వీసాలు ఇచ్చిన ఈ సంస్థ..మరోసారి ఉచిత వీసాల జారీ కి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏడీఎన్హెచ్ కంపెనీ క్లీనింగ్, క్యాటరింగ్ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తోంది. ఈనెల 10న జగిత్యాలలో, 11న నిజామాబాద్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉన్న యువకులకు అర్హత వయస్సు 21 నుంచి 38 ఏళ్ల వరకూ ఉండొచ్చని జీటీఎం సంస్థ చైర్మన్ చీటి సతీష్రావు ‘సాక్షి’తో చెప్పారు.బేసిక్ ఇంగ్లిష్ వచ్చి ఉండాలని, పచ్చబొట్టు కనబడకుండా ఉండాలని తెలిపారు. ఒరిజినల్ పాస్పోర్టుతో జగిత్యాల లేదా నిజామాబాద్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. ఎంపికైన వారికి రూ. 23 వేల వరకూ వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్టు వెల్లడించారు. ఎవరికీ నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు జీటీఎం సంస్థ నిజామాబాద్ (8686860999), ఆర్మూర్ (8332062299), జగిత్యాల (8332042299), సిరిసిల్ల (9347661522) నంబర్లలో సంప్రదించాలని సతీష్రావు సూచించారు. -
ఎట్టకేలకు సునీల్ అరెస్ట్
సాక్షి, నిజామాబాద్ : వాణిజ్యపన్నులశాఖలో పన్ను ఎగవేత కుంభకోణం కేసులో ఏ–2 నిందితుడు సునీల్ను సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ట్యాక్స్కన్సల్టెంట్ శివరాజ్ కుమారుడైన ఈ సునీల్ను సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు సీఐడీ అధికారులు హైడ్రామా నడిపారు. శివరాజ్తో పాటు, సునీల్ కూడా సుమారు మూడు నెలలుగా పరారీలో ఉన్నాడు. శివరాజ్ను గతనెల 23న అరెస్టు చూపించిన సీఐడీ అధికారులు, మరో నెల రోజుల అనంతరం సునీల్ను అరెస్టు చేయగలిగారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, కొందరు వ్యాపారులు కలిసి రూ.వందల కోట్లలో వ్యాట్, సీఎస్టీ ఎగవేశారు. ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, ఆయన కుమారుడు సునీల్లు ఈ కుంభకోణాన్ని నడిపారు. ఈ వ్యవహారంపై బోధన్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఫిబ్రవరి మొదటి వారంలో బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివరాజ్, సునీల్లతో పాటు, బోధన్ సీటీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీఓ విజయ్కృష్ణ, మరో ఇద్దరు సిబ్బంది హన్మాన్సింగ్, వేణుగోపాల్లపై కేసు నమోదైన విషయం విధితమే. ఈ కేసులో మిగిలిన నలుగురు ఇప్పటికే అరెస్టు కాగా, తాజాగా సునీల్ కూడా అరెస్టు అయ్యాడు.