మరో వివాదానికి తెర లేపారు..
బంగ్లాదేశ్ బౌలర్ చేతిలో ధోని తల ఇంటర్నెట్లో పోస్టర్ హల్చల్
ఢాకా: భారత్తో మ్యాచ్ అంటే ఇప్పటిదాకా పాకిస్తాన్ అభిమానులు మాత్రమే యమ సీరియస్గా తీసుకునేవారు. కానీ గత ఏడాదికాలంగా బంగ్లాదేశ్ క్రికెట్ ప్రేమికులు కూడా ఎందుకో ధోని సేనతో మ్యాచ్ అంటే కసితో ఊగిపోతున్నారు. తాజాగా ఇరు జట్ల మధ్య జరిగే ఆసియా కప్ టి20 ఫైనల్కు ముందు భారత కెప్టెన్ ఎంఎస్ ధోనిని అవమానపరుస్తూ ఓ వివాదాస్పద పోస్టర్ సోషల్ మీడియాలో పాకిపోతోంది. ధోని తలను బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ చేతిలో పట్టుకున్నట్టు ఈ గ్రాఫిక్ ఫొటో ఉంది. ఇది ఎవరు పెట్టారనేది తేలకపోయినా భారత అభిమానులను రెచ్చగొట్టేందుకన్నట్టుగా కనిపిస్తోంది.
గతేడాది కూడా భారత జట్టు సభ్యులను అవమానకరంగా చిత్రీకరించిన ఫొటో అక్కడి పత్రికల్లో ప్రచురితమైంది. అప్పటి సిరీస్లో ముస్తఫిజుర్ రహమాన్ బౌలింగ్లో భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేందుకు తెగ ఇబ్బందిపడ్డారు. ఈ వైనాన్ని గుర్తుచేస్తూ భారత క్రికెటర్లకు ముస్తఫిజుర్ కట్టర్స్తో గుండు గీసినట్టుగా ఆ ఫొటోను ప్రచురించారు.