‘కృష్ణ కృష్ణా...’
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా చెన్నై నగర వాసులు కృష్ణ జపం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రానికి ఏటా అందాల్సిన కృష్ణా జలాలు ముఖం చాటేయడమే ఇందుకు కారణం. తెలుగుగంగ పథకం కింద కృష్ణా నదీ జలాలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కండలేరు రిజర్వాయరు మీదుగా చెన్నైకి ప్రవహించాల్సి ఉంది. పథకం ఒప్పందం ప్రకారం చెన్నై దాహార్తికి ఏటా 12 టీఎంసీల జలాలు చేరాల్సి ఉంది. కారణాలు ఏవైనా 19 ఏళ్లలో ఏనాడూ పూర్తి స్థాయిలో నీరు అందలేదు. 2011-12లో అధికంగా 8 టీఎంసీల నీరు అందింది. 2014-15లో మార్చి ఆఖరుకి ఏపీ ప్రభుత్వం 4.7 టీఎంసీల నీటిని అందజేసింది. చెన్నై దాహార్తిని తీర్చే పుళల్, చోళవరం, చెంబరబాక్కం, పూండి రిజర్వాయర్లలో నీటి మట్టం రోజు రోజుకూ దారుణంగా పడిపోతోంది.
ఇటువంటి క్లిష్టదశలో కృష్ణ నీటి విడుదలను ఇటీవల అకస్మాత్తుగా నిలిపివేయగా, చెన్నైలోతాగునీటి సరఫరాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఏపీలో వ్యవసాయ అవసరాల కోసం చెన్నైకి తాగునీటిని నిలిపివేసినట్లు ఇక్కడి అధికారులు తెలుసుకున్నారు. కండలేరులో 1500 ఘనపుటడుగుల నీటిని విడుదల చేసినా చెన్నైకి చేరుకునేసరికి కేవలం 250 ఘనపుటడుగులే మిగులుతోంది. పది రోజులుగా కృష్ణనీటి ప్రవాహం నిలిచిపోవడంతో పూండి నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. 3,232 మిలియన్ ఘనపుటడుగుల సామర్థ్యం కలిగిన పూండిలో మంగళవారం కేవలం 107 మిలియన్ ఘనపుటడుగుల నీరు మాత్రమే నిల్వ ఉంది. చెన్నై దాహార్తికి రోజుకు 900 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా ప్రస్తుతం కేవలం 600 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే అందుతోంది.
ఈ లోటును భర్తీ చేసేందుకు రెండు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పరిస్థితిని అధగమించేందుకు ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ప్రజాపనులశాఖ అధికారులతో సమావేశమై తాగునీటి అవసరాలను సమీక్షించారు. తాగునీటి ఎద్దడి తీవ్రం కాకముందే అధికారులు ఆంధ్రప్రదేశ్కు చేరుకుని నీటి విడుదలపై ఒత్తిడి తేవాలని ఆదేశించారు. కృష్ణాజలాల విడుదలపై ప్రజా పనులశాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, 2014-15 అంధ్రప్రదేశ్ నుంచి నిరంతరాయంగా నీరు విడుదల కాలేదన్నారు. మూడు సార్లకు పైగా నీటి విడుదలను నిలిపివేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, ప్రజాపనుల శాఖ కార్యదర్శి పళనియప్పన్ తదితర అధికారులు ఆంధ్రప్రదేశ్కు వెళ్లి చర్చలు జరిపిన అనంతరం నీటిని విడుదల చేశారని చెప్పారు.
అయితే రెండు రోజుల క్రితం మళ్లీ నీరు నిలిచిపోయిందని తెలిపారు. కృష్ణనీటిని విడుదల చేయాలని ఫోన్ ద్వారా తరచూ సంప్రదిస్తూనే ఉన్నామని, అయితే ఏపీ అధికారుల నుంచి ఖచ్చితమైన సమాధానం రావడం లేదన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం దృష్టికి తీసుకురాగా ఏపీకి మరోసారి వెళ్లి కృష్ణనీటిని రాబట్టుకోవాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. తాగునీటి కోసం విడుదల చేస్తున్న నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారని, అందువల్లనే నీటిని నిలిపివేసినట్లు ఏపీ అధికారులు ఆరోపిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చేనెల 10వ తేదీ నుంచి మరలా నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించినట్లుగా ఆంధ్రప్రదేశ్ అధికారుల నుంచి సమాచారం అందిందని, అయితే ఆ నిర్ణయం అమలయ్యేవరకు నమ్మలేమని వ్యాఖ్యానించారు.