నాది ‘రెడ్’ కార్పెట్ గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓటర్లను ఎవరెన్ని రకాల ప్రలోభాలకు గురిచేసినా, అభివృద్ధి, సుపరిపాలన అంటూ ఊకదంపుడు ప్రచారాలు చేసినా ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు మాత్రం తనదేనంటున్నారు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వామపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి సూరం ప్రభాకర్రెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల అధ్యక్షుడిగా 1982లో పనిచేసినప్పటి నాటినుంచి మూడు దశాబ్దాలుగా నమ్ముకున్న సిద్ధాంతం నుంచి తప్పుకోకుండా పనిచేస్తున్న తన నేపథ్యమే తనకు బలమైన పునాది అని అంటున్నారాయన. ఈసారి ఎన్నికల రంగంలో ఇతర పార్టీలు తనకు ప్రత్యర్థులే కావని అంటున్న సూరం ప్రభాకర్రెడ్డి.. సోమవారం ‘సాక్షి’ చేసిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటలు వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలివి...
సాక్షి: ప్రచారం ఎలా జరుగుతోంది? పట్టభద్రుల నుంచి స్పందన ఎలా ఉంది?
సూరం: ప్రచారం చాలా బాగా సాగుతోంది. మూడు జిల్లాల పట్టభద్రులు చాలా అపూర్వంగా స్వీకరిస్తున్నారు. ఈ నెలలోనే జరిగిన సీపీఎం, సీపీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆయా పార్టీల మహాసభల వేదికలపై నన్ను అభ్యర్థిగా ప్రచారం చేశారు. న్యూడెమొక్రసీ పార్టీ మూడు జిల్లాల విస్తృత స్థాయి సమావేశం ఖమ్మంలో నిర్వహించి నన్ను అభ్యర్థిగా పరిచయం చేశారు. నా అభ్యర్థిత్వ ప్రతిపాదన వచ్చిన 10 నిమిషాల్లోనే 10 వామపక్ష పార్టీలు సమ్మతించాయి. దీంతో వామపక్షాల కేడర్ నాకు పూర్తిగా సహకరిస్తోంది. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యునిగా నాకున్న పరిచయాలు కూడా నన్ను ముందుకు తీసుకెళుతున్నాయి. నా పాతమిత్రులంతా పోలీస్, రెవెన్యూ, విద్యా శాఖల్లో పనిచేస్తున్నారు. వారి సహకారం కూడా నాకు ఉపయోగపడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా నేపథ్యమే నా ప్రచారానికి పునాది. అదేవిధంగా ఇంత మంది క మ్యూనిస్టులను ఒకేసారి చూస్తే కనుల పండవగా ఉందని ఖమ్మంలో మార్నింగ్ వాక్ పరిచయంలో ఓ వ్యక్తి చెప్పడం చాలా ఆనందం కలిగించింది.
సాక్షి: దేశవ్యాప్తంగా వామపక్షాల బలం తగ్గుతున్న నేపథ్యంలో అనూహ్యంగా ఆ పార్టీల తరఫున ఒక బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎలా తెరపైకి రాగలిగారు?
సూరం: వాస్తవానికి నిన్నటివరకు వామపక్షాల్లో ఐక్యత లేదు. వామపక్షాలకు కొన్ని స్థానాలు తగ్గినమాట వాస్తవమే అయినా, వారి సైద్ధాంతిక పునాదులు అంతే ఉన్నాయి. అయితే, ఎన్నికల విజయాలు లేకపోవడం వల్ల వామపక్షాల బలం తగ్గిందనే భావనలో ప్రజలున్నారు. ఈ పరిస్థితుల్లో వామపక్షాలన్నీ ఐక్యంగా ఉండాలనే భావనకు ఆయా పార్టీలు కచ్చితంగా వచ్చాయి. అభ్యర్థిగా నన్ను ప్రకటించడంలో కొంత ఆలస్యం జరిగింది. కానీ పార్టీ కేడర్ నన్ను ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇక, నా బలమంటారా... విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలానే ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాను. సామాజిక ఉద్యమాలకు ఎప్పుడూ నేను దూరంగా లేను. మొదటి నుంచీ మడమ తిప్పకుండా నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని అంటిపెట్టుకుని ఉండడమే నా బలం. లేదంటే ఈ సమయానికి నేను కూడా టీఆర్ఎస్లో ఉండాల్సిన వాడిని.
సాక్షి: డిఫీట్ మనీ... రిపీట్ ఢిల్లీ అంటున్నారు... మిమ్మల్ని గెలిపించడం ద్వారా ప్రశ్నించే గొంతుక బతికించమంటున్నారు..? ఈ నినాదాలే మీ విజయానికి సరిపోతాయా?
సూరం: నినాదాలు మాత్రమే విజయ సోపానాలు కావు. అవి ప్రజలను చైతన్యపరిచే ఆయుధాలు. కానీ, డబ్బుతోనే ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం భ్రమే అవుతుంది. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ అధ్యక్షుడిగా నేను పోటీచేసినప్పుడు అయిన ఎన్నికల ఖర్చు 650 రూపాయలే. డబ్బు ఖర్చు, ప్రలోభాలకు మొదటి నుంచీ మేం వ్యతిరేకం. అప్పుడు టి.సుబ్బిరామిరెడ్డి డబ్బు ఖర్చు పెట్టి నన్ను ఓడించాలనుకున్నా సాధ్యం కాలేదు. డబ్బే కావాలంటే డాక్టర్ చుక్కారామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్లు మండలికి వెళ్లగలిగే వారా? కేవలం 20 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ 67 మంది ఎమ్మెల్యేలను గెలవగలిగింది. డబ్బు, అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగం ముప్పేట దాడి చేసినా ప్రజలు ఎదురొడ్డి నిలిచారు. విద్యావంతులు ప్రలోభాలకు గురికారని నా భావన.
సాక్షి: మీకు న్యూడెమొక్రసీ మద్దతిస్తోంది. ఆ పార్టీకి అజ్ఞాత దళాలు కూడా ఉన్నాయి. వారిది బుల్లెట్ పార్టీ... మీరు బ్యాలెట్ పోరులో ఉన్నారు.. బుల్లెట్, బ్యాలెట్ ఒకే ఒరలో ఇముడుతాయా?
సూరం: పార్టీల విధానాలు ఎలా ఉన్నా.. ప్రజలు ఎప్పుడు ఏ పోరాటాలు చేయాలో బాగా తెలుసు. అందుకే నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం పెద్ద ఎత్తున సాగింది. అప్పుడే పీడీఎఫ్ పేరుతో సీపీఐ ఎన్నికలలో పాల్గొంది. ఇక్కడ బుల్లెట్.. బ్యాలెట్ రెండూ అస్త్రాలే. అయితే, ఆ ప్రయోగం ప్రజల ఇష్టానుసారం జరుగుతుంది. కానీ, ఈ ప్రభుత్వ పనితీరుపై బుల్లెట్గా ఈసారి విద్యావంతులు బ్యాలెట్ను ఉపయోగించాలి.
సాక్షి: ప్రతిపక్షం ఓడిపోతే ప్రభుత్వం పడిపోదని ప్రచారం చేస్తున్నారు...మరి అధికార పక్షం గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది కదా? మీకెందుకు ఓటు వేయాలి?
సూరం: అధికార పార్టీకి అసెంబ్లీలో తగినంత మెజార్టీ ఉంది. అయినా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంటున్నారు. మంత్రి పదవులు ఇస్తున్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధికి ఈ ఒక్క ఎమ్మెల్సీ స్థానం అడ్డంకి కాదు. ప్రతిపక్షం గెలిస్తే అధికార పక్షం చేసే త ప్పులను ఎత్తిచూపి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయవచ్చు.
సాక్షి: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లలో మీకు ప్రత్యర్థులెవరనుకుంటున్నారు?
సూరం: వీరిలో ఎవరూ మాకు ప్రత్యర్థులు కారు. బీజేపీ ఏకంగా సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎప్పుడో అభ్యర్థి ఖరారయ్యారు కాబట్టి డబ్బు ఖర్చు చేస్తోంది. ఇంటికో కేలండర్ పంపింది. ఇక, టీఆర్ఎస్ పక్షాన ఏకంగా మంత్రులే రంగంలోకి దిగి మీటింగ్లు పెడుతున్నారు. ఇక, కాంగ్రెస్ పూర్తిగా చతికిలబడిపోయింది. ఆ పార్టీ కేవలం ఉనికి కోసమే అభ్యర్థిని పెట్టింది తప్ప గెలవాలనే ఆలోచనతో కాదు.
సాక్షి: ఎమ్మెల్సీగా గెలిస్తే మీ ప్రాధాన్యాలేంటి? ఏయేసమస్యలపై పనిచేయాలనుకుంటున్నారు?
సూరం: నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఈ మూడు జిల్లాల యువత తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతా. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, ఉచిత విద్య కోసం పనిచేస్తా. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. నన్ను ఆశీర్వదించండి.