ముస్లింలూ యోగా చేయొచ్చు: మతగురువు
అంతర్జాతీయ యోగా ఉత్సవాలలో ముస్లింలు కూడా పాల్గొనవచ్చని, అందులో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉండవు కాబట్టి భేషుగ్గా వాటికి వెళ్లొచ్చని సున్నీ మత గురువు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగా మహాలీ చెప్పారు. యోగా ఆరోగ్యానికి మంచిదని, అందువల్ల దాన్ని అందరూ ఆచరించవచ్చని ఆయన చెప్పారు. అయితే ముస్లింలు మాత్రం యోగా ఉత్సవాలలో ఏవైనా పూజలుంటే వాటిలో పాల్గొనకుండా దూరంగా ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు.
జూన్ 21వ తేదీన లక్నోలోని రమాబాయి అంబేద్కర్ మైదాన్లో నిర్వహించే అంతర్జాతీయ యోగ ఉత్సవాలలో 55వేల మంది ప్రజలతోపాటు సుమారు 300 మంది ముస్లిం పురుషులు, మహిళలు కూడా పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. మీరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారా అన్న ప్రశ్నకు.. పాల్గొనాలనే ఆలోచిస్తున్నట్లు చెప్పారు. అయితే తనకు ఆహ్వానం వస్తే వెళ్తానన్నారు. 2014 సంవత్సరంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించింది. తొలిసారిగా ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత సంవత్సరం ఈ ఉత్సవాలు చండీగఢ్లో జరిగాయి.