breaking news
Summer classes
-
వేసవిలో పదో తరగతి పాఠాల బోధన
తొమ్మిదో తరగతి వరకు చదివిన విద్యార్థులు 10వ తరగతికి వేరే పాఠశాలకు వెళ్లిపోకుండా కట్టడి చేయడానికి కార్పొరేట్ యాజమాన్యాలు వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్ బోధించడం మొదలుపెట్టాయి. తద్వారా విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా పోయాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడైనా విహార యాత్రకు వెళ్లడానికి కూడా వీలు లేకుండా కార్పొరేట్ స్కూళ్లు వ్యవహరిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. తిరుపతి ఎడ్యుకేషన్ : ఉన్నత విద్యకు వారధి ఇంటర్. దీని తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల్లో చేరేందుకు జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇదే సాకుగా ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలతో పాటు బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఈ వింత పోకడ కాస్త స్కూళ్లకు పాకింది. వేసవిలో తరగతులు నిర్వహించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కి తరగతులు నిర్వహిస్తున్నాయి. తొమ్మిదో తరగతి ముగించుకున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్ను బోధిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలే కాకుండా సాధారణ పాఠశాలలు ఈ పంథాను అవలంబిస్తూ విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నాయి. తిరుపతి నగరంలో దాదాపుగా 160 వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. పాఠశాలల మధ్య పోటీ పెరిగింది. ఈ పోటీని తట్టుకుని నిలబడేం దుకు కొన్ని పాఠశాలలు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకా రం కాకుండా ముందస్తుగానే పదో తరగతిలో సిలబస్ను పూర్తి చేయించి, విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఒక రకంగా ఇది విద్యార్థులకు మేలు చేకూరే అంశమే అయినప్పటికీ విద్యార్థుల హక్కులను కాలరాస్తూ వేసవిలో తరగతులు నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. వేసవిలో పదో తరగతి సిలబస్ కార్పొరేట్ తరహాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్ను బోధిస్తున్నాయి. విద్యాశాఖ నిబంధనలకు ఇది విరుద్ధం. ఏప్రిల్ 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 13న పునఃప్రారంభించాలి. ఈ నిబంధనలను కొన్ని పాఠశాలలు పాటించడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖాధికారులు చోద్యం చూస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పదికి 10 జీపీఏ కోసమేనంటూ పోటీ ప్రపంచానికి దీటుగా రాణించాలంటే చదువు తప్పనిసరి అంటూ పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ విద్యార్థులను వేసవి సెలవులకు దూరం చేస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో పదికి 10 జీపీఏ సాధిం చాలంటే ఇప్పటి నుంచే చదవాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. తిరుపతిలోనే కొన్ని పాఠశాలలు సెలవులు ఇవ్వకుండా తొమ్మిదో తరగతి విద్యార్థులకు తరగతులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మార్కుల మాయలో ç తల్లిదండ్రులు సైతం అభ్యంతరం చెప్పకుండా ఊరకుంటున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలని, లేకుంటే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించిన వారమవుతామని మేధావులు హెచ్చరిస్తున్నారు. హక్కులను కాలరాయొద్దు కొన్ని విద్యాసంస్థలు విద్యాశాఖ నిబంధనలను పాటించకుండా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నాయి. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలకు వేసవి సెలవులు ఆటవిడుపునిస్తాయి. మానసికోల్లాసాన్ని కలిగి స్తాయి. ఒత్తిడి దూరమవుతుంది. అయితే మార్కుల పేరుతో వేసవి సెలవుల్లో తొమ్మిదో తరగతి ముగించుకున్న విద్యార్థులకు పదో తరగతి సిలబస్ను బోధిస్తున్నాయి. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే ఊరుకోం.– వడిత్య శంకర్నాయక్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, జీవీఎస్ కఠిన చర్యలు తీసుకుంటాం విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవుల్లో ఎటువంటి తరగతులూ నిర్వహించకూడదు. ఇప్పటికే ఎంఈఓ, సీఆర్పీల ద్వారా వేసవిలో తరగతులు నిర్వహించకూడదంటూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశాం. నిబంధనలు అతిక్రమించి వేసవి తరగతులు నిర్వహిస్తే ఆయా పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు సిఫా రసు చేస్తాం. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. – సీ విజయేంద్రరావు, ఉప విద్యాశాఖాధికారి, తిరుపతి -
36 కార్పొరేట్ కాలేజీలకు తాళం
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతులను నిర్వహిస్తున్న 36 కార్పొరేట్ కాలేజీలకు శుక్రవారం ఇంటర్ విద్యా అధికారులు తాళాలు వేశారు. తనిఖీల్లో ఆయా కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడి కావడంతో నోటీసులు జారీ చేసి బంద్ చేయించారు. మేడ్చెల్ జిల్లాలో 13, హైదరా బాద్లో 15, రంగారెడ్డి జిల్లాలో 8 కాలేజీలకు తాళాలు వేశారు. -
విద్య పట్ల ఆసక్తిని పెంచడానికే...
నందిగామ(కొత్తూరు): విద్యా పట్ల మరింత ఆసక్తిని పెంచడానికే ప్రభుత్వం విద్యార్థులకు వేసవి తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై వేసవి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అమె మాట్లాడుతూ.. ఎండల్లో తిరగకుండా విద్యార్థులు చక్కగా తరగతులకు హాజరు కావాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఉండే పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు వేసవి తరగతుల్లో భాగంగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధించడం జరుగుతుందన్నారు. తద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించి అంతకు ముందు తరగతుల్లో బీసీ గ్రేడుల్లో ఉంటే మరింత రాణిస్తారని తెలిపారు. అనంతరం డీఈవో నాంపల్లి రాజేష్ మాట్లాడుతూ.. వేసవి తరగతులు నిర్వహించే ఉపాధ్యాయులకు ఇది వరకే శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఆటపాటల ద్వారా ఆహ్లాదకరంగా ఉపాధ్యాయులు బోధిస్తారని తెలిపారు. వేసవి తరగతులు 33 మూడు రోజులు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. తరగతుల నిర్వహణకు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ ఈటా గణేష్, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లు కిష్టయ్య, రత్నం, నాయకులు ఆల్వాల వెంకటయ్య, జహీరోద్దిన్, జంగయ్య, సురేష్, ఆశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ, తహశీల్థార్ నాగయ్య, ఇన్చార్జీ ఎంఈవో రాఘవారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు స్వాములు తదితరులు పాల్గొన్నారు.