breaking news
strike postpone
-
విద్యుత్ ఉద్యోగుల సమ్మె వాయిదా
సాక్షి,అమరావతి: విద్యుత్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యం మంగళవారం జరిపిన చర్చలు అర్ధరాత్రి దాటిన తరువాత అసంపూర్తిగా ముగిశాయి. విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ ఎస్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, సహాధ్యక్షుడు కేవీ శేషారెడ్డి, 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ గోపాలరావు, జేఏసీ కన్వినర్ ఎంవీ రాఘవరెడ్డిలతో కూడిన దాదాపు 30 మంది సభ్యుల బందం చర్చలకు వెళ్లింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు, ఏపీజెన్కో ఎండీతో కూడిన అధికారుల బృందం వారితో చర్చలు జరిపింది. జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లలో ప్రధాన సమస్యలను స్టీరింగ్ కమిటీ తిరస్కరించింది. అయితే ఈ నెల 16న రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ∙పర్యటన ఉన్న నేపథ్యంలో సమ్మెను రెండు రోజులు వాయిదా వేయాల్సిందిగా జేఏసీని ప్రభుత్వం కోరింది. అలాగే 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ చర్చలకు రావాల్సిందిగా ఆహ్వా నించింది. దీంతో ఆ రోజు వరకూ సమ్మె వాయిదా వేస్తున్నామని, చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని జేఏసీ ప్రకటించింది. మరోవైపు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థల కార్యాలయాల్లో ఉద్యోగులు ‘వర్క్ టు రూల్’ పాటించి నిరసన తెలిపారు. ప్రధాన డిమాండ్లకు లభించని అంగీకారం: విద్యుత్ సంస్థల్లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సంస్థల్లో విలీనం చేయడానికి సీఎం చంద్రబాబు ఒప్పుకోవడం లేదని జేఏసీ నేతలతో చర్చల సందర్భంగా స్టీరింగ్ కమిటీ వ్యాఖ్యానించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా 100 శాతం ఇవ్వడం కుదరదని, 50 శాతం ఇవ్వడానికి ఆలోచిస్తామని కమిటీ చెప్పిందని వారు తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం, జూనియర్ లైన్ మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంటు)లకు విద్యుత్ సంస్థల్లో అమలులో ఉన్న పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయడం వంటి ప్ర«దాన డిమాండ్లపై చర్చల్లో సానుకూలత రాలేదు. సమ్మెలో పాల్గొంటే చర్యలు సమ్మె చేపడుతున్నట్లు జేఏసీ చేసిన హెచ్చరికల నేపధ్యంలో విద్యుత్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. సమ్మెలో పాల్గొని విధులకు హాజరుకాని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలను రోజూ సాయంత్రం 5 గంటలకల్లా హెచ్ఆర్డీ చీఫ్ జనరల్ మేనేజర్కు అందజేయాల్సిందిగా ఆదేశించారు. ఆ జాబితా ప్రకారం సమ్మెలో పాల్గొనే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాయి. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు మంగళవారం అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)లను ఆదేశించారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న తలపెట్టిన సమ్మెను వాయిదా వేశాయి. ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు ప్రారంభించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంగీకరించడం ఇందుకు కారణం. తొమ్మిది బ్యాంకు యూనియన్లకు నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్బీయూ) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఐబీఏతో చర్చలు జూలై 1 నుంచి మొదలు కానున్నాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని ఉద్యోగ సంఘాలు బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నాయి. పింఛన్ దారులందరికీ పెన్షన్ను నవీకరించడం, సవరించడంతోపాటు జాతీయ పెన్షన్ పథకాన్ని తొలగించడం, బ్యాంకు ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి డిమాండ్ల జాబితాలో ఉన్నాయి. -
నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి!
- నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి! - ఢిల్లీ హైకోర్టు జోక్యంతో సమ్మె నిలుపుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మంగళ, బుధ వారాల్లో తలపెట్టిన సమ్మె వాయిదాపడింది. సమ్మెను నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులివ్వటంతో యూనియన్లు సమ్మెను వాయిదా వేశాయి. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు వేసిన రిట్ పిటీషన్ మీద విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఎస్బీహెచ్ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో సమ్మె వాయిదా పడినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) కార్యదర్శి బీఎస్ రాంబాబు చెప్పారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏఐబీఈఏ ఈ నెల 12 (నేడు), 13న (రేపు) సమ్మెకు పిలుపునివ్వడం తెలిసిందే. డిమాండ్లపై జరిపిన చర్చల్లో యాజమాన్యాలు నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ తేకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మె జరపాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అయితే, ఈలోగా న్యాయస్థానం ఆదేశాలు వెలువడటంతో వాయిదా వేశాయి.


