breaking news
Stress in the office
-
ఒత్తిడిని ఓడించలేక...
సాక్షి, బెంగళూరు: ఇంటా, బయటా పనుల హడావుడిలో గజిబిజి జీవితాన్ని సాగిస్తున్న నేటి తరం మహిళలు పనిఒత్తిళ్ల కారణంగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగానే ఉద్యోగినుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని అసోచామ్ సంస్థ ఇటివల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అసోచామ్ సంస్థ తన సర్వేలో భాగంగా బెంగళూరు నగరంలో అటు గృహిణిగా, ఇటు ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన కలిగించే కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. లైఫ్ సైటల్ డిసీజెస్ అధికం... సర్వేలో భాగంగా నగరంలోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న 2,800 మంది ఉద్యోగినుల వివరాలను సేకరించారు. వీరిలో దాదాపు 75 శాతం మంది ఉద్యోగినులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 32 నుండి 58 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ముఖ్యంగా వీరంతా ఒబేసిటీ, డయాబిటీస్, హైపర్టెన్షన్ వంటి లైఫ్ సైటల్ డిసీజెస్తో పాటు వెన్నెముకలో నొప్పి, గుండె, కిడ్నీ తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ఇక సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల కాల్షియం కొరత, రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఉద్యోగినుల్లో ఇంతమంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడడానికి కారణాలు తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేయక మానదు. ఎందుకంటే వీరంతా కనీసం డాక్టర్ను కలిసేందుకు కూడా సమయం లేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని అసోచామ్ సర్వే వెల్లడించింది. ఇక మరికొంతమందేమో తమ ఆరోగ్య సమస్యలకు ఇంటి వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. కాగా ఇంటిని నడిపేందుకు తాము ఉద్యోగం చేయాల్సి వస్తోందని, వైద్యం చాలా ఖరీదవుతున్న ప్రస్తుత రోజుల్లో తాము వైద్య పరీక్షల కోసం ప్రతిసారీ డబ్బు వెచ్చించడం అంటే కష్టమని మరికొందరు మహిళలు ఈ సర్వేలో తెలిపారు. భయం కూడా ఒక కారణమే... ఉద్యోగినులు ఇలా ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడానికి గల ప్రముఖ కారణాల్లో ఉద్యోగ భయం కూడా ఒకటని అసోచామ్ నివేదిక వెల్లడించింది. నగరంలోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగినుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. సరైన సమయానికి తిండి, సరైన పనివేళలు కూడా కార్పొరేట్ సంస్థల్లో కనిపించడం లేదంటే నమ్మకతప్పదు. ఇక ఉద్యోగ బాధ్యతల్లో ఇచ్చిన లక్ష్యాలను అందరికన్నా ముందుగా పూర్తి చేయాలని, లేదంటే తమ ఉద్యోగాలను ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అనే భయం మహిళలను వెంటాడుతోంది. అందుకే తమ ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అటు ఇళ్లు, ఇటు ఆఫీసు పనులతో నిత్యం సతమతమవుతున్నారు. దీంతో వారిలో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వైద్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దు... సాధారణంగా ఒక గృహిణిగా ఉండడంతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వర్తించే మగువల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉంటుంది. అది కూడా 30 ఏళ్లు దాటితే ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. అందుకే ఏడాదికోసారి తప్పనిసరిగా మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా స్తన, గర్భాశయ క్యాన్సర్లను చాలా వరకు నిరోధించవచ్చు. ఇక ఎంత పని ఒత్తిడితో ఉన్నా కూడా సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా లైఫ్సైటల్ డిసీజెస్ను అరికట్టవచ్చు. ఇంటిని నడిపే మహిళ ఆరోగ్యంలో సమస్యలు తలెత్తితే ఆ ప్రభావం కుటుంబమంతటిపైనా పడుతుందని మరిచిపోవద్దు. -డాక్టర్ ఫాతిమా, కర్ణాటక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి -
కాలమే మారుస్తుంది
మనోగతం ఆకలేసినా, దాహం వేసినా నా భార్యని పిలవమని నా నోటికి చెప్పక్కర్లేదు. ఇంటికీ, భర్తకి, పిల్లలకు మాత్రమే సమయం కేటాయించే ఆడవాళ్లకు ఆ మూడే ప్రపంచం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదా! ఇప్పుడంటే ఈ రోజని కాదు...మార్పు వచ్చి ముప్పైఏళ్లవుతుంది. ఎప్పుడైతే భర్తతో పాటు భార్య కూడా ఉద్యోగం చేయడం మొదలుపెట్టిందో అప్పుడే మార్పు వచ్చేసింది. ‘‘నా ముఖం మారింది. ఇల్లాలిగా ఇంత వండి పడేసి హాయిగా పిల్లల కోసం, భర్త కోసం ఎదురుచూడాల్సిన మేం ఉద్యోగాలపేరుతో వందమందికి వండిపెడుతున్నట్లుంది. ఇంట్లో పని గురించి ఆఫీసులో చెప్పలేం, ఆఫీసులో ఒత్తిడి గురించి ఇంట్లో చెప్పలేం’’ అని మా పక్కింటి ఆంటీ మా ఆవిడతో అంటుంటే విన్నాను. దానికి నా భార్య... ‘‘పెళ్లయిన కొత్తలో మావారు నన్ను ఉద్యోగం చేయొద్దన్నారండి. నేనే... పట్టుబట్టి, పోట్లాడి మరీ ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు సరదా తీరిపోతోంది. ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాక ఉద్యోగం మానాలంటే మనసొప్పడంలేదు’’ అంటూ నా భార్య వాపోవడం కూడా విన్నాను. మా ఇద్దరి ఆఫీసులు పక్కపక్కనే ఉంటాయి. ఒకోసారి ఇద్దరం కలిసి ఇంటికొస్తాం. ఒకోసారి జాలేస్తుంటుంది. వద్దంటే ఉద్యోగంలో చేరింది. వంట సరిగ్గా కుదరలేదని, నన్నూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని చిన్న చిన్న గొడవలతో పదేళ్లు గడిపేశాం. ఇప్పుడు తను నిజంగా విసుగొచ్చి ఉద్యోగం మానేస్తే నా చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అలాగని ఆమెకు పనుల్లో సాయం చేయగలనా అంటే నా వల్లకాదు. ఏం సాయం చేయాలి. పొద్దునే చీపురు పట్టుకుని ఊడ్చలేను కదా! గిన్నెలు కడగలేను కదా! ఒకసారి నా భార్య ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి పది దాటిపోయింది. నేను నా ఇద్దరు పిల్లలు (మగపిల్లలు) ఎదురుచూస్తూ కూర్చున్నాం. కొద్దిగా అన్నం ఉంటే చిన్నాడికి పెట్టాను. పెద్దాడు ఫ్రిజ్ తెరిచి పండ్లకోసం వెదికాడు. ఇంట్లో ఏమీ లేవు. ‘నాన్నా మీకు వంట చేయడం రాదా...’ అన్నాడు పెద్దాడు. ‘వచ్చు.. కాని ఎప్పుడూ చేయలేదురా...’ అన్నాను. ‘అమ్మ ఎప్పుడు రావాలి, ఎప్పుడు వండాలి. వచ్చేటప్పటికి అమ్మకు కూడా ఆకలి వేస్తుంది కదా!’ అన్నాడు. నాకు చాలా సిగ్గనిపించింది. వెంటనే నా భార్యకు ఫోన్ చేశాను. అన్నం వండడానికి కుక్కర్లో నీళ్లెన్ని పోయాలో అడిగాను. పప్పు చేయడానికి కూడా అదే పద్ధతని చెప్పింది. అరగంటలో వంట రెడీ అయిపోయింది. మేం ఇద్దరం తింటుంటే తనొచ్చింది. ‘అమ్మా... నాన్న వంట చేశారు. నువ్వు కూడా మాతో తిను’ అని కొడుకన్న మాటలకు ఇంత మొహం చేసుకుని పళ్లెం అందుకుని అన్నం వడ్డించుకుంది. కొడుకు అడిగే వరకూ పొయ్యి దగ్గ-రికి వెళ్లలేదు నేను. నా కొడుకు అలా అడిగించుకోడు. మార్పుకున్న ప్రత్యేకతే అది కదా! - కమల్, దిల్షుక్నగర్