ముంబైలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ ..
సాక్షి, ముంబై: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఉదయం ముంబైకి వచ్చారు. మొదట ఉపాధి రంగంలో స్టీల్ డెవలప్మెంట్ అభివృద్ధి గురించి ఇండియా, ఆస్ట్రేలియా దేశాల అధికారుల మధ్య జరిగిన ఒక సెమినార్కు ఆయన హాజరయ్యారు. అందులో దత్తాత్రేయతోపాటు అస్ట్రేలియా పరిశ్రమల మంత్రి కూడా పాల్గొన్నారు.
వీరితోపాటు అస్ట్రేలియా ప్రతినిధుల బృందం, ఇండియా ప్రతినిధులు బృందం, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీజ్ ప్రతినిధుల బృందం పాల్గొన్నాయి. సెమినార్ తర్వాత మధ్యాహ్నం నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను అసెంబ్లీ హాలులో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాజ్ భవన్ వెళ్లి రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో కొంతసేపు భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన‘న్యూస్లైన్’తో కొంతసేపు ముచ్చటించారు.
ముంబైలో ఉన్న తెలుగు ప్రజల సమస్యలపై తాను సీఎంతో మాట్లాడానన్నారు. అలాగే తెలంగాణ ,మహారాష్ట్ర మధ్య సంబంధాల మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించామని చెప్పారు. బలపరీక్షల నెగ్గిన తర్వాత తెలంగాణ కు రావాలని సీఎంను తాను ఆహ్వానించినటు దత్తాత్రేయ వివరించారు.