Sri Lanka ODI series
-
కెప్టెన్గా ‘హిట్’ కొడతాడా!
భారత జట్టు తరఫున పదేళ్లలో 171 వన్డే మ్యాచ్లు... ఆరు వేలకు పైగా పరుగులు... కెప్టెన్గా ముంబై ఇండియన్స్ జట్టుకు మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రికార్డు... అన్నింటికి మించి వన్డేల్లో రెండు ‘డబుల్ సెంచరీలు’ సాధించిన ఏకైక ఆటగాడిగా గుర్తింపు... రోహిత్ శర్మ అద్భుత కెరీర్లో ఇవన్నీ చెప్పుకోదగ్గ ఘనతలు. ఇప్పుడు మరో అరుదైన అవకాశం రోహిత్ను వెతుక్కుంటూ వచ్చింది. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో అతను తొలిసారి భారత జట్టు కెప్టెన్గా బరిలోకి దిగబోతున్నాడు. కోహ్లి గైర్హాజరీలో ఇది తాత్కాలికమేఅయినా... టీమిండియా కెప్టెన్సీ అనేది గొప్ప గౌరవం అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనకు లభించిన పరిమిత సమయంలో రోహిత్ నాయకుడిగా తన సత్తా చూపించగలడా, ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తాడా అనేది ఆసక్తికరం..! సాక్షి క్రీడా విభాగం : మహేంద్ర సింగ్ ధోని 2007లో పూర్తి స్థాయి వన్డే కెప్టెన్గా నియమితుడైన తర్వాత భారత జట్టు కెప్టెన్సీ విషయంలో మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది. అయితే వేర్వేరు కారణాలతో మధ్యలో ధోని విశ్రాంతి కోరుకున్న సమయంలో తాత్కాలికంగా కొందరికి అవకాశం దక్కింది. సురేశ్ రైనా (12 వన్డేలు), గౌతమ్ గంభీర్ (6), విరాట్ కోహ్లి (17), అజింక్య రహానే (3 వన్డేలు) మధ్యలో వివిధ సిరీస్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఇదే కోవలో రోహిత్ శర్మ కూడా నాయకుడిగా మైదానంలో అడుగు పెడుతున్నాడు. అపార ప్రతిభ ఉన్నా దానికి తగిన న్యాయం చేయలేకపోయాడంటూ కెరీర్లో ఎక్కువ భాగం విమర్శలు ఎదుర్కొన్న రోహిత్, గత మూడేళ్లుగా తన అసలు సత్తాను ప్రదర్శిస్తూ బ్యాట్స్మన్గా తన స్థాయిని పెంచుకున్నాడు. జట్టులో సీనియర్ ఆటగాళ్ళలో ఒకడు కావడంతోపాటు టెస్టు వైస్ కెప్టెన్ రహానేకు వన్డే తుది జట్టులో చోటు ఖాయం కాకపోవడం వల్లే రోహిత్కు కెప్టెన్సీ అవకాశం దక్కిందనేది వాస్తవం. కోహ్లి శకంలో మున్ముందు ఇలాంటి చాన్స్ రావడం కష్టం కాబట్టి సొంతగడ్డపై రోహిత్ కెప్టెన్సీ నైపుణ్యానికి ఇది ఒక సవాల్ వంటిది. కోహ్లి ఆనాడే చెప్పాడు... ఆశ్చర్యకరంగా అనిపించినా నాలుగేళ్ల క్రితమే రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాల గురించి విరాట్ కోహ్లి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘రోహిత్కు అపరిమితమైన క్రికెట్ పరిజ్ఞానం ఉంది. మ్యాచ్లలో తరచుగా నేను అతడి నుంచి సలహాలు తీసుకుంటాను. భారత కెప్టెన్ కాగల సత్తా రోహిత్లో ఉంది’ అంటూ 2013 ఆగస్టులోనే కోహ్లి వ్యాఖ్యలు చేశాడు. అంతకు కొద్ది రోజుల క్రితమే చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా రావడంతో రోహిత్ కెరీర్ మలుపు తిరిగింది. అయితే కారణాలేమైనా జూనియర్ అయిన కోహ్లి దూసుకుపోవడం, కెప్టెన్గా కూడా తనదైన మార్క్ చూపించడం చకచకా జరిగిపోగా, రోహిత్కు మాత్రం కెప్టెన్సీ అవకాశం దక్కలేదు. అతని కెరీర్ను చిన్నప్పటి నుంచి చూసిన ముంబై మాజీ క్రికెటర్ల అభిప్రాయంలో ‘సోమరిపోతు’ అనే ముద్ర రోహిత్ను భారత జట్టు నాయకత్వానికి దూరం చేసింది. తనదైన రోజున అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగిపోయి రికార్డుల వరద పారించే రోహిత్ బాడీ లాంగ్వేజ్ మాత్రం ఏదో కోల్పోయినట్లుగా, నిరుత్సాహంగా కనిపిస్తుంది. అతని జట్టు సహచరులు కూడా ఈ విషయాన్ని అనేక సార్లు బహిరంగంగానే చెప్పారు. ఇటీవల శ్రీలంక గడ్డపై వన్డే, టి20 సిరీస్లలో వైస్ కెప్టెన్గా వ్యవహరించినప్పుడు కూడా అతనిలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక ఇప్పుడు రోహిత్ అగ్రశ్రేణి బ్యాట్స్మన్గా మాత్రమే కాకుండా, నాయకుడిగా అదనపు బాధ్యత తీసుకోవాల్సిన సమయంలో ఇలాంటివి కుదరవు. బ్యాట్స్మన్గా ఈ ఏడాది 18 వన్డేల్లోనే 5 సెంచరీలు సహా 1,076 పరుగులు చేయడం అతనికి కెప్టెన్గా అదనపు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. ఐపీఎల్తో భిన్నం... భారత కెప్టెన్సీ విషయంలో కోహ్లి, రోహిత్లలో ఎవరు గొప్ప అనే చర్చ గతంలో పలు మార్లు వచ్చింది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏ వైపు నుంచి కూడా రోహిత్కు పెద్దగా మద్దతు లభించలేదు. దూకుడులో, బాధ్యత తీసుకొని నడిపించడంలో అతను కోహ్లితో పోలికలో సమఉజ్జీ కాలేకపోయాడు. నిజానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోహ్లితో పోలిస్తే రోహిత్కు అద్భుతమైన రికార్డు ఉంది. 2013, 2015, 2017లలో అతను ముంబై ఇండియన్స్ జట్టును విజేతగా నిలిపాడు. మరోసారి ఆ జట్టు చాంపియన్స్ లీగ్ కూడా గెలుచుకుంది. ముఖ్యంగా పుణేతో ఉత్కంఠభరితంగా సాగిన పదో సీజన్ ఫైనల్లో రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే చాలా మంది దృష్టిలో ఈ మూడు టైటిల్స్ రోహిత్ ఘనత మాత్రమే కాదు. ప్రపంచంలోనే బలమైన సహాయక సిబ్బంది ముంబై టీమ్ వెంట ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చిందనేది వారి అభిప్రాయం. పైగా టి20 ఫార్మాట్లో, అందులోనూ ఒక ఫ్రాంచైజీ టోర్నీలో వ్యూహ ప్రతివ్యూహాలు, కెప్టెన్ బాధ్యతల పాత్ర తక్కువ. అయితే దేశం తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడి, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్–10లో ఉన్న రోహిత్ అనుభవం తక్కువేమీ కాదు. ఒక జట్టుకు నాయకత్వం వహించేందుకు అది చాలా ఎక్కువ. ఇది కచ్చితంగా రోహిత్ను అనుకూలించే అంశం. అన్నింటికి మించి తన కెరీర్ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ధోని మైదానంలో ఎలాగూ అండగా ఉండనే ఉన్నాడు. కాబట్టి లంకలాంటి బలహీన జట్టుతో జరిగే సిరీస్లో కెప్టెన్గా అతనికి అంతా అనుకూల వాతావరణమే ఉంది. 24 వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్న 24వ ఆటగాడు రోహిత్. ముంబై తరఫున 7వ క్రికెటర్. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
కోల్కతా: నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గురువారం భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్ను గెలుచుకోవడంతో మరికొందరు రిజర్వ్ ఆటగాళ్లను పరిశీలించాలని భావిస్తుండగా... కనీసం ఒక్క వన్డే అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో శ్రీలంక ఉంది. మరోవైపు భారత్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, అశ్విన్ స్థానాల్లో రోహిత్ శర్మ, లెగ్స్పిన్నర్ కరణ్ కరణ్ శర్మ, స్టువర్ట్ బిన్నీలకు చోటు దక్కింది. -
మరో పంచ్కు సిద్ధం !
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు సొంతగడ్డపై శ్రీలంకతో వన్డే సిరీస్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, అది భారత్కు సన్నాహకంగా పనికి రాదని చాలా మంది భావించారు. అయితే టీమిండియా కుర్రాళ్లకు మాత్రం ఇది బాగా కలిసొచ్చింది. వారు దానిని సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సిరీస్ కూడా సొంతం కావడంతో మరికొందరు ఆటగాళ్లకు కూడా తమ సత్తా చాటుకునే అవకాశం దక్కనుంది. మరోవైపు భారత్ తన నంబర్వన్ స్థానాన్ని పదిలపర్చుకుంటుంది. కోల్కతా: చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానం 150 సంవత్సరాల సంబరాలు భారత్, శ్రీలంక వన్డే మ్యాచ్ నేపథ్యంలో జరగనున్నాయి. గురువారం ఇక్కడ జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్ను గెలుచుకోవడంతో మరికొందరు రిజర్వ్ ఆటగాళ్లను పరిశీలించాలని భావిస్తుండగా... కనీసం ఒక్క వన్డే అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో శ్రీలంక ఉంది. రోహిత్ వచ్చాడు... చివరి రెండు వన్డేల కోసం భారత జట్టులో పలు మార్పులు జరిగాయి. వీరిలో రోహిత్ శర్మ, రాబిన్ ఉతప్పలకు తుది జట్టులో చోటు ఖాయమైంది. గాయంతో జట్టుకు దూరమై... లంకతో ప్రాక్టీస్ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రోహిత్, మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ను మినహాయిస్తే కెరీర్లో ఎనిమిది లిస్ట్ ‘ఎ’ మ్యాచ్లలోనే వికెట్ కీపింగ్ చేసిన ఉతప్ప, తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్లో ఆ బాధ్యత నిర్వర్తించనున్నాడు. రహానేకు తోడుగా వీరిద్దరిలో ఎవరు మరో ఓపెనర్గా ఆడతారనేది చూడాలి. కోహ్లి, రైనా, అంబటి రాయుడులతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్లో ఆడిన ఇషాంత్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే బ్యాటింగ్లో కూడా రాణించగల లెగ్స్పిన్నర్ కరణ్ శర్మకు తొలిసారి చోటు దక్కవచ్చు. శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్లో కరణ్ (4/47) అందరికంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అంతా గందరగోళం... ఈ సిరీస్కు ముందు ఫామ్ చూస్తే పటిష్టమైన వన్డే జట్టుగా కనిపించిన శ్రీలంక, భారత గడ్డపై ఒక్కసారిగా కుదేలైంది. మూడు మ్యాచ్లలోనూ ఆ జట్టు ఆటతీరు ఒకే విధంగా, నాసిరకంగా కనిపించింది. బ్యాటింగ్లో సమష్టిగా వైఫల్యం, బౌలింగ్లో భారత్కు భారీగా, సునాయాసంగా పరుగులు సమర్పించుకోవడం... చివరకు ఓటమి. ఎక్కడా పోరాటపటిమ కనబర్చలేదు. ఈ నేపథ్యంలో లంక కూడా కొన్ని మార్పులు చేసి ఆశావహ దృక్పథంతో బరిలోకి దిగుతోంది. సీనియర్ సంగక్కర ఇప్పటికే లంకకు వెళ్లిపోయాడు. ఇటీవల వెస్టిండీస్ ‘ఎ’తో సిరీస్లో రాణించిన చండీమల్, తిరిమన్నెలను జట్టులోకి ఎంపిక చేశారు. జయవర్ధనే ఫామ్లోకి రావడం జట్టుకు మేలు చేసే అంశం. ఇక బౌలింగ్లో అజంత మెండిస్ కూడా తుది జట్టులోకి రావడం ఖాయమైంది. ఇతర జట్లతో పోలిస్తే భారత్పై అతని రికార్డు చాలా బాగుంది. జట్ల వివరాలు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రహానే, రైనా, రాయుడు, ఉతప్ప, అక్షర్, అశ్విన్, ఉమేశ్, ధావల్, బిన్నీ/కరణ్. శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కుషాల్ పెరీరా, దిల్షాన్, చండీమల్, జయవర్ధనే, తిరిమన్నె, ప్రసన్న, తిసార పెరీరా, కులశేఖర, మెండిస్, గమగే/ఎరాంగ. పిచ్, వాతావరణం ఈ మ్యాచ్లోనూ బ్యాటింగ్ వికెట్ సిద్ధంగా ఉంది. బౌలర్లకు పెద్దగా సహకారం ఉండకపోవచ్చని ఈడెన్ క్యురేటర్ నిర్ధారించారు. భారీ స్కోర్లు ఖాయం. రాత్రి సమయంలో కొద్దిగా మంచు మినహా, మ్యాచ్ రోజు మంచి ఎండ కాస్తుందని, మ్యాచ్కు ఎలాంటి అంతరాయం ఉండదని సమాచారం. ‘ప్రపంచ కప్ దగ్గరలోనే ఉంది కాబట్టి మేం విజయాలను అలవాటుగా మార్చుకోవాలని భావిస్తున్నాం. సిరీస్ గెలిచినా కూడా ఉదాసీనత ప్రదర్శించం. మైదానంలో అదే తీవ్రతతో ఆడతాం. రోహిత్ శర్మ తిరిగి రావడం జట్టుకు ఎంతో ఉపయోగం. ప్రపంచకప్లో కూడా అతను కీలకం అవుతాడు. మ్యాచ్లను గెలిపించే సత్తా అతనిలో ఉంది. ఆస్ట్రేలియాతో టెస్టులో నాయకత్వం వహించనుండటం గురించి ఉద్వేగానికి లోనవుతున్నాను. పదునైన పేస్ బౌలింగ్ అటాక్ మనకు ఉంది. దీంతో మంచి ఫలితాలు సాధించగలమని నమ్ముతున్నా.’ - విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ ‘మా జట్టు ఇక్కడ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అయితే దీని వల్ల ఆందోళన లేదు. అన్నీ సర్దుకుంటాయి. మా ప్రపంచ కప్ సన్నాహాలకు కూడా సమస్య లేదు. దానికి ముందు చాలా మ్యాచ్లు ఆడబోతున్నాం. పెద్ద టోర్నీల్లో, కీలక సమయాల్లో రాణించగల సామర్థ్యం మా ఆటగాళ్లకు ఉంది. టి20 ఫైనల్ చివరి ఓవర్లలో మా బౌలింగ్ ఎలా ఉందో చూశారుగా. ఈ సిరీస్లో మా వ్యూహాలపై పునరాలోచించి విజయంపై దృష్టి పెడతాం. ఫలితం తేలిపోయినా ఇరు జట్లలోనూ తమ సత్తా నిరూపించుకోవాల్సిన ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి రెండు మ్యాచ్లూ కీలకమే.’ - జయవర్ధనే, శ్రీలంక క్రికెటర్