breaking news
Sri Chaitanya Engineering College
-
ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్నా..
మధురవాడ (భీమిలి): కాలేజీల్లో కామ పిశాచాల వేధింపులు తాళలేక కొంతమంది అమ్మాయిలు చదువులు మధ్యలోనే మానివేస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలే శరణ్యమని భావించి చిన్నతనంలోనే తనువులు చాలిస్తున్నారు. ఫ్యాకల్టీయే బరితెగించి లైంగికంగా వేధింపులు పాల్పడగా.. తట్టుకోలేకపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఇక్కడ డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ (16) లైంగిక వే«ధింపులకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తాళలేక పోతున్నానంటూ తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రాంతంలో హాస్టల్ భవనం 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యా సంస్థ నిర్లక్ష్యమే కారణం విద్యా సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె మృతి చెందిందని బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని నాతవరం మండలం పద్మనాభపురానికి చెందిన రైతు కూలి గండికోట రమణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లయి అగనంపూడిలో ఉంటోంది. ఆఖరి కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకుంటోంది. రెండో కుమార్తె రూపశ్రీ కొమ్మాది కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతోంది. రూపశ్రీ కనిపించడం లేదని తండ్రికి కళాశాల సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత రూపశ్రీ అర్ధరాత్రి 12.48 గంటలకు 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్కి వెళ్లి, 1.05కి 4 ఫ్లోర్ నుంచి కిందకి దూకిందని తెలిసింది. దూకే క్రమంలో చెట్టుకు తగిలి కిందకి పడి తీవ్రంగా గాయపడింది. రూపశ్రీని తరలించిన ఆస్పత్రికి అల్లుడు హరికృష్ణతో కలసి రమణ చేరుకునే లోపు రూపశ్రీ మృతి చెందింది. తండ్రి సెల్కి పంపిన మెసేజ్ ఇలా.. హాయ్ అమ్మా, నాన్న, అక్కా, చెల్లి మరియు కుటుంబ సభ్యులకు.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ కాలేజీలో లైంగిక వే«ధింపులు జరుగుతున్నాయి నాన్న. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం నాన్న. చాలా చెండాలంగా ప్రవర్తిస్తున్నాడు. ఫొటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు. స్టూడెంట్స్కి చెప్పాల్సిందిపోయి ఆ ఫ్యాకల్టీ ఇలా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నాన్న? నా ఫొటోలు కూడా తీసి బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరికి చెప్పకోలేక. అలా అని కాలేజికి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం అని బెదిరించారు. నాకే వేరే దారి కనిపించలేదు. ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు ఆ పని నేనే చేస్తున్నా. క్షమించండి నాన్నా. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కళాశాల టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుకు చెందిన కళాశాల ఇది. ఇక్కడ యాజమాన్యం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మృతురాలు తండ్రి, సగర సామాజిక వర్గ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోక్సో, ర్యాగింగ్ కేసు నమోదు మృతురాలు రూపశ్రీతో పాటు ఇంకా ఎంత మంది విద్యార్థులు వేధింపులకు గురయ్యారనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితులపై పోక్సో యాక్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ర్యాగింగ్ తదితర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పీఎం పాలెం సీఐ రామకృష్ణ తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై తక్షణం నివేదిక అందజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండి సీతారాం నగర పోలీసులను, సాంకేతిక విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. -
‘బిడ్డ జాడ చెప్పుండ్రి’
కరీంనగర్ క్రైం : తన బిడ్డను ప్రేమ పేరుతో మోసం చేసి ఆపై కనిపించకుండా చేసిన వారిపై చర్యలు తీసుకుని బిడ్డ జాడ చెప్పాలని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. శుక్రవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి బాధితురాలు వెంకటమ్మ మాట్లాడారు. గోదావరిఖని విఠల్నగర్ కు చెందిన తనకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉందని తెలిపారు. కూతురు కరీంనగర్ శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా 2015 ఫిబ్రవరి 24వ తేదీన కరీంనగర్లోని పద్మనగర్కు చెందిన శంషొద్దిన్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని.. వీరికి ఓ డీఎస్పీ ఆధ్వర్యంలో వివాహం జరిపించారని తెలిపారు. బిడ్డను లొంగదీసుకున్న శంషొద్దిన్ గతంలో పలువురితో ప్రేమాయనం సాగించాడని.. అతని మిత్రుల ద్వారా తెలిసిందని వెంకటమ్మ వివరించారు. విషయం తెలియడంతో ఎల్ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. .. అయినా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదని.. చివరకు మీ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది. రాదని చెప్పిందని పంపించారని వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. బిడ్డను మాత్రం చూపించడంలేదని.. అసలు బిడ్డ బతికి ఉందో లేదో తెలియదని బోరుమని విలపించింది. ప్రేమ పెళ్లి చేసుకున్న శంషొద్దిన్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని సైతం ప్రాదేయపడ్డా కూతురి ఆచూకీ చెప్పలేదని తెలిపింది. చివరకు శంషొద్దిన్ ఫొన్ న ంబర్కు కనుక్కుని ఫోన్చేయగా రూ. 5 లక్షలు ఇస్తే కూతురును అప్పగిస్తానని బెదిరించాడని వివరించింది. ఉన్నతాధికారులు స్పందించి బిడ్డ బతికుందో లేదో.. ఎక్కడుందో చెప్పాలని ఈ సందర్భంగా వేడుకుంది. కూతరును వెతుకుతున్న విషయం తెలుసుకున్న శంషొద్దిన్ తన కుమారులనూ బెదిరిస్తున్నాడని ఆరోపించింది. రక్షక దళాలు ఏర్పాటు చేస్తాం : బండి సంజయ్ జిల్లాలో హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకోవడానికి శిక్షణ పొందిన రెండు గ్యాంగ్లు పని చేస్తున్నాయని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకుంటే రక్షక దళాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓ తల్లి తన కూతురు కనిపించుకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని ఓ డీఎస్పీ వద్ద 10 రోజుల పాటు డ్రైవర్గా శంషోద్దిన్ పని చేసినందుకు సదరు డీఎస్పీ అమ్మాయితో వివాహం జరిపి పంపించారని ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చివరకు ఎలాంటి విచారణ చేయకుండానే కేసును మూసి వేశారని తెలిపారు. ఇప్పటికైన పోలీసు అధికారులు ఈ తల్లికి న్యాయం చేయాలని కోరారు. నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న లవ్ జీహద్ పేరుతో హిందూ యువతులను వలలోకి దింపి తర్వాత వారి జీవితాలు నాశనం చేస్తున్నారని వాటిపై పోలీసులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో న్యావాది బేతిమహెందర్, మురళీకృష్ణ, బోయినపల్లి ప్రవీణ్రావు, సిరికొండ శ్రీదర్, ముప్పిడి సునిల్, రాజేశం, మహెందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.