breaking news
speed braker
-
రంబుల్స్ట్రిప్స్తో ప్రమాదాలు.. ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు కాంట్రాక్టర్లతో కలిసి రోడ్లు వేయకుండానే బిల్లులు కాజేయడం తెలుసు. ఎక్కడా లేని నిబంధనలతో కావాల్సిన వారికే టెండర్లు కట్టపెట్టడమూ తెలుసు. నాణ్యత లేమితో తూతూమంత్రంగా పనులు చేయడమూ తెలుసు. ఎటొచ్చీ జేబులు నింపుకొనేందుకు చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు ప్రమాదాలు జరగకుండా ఉండటంపై చూపడం లేదు. నాసిరకం రోడ్లే కాదు.. రోడ్డు ప్రయాణాలు చేసేవారికి చూపాల్సిన మార్గదర్శకాలు పట్టించుకుంటే ఒట్టు. చివరకు సైనేజీలపైనా శీతకన్నే. సైనేజీలు, లేన్మార్కింగ్లు, అడ్డగోలు రంబుల్స్ట్రిప్స్ వల్ల ప్రజలకు ఎలా ప్రమాదాలకు ఆస్కారం ఉందో నగరంలో వాహనాల మొబిలిటీ ఎందుకు తగ్గుతుందో జీహెచ్ఎంసీలోని మరో విభాగమే క్షేత్రస్థాయిలో సర్వే చేసి లోపాలు తెలియజేయడం విశేషం. అంతేకాదు, రోడ్సేఫ్టీ చర్యల్లో భాగంగా.. రహదారుల ప్రమాణాలకు సంబంధించి దేశంలోనే అత్యున్నత సంస్థలైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (మోర్త్) ప్రమాణాలకనుగుణంగా ఎలా ఉండాలో సూచిస్తూ జీహెచ్ఎంసీ (GHMC) ట్రాఫిక్ విభాగం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను జీహెచ్ఎంసీ ఇంజినీర్లు తప్పనిసరిగా పాటించాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వే నివేదిక మేరకు.. రోడ్ మార్కింగ్లు వేస్తున్నామా అంటే వేస్తున్నాం. స్పష్టంగా కనిపించడం లేదు. చార్మినార్ నుంచి బంజారాహిల్స్, హైటెక్ సిటీ దాకా అదే దుస్థితి. రద్దీప్రాంతాల్లో పాదచారులకుకానీ, పాఠశాలల వద్ద విద్యార్థులకు కానీ సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీబ్రా లేన్స్ లేవు. అబిడ్స్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో సైతం పాదచారులు రోడ్డు దాటేందుకు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. లేన్ మార్కింగ్లెందుకు? బస్సులు వెళ్లేందుకు, సైకిళ్లు, పాదచారుల కోసం వేర్వేరు విభాగాలుగా ఉండేందుకు లేన్ మార్కింగ్లు అవసరం.. కానీ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇవి కనిపించడం లేదు. దీంతో డ్రైవర్లు లేన్లను మారుస్తుండటంతో బాటిల్నెక్స్ ఏర్పడుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ చాదర్ఘాట్. ఈ గుర్తులేవీ? అవసరమైన ప్రాంతాల్లో ‘స్టాప్’, ‘నో యూ టర్న్’ ‘ముందుకు స్పీడ్బ్రేకర్’ ఉంది వంటి హెచ్చరికలు లేవు. ఎన్నో ప్రధాన రహదారులు, జంక్షన్లలోనూ అదే దుస్థితి. జంక్షన్ల వద్ద ఏ దారి ఎటువైపు వెళ్తుందో సూచించే సైనేజీలూ (నేవిగేషన్) లేవు. ఉన్నా ప్రైవేటు ప్రకటనల్లో మూసుకుపోయాయి. దీంతో నగరానికి కొత్తగా వచ్చిన వారికి కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే నగర ప్రజలకు కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రంబుల్స్ట్రిప్స్తో ప్రమాదాలు అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా వేసిన రంబుల్స్ట్రిప్స్ వేగాన్ని తగ్గించేందుకు బదులు ప్రమాద హేతువులవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వాటిని దాటేటప్పుడు అదుపుతప్పి కింద పడిపోతున్నారు. ఓఆర్ఆర్ వంటి ప్రాంతాల్లో పెద్ద వాహనాలు సైతం అదుపు తప్పుతున్నాయి. ఎల్బీనగర్ – ఉప్పల్ మార్గంలో తరచూ ప్రమాదాలకు ఇది కూడా కారణమే. రంబుల్స్ట్రిప్స్ ఐఆర్సీ మార్గదర్శకాల మేరకు 10–17 మిమి ఎత్తు, 250–300 వెడల్పుతో ఉండాలి. 600 ఎంఎం గ్యాప్తో 6 స్ట్రిప్స్ ఉండాలి కానీ నగరంలో ఎత్తు మాత్రం పెంచారు.అవి సైతం ఎక్కడ పడితే అక్కడ కాకుండా పాదచారులు రోడ్డు దాటే మార్గాలకు ముందు, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేయాలి. ‘రంబుల్స్ట్రిప్స్ ముందు ఉన్నాయి’ అనే సూచికలు ఉండాలి. సాఫీగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి కానీ లోపభూయిష్ట డిజైన్లతో నడుములు విరుగుతున్నాయి.ఏం చేయాలి ? లోపాలను చక్కదిద్దడంతో పాటు నగరం విశ్వనగరంగా ఉండాలంటే ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త విధానాలు అందుబాటులోకి తేవాలి. సైనేజీలు, సూచికల వంటి వాటి ఏర్పాటుతోపాటు ప్రజలకు వాటి గురించి అవగాహన కలిగేలా నిరంతరం కార్యక్రమాలుండాలి. స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తులుండాలి. ‘పాదచారి దారిలో ఉన్నారు’, ఓవర్ టేక్ చేయవద్దు, స్పీడ్లిమిట్ వంటి సూచనలు రిఫ్లెక్లివ్ బోర్డులతో ఏర్పాటు చేయాలి. జంక్షన్ల వద్ద కౌంట్డౌన్ టైమర్లతో కూడిన లైన్లు, పెలికాన్ క్రాసింగ్బటన్లు ఉండాలి. రంబుల్ స్ట్రిప్స్ ఇష్టానుసారం కాకుండా అవసరమైన ప్రాంతాల్లోనే వేయాలి.చదవండి: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లో ఎకోపార్కుబస్బేస్, ఆన్స్ట్రీట్, ఆఫ్స్ట్రీట్ పార్కింగ్ ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ఇరుకు రోడ్లకు, డివైడెడ్ రోడ్లకు వేర్వేకు మార్కింగ్ నిబంధనలుండాలి. ఫ్లై ఓవర్లు, జంక్షన్లు, వలయాకారపు జంక్షన్లు వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే లేన్లు, మార్గదర్శక సూచనలు ఉండాలి. మలుపులున్న ప్రాంతాల్లో 15 ఎంఎం వెడల్పుతో రోడ్డుకు ఇరువైపులా తెలుపురంగు ఉండాలి. రాత్రిళ్లు కనపడేలా స్టడ్స్ ఉండాలి. సెన్సర్ ఆధారిత రంబుల్ స్ట్రిప్స్ బదులు కాలం చెల్లిన స్టాటిక్ సిస్టమ్నే వాడుతున్నారు. వాటిని మార్చడంతోపాటు రంబుల్ స్ట్రిప్స్ (rumble strips) లొకేషన్స్, స్థితిగతులకు సంబంధించి సెంట్రలైజ్డ్ డేటాబేస్ అవసరం. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ఆర్అండ్బీ, హెచ్ఎంఆర్ల మధ్య సమన్వయ లోపం వల్ల రోడ్డు నిబంధనలు సవ్యంగా అమలు కావడం లేదు. -
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కచ్చితంగా పాటించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో రోడ్లపై వాహనాల వేగంపై ప్రభుత్వం పరిమితి విధించింది. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేగ పరిమితిని ఖరారు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కార్లు– ఇతర వాహనాలను (సరుకు రవాణా వాహనాలు, బస్సులు, మూడు చక్రాల వాహనాలు, ద్విచక్రవాహనాలు) రెండు కేటగిరీలుగా విభజించి వేరువేరు వేగ పరిమితులను ఖరారు చేసింది. ► డివైడర్లతో ఉన్న రోడ్లు, డివైడర్లు లేని రోడ్లు, కాలనీ రోడ్లు.. ఇలా మూడు వేర్వేరు రోడ్లకు వేర్వేరు గరిష్ట వేగాలను ఇందులో పేర్కొనటం విశేషం. ► ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగి మరణాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు తెలుస్తోంది. ► రోడ్డు డివైడర్ ఉన్న రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 60 కి.మీ.గా, ఇతర వాహనాల వేగం 50 కి.మీ.గా నిర్ధారించారు. ► డివైడర్ లేని రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.గా, ఇతర వాహనాల వేగం 40 కి.మీ.గా, కాలనీ రోడ్లపై కార్లు, ఇతర వాహనాల గరిష్ట వేగం 30 కి.మీ.గా ఖరారు చేసింది. నాలుగున్నరేళ్ల తర్వాత.. ఆధునిక వాహనాలు అందుబాటులోకి రావటంతో రోడ్లపై వాటి వేగం పెరిగి ప్రమాదాలు చోటుచేసుకోవటం ద్వారా విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్న తీరును 2017లో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, నగర, పట్టణ రోడ్లపై వాహనాల గరిష్ట వేగంపై పరిమితి విధించాలని ఆయన అందులో ప్రభుత్వాన్ని కోరారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ఆయా రోడ్లపై వేగ పరిమితిని నిర్ధారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు 2017 నవంబరు 17న ఉత్తర్వు జారీ చేసింది. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రోడ్లు, పురపాలక సంఘాల రోడ్లపై వేగ పరిమితిని నిర్ధారించే బాధ్యతను ఆయా విభాగాల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు అప్పగించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆ సంస్థ ఎస్ఈకి అప్పగించింది. దీనికి సంబంధించి ఆయా అధికారులు కసరత్తులు పూర్తి చేసి ఎక్కడికక్కడ నివేదికలు సమర్పించారు. ఇంతకాలానికి జీహెచ్ఎంసీ పరిధిలో అధికారుల సిఫారసు ఆధారంగా వేగ పరిమితిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇక జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, పురపాలక రోడ్లకు సంబంధించి అధికారుల సిఫారసుల ఆధారంగా పరిమితులు అమలులోకి వస్తాయని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. (క్లిక్: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. అరుదైన ఘనతలు) మరింత స్పష్టత కావాలి.. ఈ వేగాలకు సంబంధించి మరింత స్పష్టత అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డివైడర్ ఉన్న రోడ్లపై గరిష్ట వేగాన్ని కార్లకు 60గా నిర్ధారించినా, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రార్థనా సంస్థలు, మార్కెట్ల చేరువలో అది సాధ్యం కాదని, అలాంటి వాటిపై మరింత స్పష్టత ఉండాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, పురపాలిక రోడ్లకు సంబంధించి, ఆయా ప్రాంతాల పరిస్థితుల ఆధారంగా ప్రతి రోడ్టుపై వేగ పరిమితిని ప్రకటించాలని వారు కోరుతున్నారు. (క్లిక్: ఏఐతో ‘రాస్తే’ సేఫ్.. పనిచేస్తుందిలా!) -
ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్
జి.కొండూరు (మైలవరం) : వాహనాల వేగాన్ని నియంత్రించి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకరే ఓ మహిళ పాలిట యమపాశమైంది. జి.కొండూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతి చెందిన వియ్యంకురాలి దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు విసన్నపేట గ్రామానికి చెందిన పెండెం భావనారాయణ, తన భార్య సత్యవతితో కలిసి శుక్రవారం నందిగామ మండలం చందర్లపాడు గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. జి.కొండూరు సమీపంలోకి రాగానే చీకట్లో అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు. దీంతో వేగంగా వస్తున్న బైక్ వెనుక కూర్చున్న సత్యవతి (56) ఎగిరి కిందపడింది. ఆమె తలకు బలమైన గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
స్పీడ్ బ్రేకర్ డిజైన్ మారిస్తే లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు తగ్గుతాయి
మెదక్ స్కూల్ బస్సు ప్రమాదం ఒక ఘోర విషాదం. కానీ కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ ప్రమాదాన్ని తప్పించి ఉండవచ్చు అంటున్నారు రోడ్డు రవాణా నిపుణులు. ఇందుకు రోడ్లపై స్పీడ్ బ్రేకర్ లో కొద్దిపాటి మార్పులు చేస్తే చాలా మటుకు ప్రమాదాలను నివారించవచ్చునంటున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్పులను చేశాయి. దాని వల్ల అక్కడ లెవెల్ క్రాసింగ్ ల వద్ద ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. మామూలుగా స్పీడ్ బ్రేకర్ కి లెవెల్ క్రాసింగ్ కి మధ్య పది మీటర్ల దూరం ఉంటుంది. రోడ్డుకు ఇప్పుడున్న స్పీడ్ బ్రేకర్లు 90 డిగ్రీల కోణంలో ఉంటాయి. కానీ దీన్ని 45 డిగ్రీలుగా మార్చినట్టయితే, అంటే స్పీడ్ బ్రేకర్ వంకరగా ఉన్నట్టయితే లెవెల్ క్రాసింగ్ వద్ద వాహనాలు ఇంకాస్త ఎక్కువ స్లో చేయాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా పరిశోధకుల అధ్యయనం ప్రకారం స్పీడ్ బ్రేకర్ 90 డిగ్రీల కోణంలో ఉంటే స్పీడ్ బ్రేకర్ నుంచి రైల్వే క్రాసింగ్ కి చేరుకోవడానికి ఒక ట్రాక్టర్ కి సగటున 12 నిమిషాలు పడుతుంది. అదే స్పీడ్ బ్రేకర్ వంకరగా ఉంటే 16 సెకన్లు పడుతుంది. అంటే నాలుగు సెకన్లు లేదా 25 శాతం ఎక్కువ సమయం పడుతుంది. అదే కార్ అయితే గతంలో ఏడు సెకన్లు పడితే కొత్త స్పీడ్ బ్రేకర్ తో 11 సెకన్లు అంటే 5 సెకన్లు ఎక్కువగా పడుతుంది. మోటర్ సైకిల్స్ కి పాత డిజైన్ లో 6 సెకన్లు, కొత్త డిజైన్ లో 8 సెకన్లు పడుతుంది. ఈ అదనంగా మిగిలే క్షణాలు బ్రేక్ వేయడానికి, బ్రేక పడటానికి, ప్రాణాలుకాపాడటానికి పనికొస్తాయని అధ్యయనాల్లో తేలింది. దీన్ని అమలు చేయడం వల్ల రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్రల్లో గస్తీ లేని లెవెల్ క్రాసింగ్ లలో ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని తేలింది. ఈ చిన్న మార్పును రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సులువుగా చేయొచ్చు. మెదక్ బస్ ప్రమాదం నేపథ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాదాలను నిరోధించే దిశగా రాష్ట్రప్రభుత్వాల పాత్ర గురించి ప్రస్తావించారు. ఈ చిన్న పనిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవా?