Space flight
-
మరో చరిత్రకోసం...
‘మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు అన్నీ మనం సృష్టించుకున్నవే. వాటికి ఎలాంటి అస్తిత్వం లేదు’ అనే క్రిస్టినా కోచ్ శాస్త్రీయ విషయ సంపన్నురాలే కాదు, సామాజిక స్పృహ మూర్తీభవించిన మహిళ. చంద్రుడిని చుట్టి రావడానికి, ‘ఆర్టెమిస్–2’ మిషన్లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన నలుగురు వ్యోమగాములలో ఆమె ఒకరు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా గతంలో రికార్డ్ సృష్టించిన కోచ్ తాజాగా... చంద్రుడి కక్ష్యలో ప్రయాణించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.మిచిగాన్ (అమెరికా)లోని గ్రాండ్ రాపిడ్స్లో జన్మించి, నార్త్ కరోలినాలోని జాక్సన్విల్లేలో పెరిగిన క్రిస్టినా కోచ్ నార్త్ కరోలినా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలు చేశారు. ఆమెకు నాసా మిషన్లు కొత్తేమీ కాదు. 2013లో తొలిసారిగా నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.రికార్డ్ సృష్టించి...2019లో అంతరిక్షంలో 328 రోజుల పాటు సుదీర్ఘకాలం గడిపిన మహిళగా రికార్డ్ సృష్టించారు కోచ్. అక్టోబర్ 2019లో జెస్సికా మీర్తో కలిసి ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్లో కూడా కోచ్ పాల్గొన్నారు. అల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అప్గ్రేడ్ కోసం రోబోటిక్స్ చేయడం, ఫార్మాస్యూటికల్ పరిశోధన కోసం ప్రోటీన్ క్రిస్టల్స్ పెంచడం, సూక్ష్మ గురుత్వాకర్షణలో 3డీ బయోలాజిక్ ప్రింటర్లను పరీక్షించడం... మొదలైనవి ఆమె చేపట్టిన శాస్త్రీయ పరిశోధనలు.అంటార్కిటికాలో...‘ఆర్టెమిస్–2’ మిషన్కు ఎంపిక కావడానికి ముందు ‘నాసా’ ఆస్ట్రోనాట్ ఆఫీస్లో అసైన్డ్ క్రూ బ్రాంచ్కు చీఫ్గా... నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో సెంటర్ డైరెక్టర్కు టెక్నికల్ ఇంటిగ్రేషన్ అసిస్టెంట్గా పనిచేశారు కోచ్. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న కోచ్ అంటార్కిటికాలోని స్కాట్ సౌత్ పోల్ స్టేషన్, పామర్ స్టేషన్లలో అగ్నిమాపక, శోధన, రక్షణ బృందాలలో పనిచేశారు.అంతరిక్ష యోగా!‘మనసు ఉండాలేగానీ మార్గం ఉంటుంది’ అని చెబుతారు పెద్దలు. క్రిస్టినా కోచ్కు యోగా చేయడం అంటే ఇష్టం. మరి అంతరిక్షంలో అది సాధ్యపడుతుందా?‘యస్’ అంటున్నారు కోచ్. తన గత అంతరిక్ష యాత్రలో యోగా ప్రముఖ పాత్ర పోషించిందని చెబుతుంటారు కోచ్. ‘నేను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు యోగా చేశాను. అక్కడ యోగా చేయడం చాలా కష్టం అనుకుంటారు. కాని అది నిజం కాదు. కొన్ని ఆసనాలు చేయడం కష్టంగా అనిపించినప్పటికీ అక్కడ యోగా చేయడం చాలా సరదాగా ఉంటుంది. యోగా అనేది అద్భుతమైనది.మైక్రో గ్రావిటీ (బరువు లేని స్థితి) లో కూడా అన్వేషించడానికి అనేక రకాల ఆసనాలు ఉంటాయి. అంతరిక్షంలో సాధన చేసినా, భూమిపై చేసినా యోగా ఎప్పటికీ యోగానే. అది అంతరిక్షం అయినా సరే, అన్వేషణ మన నుంచి దూరం కాదు. అన్వేషణ అనేది ఎందుకు మానవ సహజమో మనకు అక్కడ అర్థమవుతుంది. అన్వేషణ అనేది మన డీఎన్ఏలోనే ఉంది. మనం ఇష్టపడే వాటిని కొత్త వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం మనం సహజంగా చేసే పని’ అంటారు క్రిస్టినా కోచ్. శాస్త్ర ప్రపంచానికి ఆవల కోచ్కు సర్ఫింగ్, ఐస్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, సామాజిక సేవ అంటే ఇష్టం.రికార్డ్లు బద్దలు కావాల్సిందే!→ మీరు ఇప్పటికే సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రకు సంబంధించిన రికార్డ్ను బద్దలు కొట్టారు. మరో రికార్డ్ను కూడా సృష్టించడానికి రెడీ కావడం ఉలా ఉంది?క్రిస్టినా కోచ్: నేను రికార్డ్లు, వ్యక్తిగత విజయాల గురించి ఆలోచించను. మరొకరికి స్ఫూర్తినివ్వడం గురించి, అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన విషయాలను ప్రజలకు తెలియజేయడం గురించి ఆలోచిస్తాను. ఇక రికార్డ్ల విషయానికొస్తే... మీరు ఎక్కడికి వెళ్లారు? అంతరిక్షంలో ఎన్ని రోజులు గడిపారు... అనేది ముఖ్యం కాదు. ఆ సమయంలో మీరు ఏం చేశారు అనేది ముఖ్యం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నా లక్ష్యం ఎప్పుడూ అదే. రికార్డ్లు వీలైనంత త్వరగా బద్దలు కావాలనేది నా కోరిక. రికార్డ్లు బద్దలు కావడం అంటే దాని అర్థం మనం నిరంతరం విస్తరిస్తున్నామని!→ శాస్త్రీయ అన్వేషణకు సంబంధించి నాసా వైఖరి?కోచ్: ఒక శాస్త్రీయ అన్వేషణకు మనం స్పందించి, మానవాళి మొత్తానికి ప్రాతినిధ్యం వహించడం ముఖ్యమని నాసా చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది. ఇది సంతోషకరమైన విషయం. వ్యోమగాముల బృందం మానవాళి మొత్తానికి ప్రతినిధిగా ఉంది. అన్వేషణకు సంబంధిన ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యోమగాముల బృందంలో భాగమయ్యేలా చేసుకోవడమే విజయానికి అత్యత్తమ మార్గం.→ అంతరిక్ష అనుభూతి గురించి...కోచ్: అంతరిక్షం నుంచి వెనక్కి తిరిగి భూమిని చూడడం అనేది అద్భుత అవకాశం. అనంతమైన విశ్వంలో భూమి ఎలా కనిపిస్తుందో చూడడం అనేది జీవితంలో ఎన్నో అనుభవాల కంటే అతి ముఖ్యమైనది. వాతావరణానికి సంబంధించి పలుచని నీలి గీతను చూడడం ద్వారా మన మధ్య తేడాల కంటే పోలికలే ఎక్కువగా ఉన్నాయని, మనమందరం సంతోషంగా జీవించడానికి ఒకే విధానంపై ఆధారపడుతున్నామని, మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు, విభజనలు అన్నీ మనం సృష్టించుకున్నవే అని, నిజానికి వాటికి ఎలాంటి అస్థిత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. -
‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ టెస్టు సక్సెస్
చెన్నై: భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్యాన్ మిషన్లో మరో ముందడుగు పడింది. గగన్యాన్ ప్రయోగంలో భాగంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్వీఎం3 లాంచ్ వెహికల్ తయారీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఈ లాంచ్ వెహికల్కు గుండెకాయ లాంటి ‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం వెల్లడించింది. తమ పరీక్షలో క్రయోజనిక్ ఇంజన్ పూర్తి సంతృప్తికరమైన పనితీరు కనబర్చిందని, అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించిందని వెల్లడించింది. గగన్యాన్ యాత్రకు ఈ ఇంజన్ అనువైందని తేలినట్లు స్పష్టం చేసింది. పలు రకాల కఠిన పరీక్షల తర్వాత ఈ క్రయోజనిక్ ఇంజిన్ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని పేర్కొంది. మానవ రహిత గగన్యాన్–1 యాత్రను 2024లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు. ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేర్చి, మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగన్యాన్ మిషన్ లక్ష్యం. మొత్తం మూడు రోజుల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగంలో వ్యోమగాములను ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజనిక్ దశలు ఉంటాయి. ఈ క్రయోజనిక్ దశలో లాంచ్ వెహికల్ను గమ్యస్థానానికి చేర్చడంలో సీఈ20 ఇంజిన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజన్పై ఏడో వాక్యూమ్ టెస్టును ఈ నెల 14న తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆలి్టట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. గగన్యాన్ మిషన్లో ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించామని బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెపె్టన్స్ టెస్టులు, ఫైర్ టెస్టులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. -
అక్టోబర్ 21న తొలి టెస్ట్ ఫ్లైట్.. గగన్యాన్పై మోదీ సమీక్ష
అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టులో కీలకమైన తొలి ఫైట్ టెస్ట్ వెహికల్ అబోర్ట్ మిషన్-(టీవీ-డీ1)ను అక్టోబర్ 21న ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఫైట్ టెస్ట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం.. TV-D1 క్రూ మాడ్యూల్ను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపడం, తిరిగి దానిని భూమికి తీసుకురావడం. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్లను రాకెట్ సాయంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వ చ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. 🚨 ISRO's Gaganyaan mission first flight test TV-D1 is scheduled on 7-9 am October 21, 2023. pic.twitter.com/i1SJgVm0HZ — Indian Tech & Infra (@IndianTechGuide) October 16, 2023 ఎల్వీఎం3 రాకె ట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదిలో ప్రయోగించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. మూడు అన్ క్రూడ్ మిషన్లతో సహా దాదాపు 20 ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా గన్యాన్ మిషన్ పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మిషన్ సంసిద్ధత, భారత అంతరిక్ష ప్రయోగాల భవిష్యత్తుపై ఇస్రో చైర్మన్ సోమనాథ్తోపాటు ఇతర అధికారులతో సమీక్ష జరిగింది. -
సొంత అంతరిక్ష విమానం.. కల సాకారానికి అడుగు దూరంలో భారత్..
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పునర్వినియోగ ప్రయోగ వాహనం ల్యాండింగ్ను ఆదివారం విజయవంతంగా చేపట్టింది. దీంతో భారత్ తన సొంత అంతరిక్ష విమానం కలకి ఒక అడుగు దూరంలో నిలిచినట్లయింది. ఏప్రిల్ 2న తెల్లవారుజామున కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుంచి చినూక్ హెలికాప్టర్ ద్వారా ఈ వ్యోమనౌక అండర్స్లాంగ్గా బయలుదేరింది. దీనిని గాలిలో వదిలేయడానికి ముందు 4.6 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ పునర్వినియోగ ప్రయోగ వాహనం(RLV) ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్ & కంట్రోల్ సిస్టమ్ను ఉపయోగించి అప్రోచ్, ల్యాండింగ్ విన్యాసాలను ప్రదర్శించింది. ఉదయం 7:40 గంటలకు ATR ఎయిర్ స్ట్రిప్లో స్వయంప్రతిపత్త ల్యాండింగ్ను పూర్తి చేసింది. RLV's autonomous approach and landing pic.twitter.com/D4tDmk5VN5 — ISRO (@isro) April 2, 2023 'స్పేస్ రీ-ఎంట్రీ వాహనం ల్యాండింగ్ లాగా ఖచ్చితమైన పరిస్థితులలో ఈ స్వయంప్రతిపత్త ల్యాండింగ్ జరిగింది. అతివేగం, మానవరహిత, అదే తిరుగు మార్గంలో వాహనం అంతరిక్షం నుండి వచ్చినట్లుగా ల్యాండ్ చేశాం. ప్రయోగం విజయవంతమైంది' అని ఇస్రో తెలిపింది. అంతరిక్షంలోకి తక్కువ ఖర్చుతో చేరుకునేందుకు పూర్తిగా పునర్వినియోగ ప్రయోగ వాహనం కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ప్రయోగం నిర్వహించింది. RLV కాన్ఫిగరేషన్ ఒక విమానం వలె ఉంటుంది. ప్రయోగ వాహనాలు, విమానం రెండింటి సంక్లిష్టతను మిళితం చేస్తుంది. చదవండి: ఏప్రిల్ 4 వరకు అక్కడ స్కూళ్లు బంద్.. కారణమిదే..! -
అదృష్టం అతిధిలా వచ్చి, స్పేస్లో ఎగిరేందుకు ఆఫర్ ఇచ్చి..!
అదృష్టం అతిధిలా వచ్చి, స్పేస్లో ఎగిరేందుకు ఆఫర్ ఇవ్వడం అంటే ఇదేనేమో. ఆంటిగ్వా - బార్బుడా దేశానికి చెందిన తల్లికూతుళ్లు ఫ్రీగా స్పేస్ ట్రావెల్ చేసేందుకు టికెట్లను సొంతం చేసుకున్నారు. త్వరలో వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూర్ను ప్రారంభించనుంది. ఈ టూర్లో పాల్గొనేందుకు ఆంటిగ్వా - బార్బుడాకి చెందిన 44 ఏళ్ల కైషా షాహాఫ్, బ్రిటన్లో నివసిస్తున్న ఆమె కూతురు 17 ఏళ్ల సైన్స్ విద్యార్థితో కలిసి ఉచితంగా నింగిలోకి ఎగరనున్నారు. This is the moment we told Keisha Schahaff she’s won @virgingalactic’s @omaze competition and she’s going to space… Her reaction brought tears to my eyes! https://t.co/F6iBgXC5P0 @spacehumanity pic.twitter.com/G9VXuMAhTi — Richard Branson (@richardbranson) November 24, 2021 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం వర్జిన్ గెలాక్టిక్ - స్వీప్స్ టేక్ తో కలిసి ఫండ్ రైజింగ్ 'ఓమెజ్'లో 1.7మిలియన్ డాలర్లు ఫండ్ రైజ్ చేసింది. 8 వారాల పాటు నిర్వహించిన ఈ ఫండ్ రైజింగ్ కోసం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ ప్రత్యేకంగా లాటరీ పద్దతిని ఏర్పాటు చేశారు. మినిమం 10డాలర్లతో టోకన్తో ఫండ్ రైజ్ చేయొచ్చు. ఇలా ఈ ఫండ్ రైజింగ్ లో వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, ముఖ్యంగా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునేవారికి, లేదంటే నాసాలో పనిచేయాలనుకునే వారికి క్యాష్ రూపంలో కాకుండా బహుమతి రూపంలో అందిస్తున్నట్లు రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో 165,000 మంది ఫండ్ రైజింగ్లో పాల్గొన్నారు. 8 వారాల పాటు నిర్విరామంగా జరిగిన అనంతరం ఇందులో విన్నర్స్ను రిచర్డ్స్ బ్రాన్స్న్ ప్రకటించారు. అంతేకాదు గెలిచిన వారికి స్వయంగా ఇంటికి వెళ్లి బహుమతులందిస్తున్నారు. అలా స్పేస్లోకి వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్న కైషా షాహాఫ్ ఇంటికి వెళ్లి రిచర్డ్స్ బ్రాన్స్న్ ఆశ్చర్యపరిచారు. దీంతో గెలుపుపై కైషా షాహాఫ్ సంతోషం వ్యక్తం చేశారు. కూతురుతో కలిసి స్పేస్లోకి వెళ్లే కోరిక నెరవేరుతుందని అన్నారు. చదవండి: అడిడాస్ సంచలన నిర్ణయం..! ఫేస్బుక్కు పెద్ద దెబ్బే..! -
స్పేస్ ఎక్స్లో తొలి తెలుగమ్మాయి
పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో ‘సాక్షి’ సంభాషించింది. ‘మా అమ్మాయి అమెరికాలోనే పుట్టినా భారతీయ సంప్రదాయాన్ని విడిచి పెట్టలేదు. పదహారు సంవత్సరాలు వచ్చేవరకు పూర్తి తెలుగుదనంతోనే పెంచాను. కాలేజీలలో చేరాక వారి దారిని వారు ఎంచుకున్నా కూడా తెలుగుని విడవలేదు’ అంటారు సీత తల్లి శారదాపూర్ణ శొంఠి. తండ్రి శ్రీరామ్ శొంఠిది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబిబిఎస్ చదివారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహ వ్యవస్థాపకులు కూడా. 1975లో అమెరికా వలస వెళ్ళారు. తల్లి శారదాపూర్ణ శొంఠి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేశారు. తెలుగులో అన్నమాచార్య నృత్య సంగీత కళాభిజ్ఞత మీద, సంస్కృతంలో లక్షణ గ్రంథాల మీద పరిశోధన చేశారు. విలక్షణంగా చెప్పటం వల్లనే... అమెరికాలోని ప్రఖ్యాత ఆమెహెస్ట్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్కి చేరడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇక్కడ చేరాలనుకుంటున్నావు అని సీతను ప్రశ్నించారు. ‘మా అమ్మనాన్నలు నన్ను డాక్టర్ లేదా ఇంజనీర్ చదివించాలనుకుంటున్నారు. నాకు ఏదైనా విభిన్నంగా చేయాలని ఉంది. అందువల్ల డిఫరెంట్ ఫీల్డ్ ఏదో మీరే సజెస్ట్ చేయండి. ఏదైనా కొత్తగా సాధించాలనుకుంటున్నాను’ అని సీత చెప్పిన సమాధానం అధ్యాపకులను ఆకట్టుకుంది. ఆమెకు ఆ కాలేజీలో ప్రవేశం లభించింది. పొలిటికల్ ఎకనామిక్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేశాక స్టేట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆమె ఆసక్తిని తెలుసుకున్న ప్రొఫెసర్ ‘మిడిల్ ఈస్ట్లో రాజకీయాలనూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చెయ్. అధ్యయనం తేలికగా ఉండడానికి అరబిక్ నేర్చుకోమ’ని సలహా ఇచ్చారు. వారి సూచన మేరకు సీత తెలుగు, హిందీ, ఫ్రెంచ్, అరబిక్... మొత్తం పది భాషలు నేర్చుకున్నారు. తల్లిదండ్రులు, సోదరి, పిల్లలతో సీత తొలి తెలుగమ్మాయి స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ఏఐఎస్)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక స్టేట్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆ డిపార్ట్మెంట్లో ఎంపికైన మొట్టమొదటి తెలుగమ్మాయి సీత. ఈజిప్టు, లిబియా, సిరియా, క్రొయేషియా, లెబనాన్, ఆఫ్రికా, ఆప్ఘనిస్థాన్ వంటి దేశాలలోని అమెరికన్ ఎంబసీలలో పని చేశారు సీత. చిన్నప్పటి నుంచి అడ్వెంచరస్గా ఉండటం సీతకు ఇష్టం. ‘ఆ సాహసమే సీతను అత్యున్నత స్థాయికి చేర్చింది’ అంటారు ఆమె తండ్రి. యుద్ధ సమయంలో ఇరాక్లోనే.. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో గ్రీన్ జోన్లో అంటే కంటోన్మెంట్ ఏరియాలో సైనికులతో పాటు బంకర్ల దగ్గర పని చేశారు సీత. అమెరికా–ఇరాక్ యుద్ధ సమయంలో యుద్ధంలో మరణించిన 150 మందికి మణికట్టుకి బ్యాండ్ కట్టి, వారి వివరాలను అమెరికాకు తెలియచేశారు సీత. అప్పుడు ఆమెకు 22 సంవత్సరాలు. సీత అన్ని రకాల యుద్ధ విద్యలతోపాటు ఏకే 47 కాల్చడంలో కూడా శిక్షణ పొందారు. లిబియాలో గడాఫీ మరణించిన సమయంలో సీత అక్కడే ఉన్నారు. ‘అప్పటికి మా అమ్మాయికి ఇద్దరు పిల్లలు. బాగా చిన్నవాళ్లు కావటంతో నేను కూడా సీతతో పాటు అన్ని దేశాలు తిరిగాను. ఆమెకు సహాయంగా ఉన్నాను. ఆ సమయంలో అమ్మాయి చూపిన ధైర్యం చూసి నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది’ అన్నారు శారదా శొంఠి. పిల్లలు ఇద్దరు... సీతకు ఇద్దరు పిల్లలు. జయరామ్, ఆనంద. పిల్లల్ని చూసుకుంటూ ఆమె వృత్తిలో పురోగతి సాధిస్తున్నారు. ఆమెకు వంట కూడా బాగా వచ్చు. ఏ పదార్థాన్ని ఎంత, ఎలా తినాలి అనే విషయంలో అమితమైన శ్రద్ధ. పిల్లలకూ తానే వండి పెడతారు. ప్రతి ఆదివారం దేవాలయానికి తీసుకువెడతారు. పిల్లలు తెలుగు బాగా మాట్లాడతారు. స్పేస్ ఎక్స్ లాంచింగ్ స్టేషన్ వద్ద సీత సంగీత, నాట్య ప్రదర్శనలు సీత, సోదరితో కలిసి ఉమా రామారావుగారి వద్ద నాట్యం, నేదునూరి కృష్ణమూర్తిగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. భారతీయ సంగీతం, పాశ్చాత్య సంగీతం, నాట్యం నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు. వరల్డ్ రెలిజియన్ కాన్ఫరెన్స్లో దలైలామా ముందు వేదమంత్రాలకు అనుగుణంగా నర్తించారు. శొంఠి సిస్టర్స్ పేరుతో భారతదేశంలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. మానస సరోవర్ నీళ్లు – గాంధీకి అభిషేకం సీత ఒకసారి మానస్ సరోవర్కి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ బృందంలో ఉన్న 70 సంవత్సరాల పెద్దాయన అక్కడ అకస్మాత్తుగా కన్ను మూశారు. వెంటనే సీత ఆయన భౌతిక కాయాన్ని కిందకు తీసుకువచ్చి, దహనక్రియలు పూర్తిచేసి మళ్లీ మానస్ సరోవర్, కైలాస్గిరి దర్శించుకున్నారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కోసమని ఒక గ్యాలన్ నీళ్లు తీసుకువచ్చారు. చికాగోలో గాంధీ విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు ఈ నీటితోనే అభిషేకించారు. పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో సంభాషించింది. – సంభాషణ: డాక్టర్ పురాణపండ వైజయంతి -
జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ చేపట్టిన చంద్రమండల యాత్రకు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. ‘హ్యూమన్ ఎక్స్ఫ్లోరేషన్, ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్’ హెడ్గా కాథీ లూడెర్స్ను నియమిస్తున్నట్లు నాసా ప్రతినిధి జిమ్ బ్రైడెన్స్టోన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇద్దరు వ్యోమగాములతో మే 30వ తేదీన ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించారు. ఈ కార్యక్రమాన్ని కాథీ లూడెర్స్ స్వయంగా పర్యవేక్షించారు. ఆమె 1922లో నాసాలో చేరారు. స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థలు తయారు చేసిన స్పేస్ క్యాప్సూల్స్ అభివృద్ధి విషయంలో టెస్టింగ్ ప్రోగ్రామ్లకు ఇన్చార్జిగా సేవలందించారు. 2024లో చేపట్టనున్న చంద్రమండల యాత్రకు నాసా సన్నద్ధమవుతోంది. వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలన్నదే ఈ యాత్ర లక్ష్యం. నాసా చంద్రమండల యాత్ర కాథీ లూడెర్స్ ఆధ్వర్యంలోనే జరగనుంది. -
2021 డిసెంబర్లో గగన్యాన్
సాక్షి బెంగళూరు: భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపే ‘గగన్యాన్’ ప్రయోగాన్ని 2021, డిసెంబర్లో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని చేపట్టేముందు పలు పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా 2020లో ఓసారి, 2021లో మరోసారి మానవరహిత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే క్రూ సపోర్ట్ సిస్టమ్స్, సర్వీస్ మాడ్యూల్, ఆర్బిటాల్ మాడ్యూల్ వంటి పలు సాంకేతికతలను ఇంకా అభివృద్ధి చేయాల్సిఉందని శివన్ పేర్కొన్నారు. 2022 నాటికి భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని ప్రధాని మోదీ ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివన్ మాట్లాడుతూ.. అంతరిక్ష యాత్రకు ఎంతమందిని పంపాలి? అక్కడ ఎన్నిరోజులు ఉండాలి? అన్న విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గగన్యాన్లో పాల్గొనేందుకు వ్యోమగాములను ఇంకా ఎంపిక చేయలేదని వెల్లడించారు. వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ భారత వాయుసేన(ఐఏఎఫ్)స్వీకరించిందనీ, ఓసారి ఎంపిక పూర్తయితే 2 నుంచి 3 సంవత్సరాల పాటు వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు వ్యోమగాములను ఏడు రోజులపాటు అంతరిక్షంలోకి పంపే సామర్ధ్యం తమకుందని శివన్ చెప్పారు. ఈ ప్రయోగం చేపట్టేందుకు మిషన్ కంట్రోల్, ట్రాకింగ్, లాంచ్ప్యాడ్ నిర్మాణం వంటి పనుల్లో ప్రైవేటు రంగ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. మానవసహిత యాత్రలో పాల్గొనే వ్యోమగాములకు శిక్షణ కోసం ఇతర దేశాల సాయం కూడా తీసుకుంటామని మరో ప్రశ్నకు శివన్ సమాధానమిచ్చారు. -
భూమికి తిరిగొచ్చిన అమెరికా అంతరిక్ష విమానం
లాస్ ఏంజెలిస్: భూమి చుట్టూ 22 నెలల పాటు రహస్యంగా చక్కర్లు కొట్టిన అమెరికా అంతరిక్ష విమానం ‘ఎక్స్-37బీ’ ఎట్టకేలకు భూమికి క్షేమంగా తిరిగి వచ్చింది. 2012, డిసెంబరులో మూడోసారి నింగికి ఎగిరిన ఈ విమానం శుక్రవారం కాలిఫోర్నియాలోని వైమానిక స్థావరంలో సురక్షితంగా దిగింది. నాసా గతంలో ఉపయోగించిన స్పేస్ షటిల్ వ్యోమనౌకల మాదిరిగా మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలయ్యే అంతరిక్ష విమానం తయారీలో భాగంగా.. అమెరికా ఈ బుల్లి మానవ రహిత విమానాన్ని రహస్యంగా పరీక్షిస్తోంది. 8.8 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ విమానం మూడోసారి విజయవంతంగా తిరిగిరావడంతో.. అంతరిక్ష విమాన తయారీలో కీలక ప్రగతి సాధించినట్లైందని అమెరికా వాయుసేన ప్రకటించింది. కాగా, ప్రస్తుతం అమెరికా వద్ద బోయింగ్ కంపెనీ రహస్యంగా తయారుచేసిన రెండు ‘ఎక్స్-37బీ’ అంతరిక్ష విమానాలు ఉన్నాయని ‘జిన్హువా’ వార్తాసంస్థ పేర్కొంది.


