breaking news
Sopore encounter
-
కశ్మీర్లో ఎన్కౌంటర్ నేల కొరిగిన ఆంధ్రా జవాను
శ్రీనగర్/బంగారుపాళ్యం: జమ్మూకశ్మీర్లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జలూర గుజ్జర్పటి ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని జవాన్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పంగల కార్తీక్(32) అనే జవాను బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు సోమవారం తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ముష్కరుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నాయన్నారు. కార్తీక్ వీరమరణంపై శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే ఆర్మీ విభాగం చినార్ కార్ప్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన కార్తీక్ యొక్క అత్యున్నత త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తోంది చినార్ వారియర్స్ కార్తీక్ అపారమైన పరాక్రమానికి, త్యాగానికి వందనం చేస్తోంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతోంది. వారికి సంఘీభావంగా నిలుస్తుంది’అని ‘ఎక్స్’లో తెలిపింది. కాగా, కార్తీక్ది ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమాను పెంట గ్రామం. వరద మందడి, సెల్వి దంపతుల రెండో కుమారుడైన కార్తీక్ పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఈయన చనిపోయిన విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రికల్లా మృతదేహం గ్రామానికి రావచ్చని చెబుతున్నారు. -
లష్కరే టాప్ కమాండర్ హతం
జమ్ము: లష్కర్ ఏ తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబూ బకర్ హతమయ్యాడు. భారత సైనికుల కాల్పుల్లో ఆ ఉగ్రవాది చనిపోయాడు. సోపోర్లో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. గత కొన్ని గంటలుగా జమ్ముకశ్మీర్ లోని సొపోర్ ప్రాంతంలో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లోనే ఉగ్రవాది అబూ బకర్ హతమయ్యాడని తెలుస్తోంది. భారతీయ సైనికులకు ఎలాంటి హానీ జరగలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.