-
యాపిల్ డివైజ్లకు 5జీ అప్గ్రేడ్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తమ పరికరాలు 5జీని సపోర్ట్ చేసేలా ప్రయోగాత్మకంగా సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. దేశీ టెలికం సంస్థల నుంచి 5జీ నెట్వర్క్కు యాక్సెస్ లభించిన యూజర్లు .. ఐఫోన్ల ద్వారా సదరు సర్వీసులను పొందడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఈ బీటా ప్రోగ్రాం కోసం యూజర్లు యాపిల్ వెబ్సైట్లో నమోదు చేసుకుని, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఫోన్ 12 అంతకు మించిన వెర్షన్లకు ఇది పని చేస్తుంది. టెలికం సంస్థ జియో ప్రస్తుతం తాము 5జీ సర్వీసులు అందిస్తున్న నగరాల్లో యూజర్లకు జియో వెల్కమ్ ఆఫర్ పేరిట ప్రత్యేక ఆహ్వానాలు పంపుతోంది. వారికి ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా 1 జీబీపీఎస్ స్పీడ్తో అపరిమిత 5జీ డేటా అందిస్తోంది. అయితే, ఇందుకోసం ప్రీపెయిడ్ కస్టమర్లు రూ. 239 అంతకు మించిన ప్లాన్ ఉపయోగిస్తుండాలి. పోస్ట్ పెయిడ్ యూజర్లు అందరూ ఈ ఆఫర్కు అర్హులే. మరోవైపు, ఎయిర్టెల్ మాత్రం ఇటువంటి ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం లేదు. తాజా యాపిల్ బీటా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకున్నాక యూజర్లు తమ ప్రస్తుత ప్లాన్లో భాగంగానే 5జీ సర్వీసులను ట్రయల్ ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చు. -
737 మాక్స్ విమానాలకు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్
న్యూయార్క్: ప్రపంచదేశాలన్నీ 737 మాక్స్ విమానాల సర్వీసులను నిలిపివేస్తుండటంతో బోయింగ్ కంపెనీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ విమానాల్లో ఏర్పాటుచేసిన ఎంసీఏఎస్ స్టాల్ ప్రివెన్షన్ వ్యవస్థను పది రోజుల్లోగా అప్గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. ఈ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్కు కేవలం 2 గంటల సమయం చాలని బోయింగ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది అక్టోబర్లో స్టాల్ ప్రివెన్షన్ వ్యవస్థ విఫలం కావడంతో లయన్ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 మాక్స్8 విమానం కూలిపోయిందనీ, ఈ దుర్ఘటనలో 189 మంది చనిపోయారని వెల్లడించారు. ఒక్కో బోయింగ్ మాక్స్ విమానంలో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్కు దాదాపు రూ.14 కోట్లు(2 మిలియన్ డాలర్లు) కోట్లు ఖర్చవుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 371 బోయింగ్ 737 మాక్స్ విమానాలు సేవలు అందిస్తున్నాయనీ, వీటి అప్గ్రేడ్కు బిలియన్ డాలర్లు(రూ.6,895 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు. -
ముగిసిన లోన్లకూ ఈఎంఐ కోతలు!!
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) : మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్ లోన్, పర్సనల్ లోన్, గృహ రుణం వంటివేమైనా ఉన్నాయా? వాటిని ఈ మధ్య... అంటే ఏడాది, రెండేళ్ల కిందట పూర్తిగా తీర్చేసి క్లోజ్ చేశారా? అయితే మీరు ఒకసారి మళ్లీ మీ ఖాతాలను చూసుకోండి. మీరు వాటికి ఏ ఖాతాల నుంచి చెల్లింపులు చేశారో ఆయా ఖాతాల్లో కొత్త కోతలేమైనా పడ్డాయేమో సరిచూసుకోవటం మంచిది. ఎందుకంటే ఎస్బీఐ విషయంలో పూర్తిగా తీర్చేసి, క్లోజయిపోయిన రుణాలకు సైతం ఆటోమేటిగ్గా మళ్లీ ఈఎంఐ కోతలు జరిగిపోతున్నాయి. ఒక్క సికింద్రాబాద్ ఆర్ఏసీపీసీ పరిధిలోనే వెయ్యి నుంచి రెండు వేల ఖాతాల వరకూ ఈ రకంగా ప్రభావితమైనట్లు ఎస్బీఐ వర్గాలు చెబుతున్నాయి. రెండు నెలలుగా ఈ సమస్య ఉందని, చాలా మందికి కోతలు పడ్డాయని, ఇప్పటికీ ఇది పరిష్కారం కాలేదని తెలియవచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆయా ఖాతాలను పాత ప్లాట్ఫామ్ నుంచి కొత్త ప్లాట్ఫామ్కు మార్చాల్సి వచ్చిందని, ఈ క్రమంలో కన్వర్షన్ ప్రక్రియ సమర్థమంతంగా జరగలేదని ఎస్బీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘‘ఈ కన్వర్షన్ ప్రక్రియ సరిగా జరగలేదు. అన్ని ఆదేశాలనూ (మాండేట్స్) అది తీసుకోలేదు. దీంతో పాత, క్లోజ్ చేసిన ఖాతాలు కూడా యాక్టివేట్ అవుతున్నాయి. వాటిల్లో కోతలు పడుతున్నాయి’’ అని సికింద్రాబాద్ ఆర్ఏసీపీసీలోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇలాగే తన ఖాతా నుంచి రెండు నెలలుగా నగదు కట్ అవుతోందని ఓ వ్యక్తి ఫోన్ చేసి అడిగినపుడు సదరు అధికారి ఈ సమాధానమివ్వటం గమనార్హం. అసలేం జరిగిందంటే... సికింద్రాబాద్కు చెందిన కృష్ణకుమార్కు ఎస్బీఐలో కార్లోన్ ఉంది. 2009 ఏడాదిలో తీసుకున్న ఈ రుణాన్ని నెలకు రూ.5,790 చొప్పున ఈఎంఐ చెల్లించి ఆయన 2016లో పూర్తిగా తీర్చేశారు. క్లోజ్ చేశారు కూడా. అయితే ఉన్నట్టుండి గత నెల తన హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి రూ.5,790 ఈఎంఐ డెబిట్ కావటానికి ఈసీఎస్ వచ్చింది. కాకపోతే ఆ ఖాతాలో అంత సొమ్ము లేదు. దీంతో ఈసీఎస్ ఆదేశాలు అమలు కాలేదు. ఇలా ఈసీఎస్ ఫెయిలయినందుకు ఆయన హెచ్డీఎఫ్సీకి రూ.600 పెనాల్టీ చార్జీలను చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇదెలా జరిగిందని ఎస్బీఐని సంప్రతిస్తే... పొరపాటున జరిగి ఉండవచ్చని అప్పుడు సమాధానమిచ్చారు. ఇదిగో... ఈ నెల 10న మళ్లీ మరో ఈసీఎస్ ఆదేశం వచ్చింది. ఈ సారి ఖాతాలో డబ్బులుండటంతో ఆ డబ్బులు డెబిట్ అయి ఎస్బీఐకి వెళ్లిపోయాయి. ఖాతా చూసుకుని లబోదిబోమన్న కృష్ణకుమార్... ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయమైన ఆర్ఏసీపీ అధికారుల్ని సంప్రతించారు. నిజానికి చెక్కులయితే బ్రాంచి స్థాయిలో డిపాజిట్ చెయ్యటం, క్లియర్ చెయ్యటం జరుగుతాయి. కానీ ఈసీఎస్ మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్థాయిలోనే జరుగుతుంది. ఇదంతా సాఫ్ట్వేర్ సమస్య వల్ల జరిగిందని, దాదాపు 1,000 నుంచి 2,000 ఖాతాల వరకూ ప్రభావితమయ్యాయని సదరు అధికారులు కృష్ణకుమార్కు చెప్పారు.మరి ప్రాంతీయ కార్యాలయమైన సికింద్రాబాద్ ఆర్ఏసీపీసీ పరిధిలోనే ఇన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయంటే... దేశ వ్యాప్తంగా ఎన్ని ఖాతాలు దెబ్బతిని ఉండొచ్చనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా చిత్రమేంటంటే తను ఖాతా చూసుకుని బ్యాంకును సంప్రతించే వరకూ... ఇలాంటి సమస్య ఒకటుందని గానీ, ఆ సమస్య వల్ల తన ఖాతాలో డబ్బులు డెబిట్ అయ్యాయని ఎవరికీ తెలియదు. పోనీ బ్యాంకు ఇలాంటి వారికి ముందస్తు సమాచారమేదైనా ఇస్తోం దా అంటే... అదీ లేదు. ‘‘మేం సదరు ప్రోగ్రామ్ను రన్ చేస్తే ఎన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయో తెలిసిపోతుంది. వాటన్నిటి నుంచీ డెబిట్ అయిన డబ్బులు ముంబయికి వెళ్లి... రుణ ఖాతా క్లోజయిపోయింది కనక మాకు తిరిగి వచ్చేస్తాయి. మేం వాటిని సస్పెన్స్ ఖాతాలో పెట్టి తిరిగి మీకు క్రెడిట్ చేస్తాం’’ అని సదరు అధికారి సమాధానమిచ్చారు. రెండు నెలలుగా ఏం చేశారు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. తాము ప్రోగ్రామ్ను రన్ చేస్తే ఎన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయో తెలిసిపోతుందని సదరు అధికారే చెప్పా రు. మరి 2 నెలలుగా ఎందుకు రన్ చెయ్యలేదు. బహుశా! చెయ్యబట్టే 2,000 ఖాతాల వరకూ ప్రభావితమయ్యాయని వారికి తెలిసి ఉంటుందని అనుకుందాం!! మరి గతనెలే జరిగినపుడు.. మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటే ఈ నెల కూడా చెక్కు వచ్చి సొమ్ము డెబిట్ అయ్యేది కాదు కదా? ఈ ప్రశ్నకు మాత్రం సదరు అధికారి సమాధానమివ్వలేకపోవటం గమనార్హం. నిజానికి ఒకవేళ ఆయా డబ్బులు డెబిట్ అయిన ఖాతాల్లోకి తిరిగి వచ్చినా... ఈ లోగా రావాల్సిన క్రెడిట్ కార్డు చెక్కుల వంటివి రావటం, డబ్బుల్లేక బౌన్స్ కావటం వంటివి జరగవని చెప్పలేం. కృష్ణకుమార్కు జరిగినట్లే మిగతా వారికీ పెనాల్టీలు పడితే దానికెవరు బాధ్యులు? లీన్ పేరిట ‘హోల్డింగ్’ ఎస్బీఐలో ఈ మధ్య కొందరికి మరో సమస్య కూడా ఎదురవుతోంది. ఉన్నట్టుండి ఖాతాలోని డబ్బుల్లో కొన్ని ‘లీన్’ పేరిట కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మీ ఖాతాలో రూ.30 వేలుంటే... దాన్లో రూ.25వేలు ‘లీన్’ పేరిట కనిపించాయనుకోండి!!. మొత్తం బ్యాలెన్స్ రూ.30వేలు కనిపించినా మీరు విత్డ్రా చెయ్యగలిగేది, వాడుకోగలిగేది రూ.5 వేలు మాత్రమే. లీన్ పేరిట ఉన్న సొమ్మును మళ్లీ బ్యాంకు విడిచిపెట్టేదాకా వాడలేరు. ఈ మధ్య కొందరికి ఇలాగే జరిగినపుడు బ్యాంకును సంప్రతిస్తే... ‘‘అధిక విలువగల లావాదేవీలు జరిగినపుడు ఇలా చేస్తాం’’ అని ఒక అధికారి సమాధానమిస్తే... మీకు వేరే శాఖలో లోన్ ఉండి దాన్ని చెల్లించకపోతే ఇలా హోల్డ్ చేస్తామని మరో అధికారి చెప్పారు. కేవైసీ వివరాలు సమర్పించకపోతే ఇలా చేస్తామని కొందరు సిబ్బంది చెప్పటం గమనార్హం. నిజానికి ఏ బ్రాంచిలోనూ లోన్లు లేనివారికి, మామూలు లావాదేవీలు నిర్వహించేవారికి చాలా మందికి ఇలా జరగటం... ఓ వారం పాటు ఫిర్యాదులు చేసి, బ్యాంకు చుట్టూ తిరిగితే చివరికి లీన్ విడుదల చేయటం వంటివి ఈ మధ్యే చోటుచేసుకున్నాయి. కాగా ఈ విషయమై ఎస్బీఐ రుణాల విభాగం డీజీఎంను సంప్రతించటానికి మెయిల్, మెసేజ్ల ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించినా... ఆయన స్పందించలేదు. -
6758 కార్లను రీకాల్ చేయనున్న ఆడీ కంపెనీ
న్యూఢిల్లీ: భారత్ లోని 6758 ఏ4 సెడాన్ కార్లను రీకాల్ చేయాలని లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ ఆడి నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2011 నుంచి అక్టోబర్ 2014 సంవత్సరాల మధ్య ఉత్పత్తి చేసిన కార్లను మాత్రమే రీకాల్ చేస్తున్నట్టు ఆడీ కంపెనీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయడం కోసమే తప్ప.. ఎలాంటి పరికరాలను మార్చబోమని ఆడి తెలిపింది. ఆడీ ఏ4 కార్ల వినియోగదారులకు డీలర్లు అందుబాటులో ఉంటారని, సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం అపాయింట్ మెంట్ తీసుకుంటారని ఆడి తెలిపింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement