breaking news
SIG
-
ప్రభుత్వ ఆధారిత మ్యాప్ల వెబ్సైట్ ప్రారంభం
న్యూఢిల్లీ: సర్వే జనరల్ ఆఫ్ ఇండియా(ఎస్జీఐ) రూపొందించిన సుమారు 3000 మ్యాప్లను భారత ప్రజలకు అందుబాటులో ఉంచేందుకుగాను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ వెబ్సైట్ను ప్రారంభించింది. అయితే ఈ http://soinakshe.uk.gov.in వెబ్సైట్ నుంచి మ్యాప్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఒక వ్యక్తి తన ఆధార్ నంబర్ను ఉపయోగించి రోజుకు 3 మ్యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ.. ఈ మ్యాప్లను భారతీయులకు మాత్రమే అందుబాటులోఉంచాలన్న ఉద్దేశంతోనే ఆధార్ నంబర్ తప్పనిసరి చేశామని తెలిపారు. ఎస్జీఐ ఆవిర్భవించి సోమవారంతో 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశానికి సంబంధించిన మ్యాప్లను అధికారికంగా ఎస్జీఐ మాత్రమే తయారు చేస్తుంది. -
ఇక రైళ్లు ఢీకొనవు !
కోల్కతా: రైలు ప్రయాణాలు సురక్షితం చేసే దిశగా ముందడుగు పడింది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నిరోధించే ఎలక్ట్రానిక్ రైల్వే ఇంటర్లాకింగ్ వ్యవస్థకు ఐఐటీ ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని కనుగొన్నారు. ఈ కొత్త వ్యవస్థను ఐఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ సంస్థ(ఆర్డీఎస్ఓ), రైల్వే సర్వీస్ ఇంప్రూవ్మెంట్ గ్రూపు(ఎస్ఐజీ) కలిసి అభివృద్ధి చేశాయి. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ పల్లబ్ దాస్గుప్తా మాట్లాడుతూ... ఇంటర్లాకింగ్ వ్యవస్థలోని అనువర్తిత దోషాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని, కొత్త పరికరం వాటిని తగ్గిస్తుందని తెలిపారు. ప్రతిపాదిత విధానంలో యార్డు లేవుట్ ప్రాతిపదికన భద్రతా ప్రమాణాల జాబితాను రూపొందించి తరువాత వాటిని బ్యాంక్ ఎండ్ మోడల్ చెకింగ్ విధానంలో పరిశీలిస్తారని చెప్పారు. ఈ పరికరాన్ని ఇప్పటికే పలు రైలు యార్డుల్లో విజయవంతంగా ప్రయోగించారని వెల్లడించారు. ట్రాఫిక్ ప్రణాళికలు, అత్యవసర పరిస్థితులకు ప్రత్యామ్నాయాల కోసం ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు అపార అవకాశాశాలున్నాయని పరిశోధకులు తెలిపారు.