breaking news
self delivery
-
తనను తాను డెలివరీ చేసుకుంది!
కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సరికొత్త నిదర్శనం ఇది.. సైన్స్ ఫిక్షన్ సినిమాను పోలిన సన్నివేశం ఇది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వస్తువు చిటికెలో డోర్ డెలివరీ అవుతున్నట్లుగా ఒక కొత్త టెస్లా కారు ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కస్టమర్ ఇంటికి వచ్చేసింది! హైవేపై సాఫీగా మందుకు కదులుతూ.. మధ్యమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగుతూ.. గరిష్టంగా 115 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ తన కొత్త ఓనర్ ఉన్న లొకేషన్కు భద్రంగా చేరుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్ కారు ‘మోడల్ వై’ను టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన కొత్త యజమాని ఇంటికి చేరుకుంది. ఫ్యాక్టరీ నుంచి గమ్యస్థానం చేరుకొనే వరకు కారు సాగించిన ప్రయాణాన్ని అందులోని ‘డాష్ క్యామ్’రికార్డు చేసింది. ఇందుకు సంబంధించి టెస్లా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు తమ అటానమస్ కారు డెలివరీని ఎలాన్ మస్క్ ‘ఎక్స్’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్ ఆపరేటింగ్ లేకుండా ఒక పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్ కారు తమదేనన్నారు. ఈ విజయాన్ని సాధించినందుకు టెస్లా సాఫ్ట్వేర్, ఏఐ చిప్ డిజైన్ బృందాలను ఆయన అభినందించారు. మోడల్ వై కారు గంటకు గరిష్టంగా 115 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు టెస్లా ఏఐ, ఆటోపైలట్ విభాగం చీఫ్ అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
పురిటి నొప్పులతో పది కిలోమీటర్లు నడిచి..
► మార్గమధ్యలో తానే పురుడు పోసుకున్న గిరిజన మహిళ ► వెంట తెచ్చుకున్న బ్లేడ్తో బిడ్డ నుంచి పేగును వేరు చేసిన వైనం మారేడుమిల్లి నెలలు నిండిన గర్భిణులను సుఖ ప్రసవానికి ఆసుపత్రికి తరలించేందుకు కనీస చర్యలు తీసుకోకపోతుండటంతో తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతంలో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం మారేడుమిల్లి మండలం లోతట్టు ప్రాంతమైన కింటుకూరు గ్రామానికి చెందిన పాలించి లక్ష్మి నెలలు నిండటంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంపచోడవరం ఆసుపత్రికి వచ్చేందుకు భర్తతో బయలుదేరింది. ఇంతలో పురిటి నొప్పులు రావడంతో ఆ బాధ భరిస్తూనే కొండ ఎక్కి పది కిలోమీటర్లు నడుస్తూ వచ్చింది. దాహంగా ఉందంటూ భర్తను కాలువ నుంచి నీరు తేవాలని చెప్పింది. ఈలోపు నొప్పులు అధికమవడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్తో బిడ్డ నుంచి పేగును వేరుచేసి పురుడు పోసుకుని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ పరిస్థితి గమనించిన ఓ యువకుడు మొబైల్ నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి వెళ్లి 108కి సమాచారం ఇచ్చాడు. గంట తరువాత వాహనంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఆమెను తరలించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.