పుట్టింది దేశభక్తుల కుటుంబంలో కానీ...
                  
	న్యూఢిల్లీ: వారిది బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన దేశభక్తుల కుటుంబంగా పేరుగాంచింది. కానీ,వారి వారుసుడు మాత్రం మతమౌఢ్యంతో దేశానికే  ద్రోహం తలపెట్టాడు. అతడే అల్ ఖయిదా ఉగ్రవాద సంస్థ ఇండియా విభాగం అథినేత సమాల్ హక్. ఇటీవల పట్టుబడిన ఉగ్రవాది మహ్మద్ ఆసిఫ్ విచారణలో  వెల్లడైన విషయాలు  ఇప్పుడు ఇంటలిజెన్స్ వర్గాలను  సైతం  విస్తుగొలుపుతున్నాయి. 
	ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ ప్రాంతానికి చెందిన సమాల్ హక్ అల్ ఖయిదా ఉగ్రవాద సంస్థ భారత ఛీఫ్గా ఉన్నాడని తెలిసి కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. మౌలానా అసిమ్ ఉమర్ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తే సమాల్ హక్ అని తెలిసి వృద్ధ తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. తమ దృష్టిలో సమాల్ ఎప్పుడో చచ్చిపోయాడని అతని తల్లి చెబుతుండగా,  కొన్ని సంవత్సరాల క్రితమే ఇంటి నుండి వెళ్లిపోయిన అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని తండ్రి ఇర్ఫాన్ ఉల్ హక్ పేపర్లో ప్రకటించడం విశేషం.
	
	సమాల్ గురించి అతని తండ్రి మాట్లాడుతూ..'ఎప్పుడూ పుస్తకాలంటే అసహ్యించుకునే సమాల్ ఒక రోజు సడన్గా మదర్సాలో చేరి ఖురాన్, అరబిక్ను అభ్యసిస్తానన్నాడు. అలాగే ఉన్నత చదువులకు మక్కాకు వెళ్తా అని లక్ష రూపాయలు కావాలని అడిగాడు. అయితే ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకొని కుటుంబానికి ఆసరాగా ఉండాలని సూచించాం. అయితే మా మాటను వినకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు' అని తెలిపాడు.
	పాకిస్తాన్కు చేరుకున్న సమాల్ చాలా స్వల్పకాలంలోనే అల్ ఖయిదా ఉగ్రవాద నాయకుడు అల్ జవహరి నమ్మకాన్ని పొందాడు. ఈ నేపథ్యంలో  ఉగ్రవాద సంస్థ భారత విభాగానికి నాయకుడిగా నియమించబడ్డాడని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.