breaking news
Sachin tendulkars last match
-
భారత్ తిరుగులేని ఆధిక్యం.. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ 43/3
వెస్టిండీస్తో రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. రోహిత్ శర్మ (111 నాటౌట్), చటేశ్వర్ పుజారా (113) సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజు శుక్రవారం భారత్ 495 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 313 పరుగుల ఆధిక్యం నెలకొల్పింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆట ముగిసేసరికి 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ రెండు, ఓజా వికెట్ తీశారు. కరీబియన్లు ఓవరాల్ గా 270 పరుగులు వెనుకబడి ఉన్నారు. భారత బౌలర్లు జోరు ఇలాగే సాగితే ఇన్నింగ్స్ విజయం సాధించే అవకాశాలున్నాయి. రోహిత్ శామ్యూల్స్ బౌలింగ్ లో సిక్సర్ బాది సెంచరీ చేశాడు. అంతకుముందు పుజారా కెరీర్లో ఐదో టెస్టు సెంచరీ నమోదు చేశాడు. 415/9 వద్ద రోహిత్ 46 పరుగులతో ఉన్నాడు. అనంతరం రోహిత్ ఒంటరి పోరాటం చేసి సెంచరీ చేయడం విశేషం. రోహిత్ కిది వరుసగా రెండో సెంచరీ. షిల్లింగ్ ఫోర్డ్ బౌలింగ్ లో రోహిత్ క్యాచవుట్ అయినా నోబాల్ గా ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. టీ విరామానికి ముందు అశ్విన్ అవుటవగా, ఆ తర్వాత భువనేశ్వర్, ఓజా వెంటవెంటనే అవుటయ్యాడు. అంతకుముందు టీమిండియా కెప్టెన్ ధోనీ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. కోహ్లీ (57), పుజారా ఇద్దరూ షిల్లింగ్ ఫోర్డ్ బౌలింగ్ లో అవుటయ్యారు. ధోనీని బెస్ట్ పెవిలియన్ చేర్చాడు. చివరి మ్యాచ్ ఆడుతున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (74) డియోనరైన్ బౌలింగ్లో సామీకి క్యాచ్ ఇచ్చాడు. రెండో రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే సచిన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రెండో రోజు సచిన్ (38 బ్యాటింగ్), పుజారా (34 బ్యాటింగ్) వ్యక్తిగత ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించారు. మొదటి రెండు బంతుల్లో పరుగులేమీ రాకపోయినా.. తర్వాత వరుసగా రెండు బంతులను సచిన్ బౌండరీకి తరలించడంతో ప్రేక్షకుల్లో ఆనందోత్సాహాలు చెలరేగాయి. టినో బెస్ట్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి సచిన్ దాదాపు ఔటైనంత పని జరిగినా.. తృటిలో ప్రమాదం తప్పింది. షార్ట్ లెంగ్త్ బాల్ను సచిన్ ఫ్లాష్ చేయడానికి ప్రయత్నించాడు గానీ అది కొద్దిలో తప్పిపోయింది. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా కేకలు పెట్టారు. షిల్లింగ్ ఫోర్డ్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతిని సచిన్ బౌండరీకి తరలించాడు. దీంతో మాస్టర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. రెండో రోజు ఆట చూసేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా హాజరయ్యారు. ఎప్పుడూ కుర్తా పైజమాలో కనిపించే రాహుల్.. ఈ రోజు మాత్రం టీషర్టులో ఆహ్లాదంగా ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 182 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
సచిన్ చివరి మ్యాచ్: క్రిస్ గేల్ ఔట్.. షమీకి తొలి వికెట్
ఐపీఎల్ మ్యాచ్లలో సిక్సర్లు అలవోకగా బాదేస్తూ.. అందరినీ హడలెత్తించిన క్రిస్ గేల్ కాస్తా 11 పరుగులకే చాప చుట్టేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చిట్టచివరి మ్యాచ్లో క్రిస్ గేల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇంతకుముందు మ్యాచ్లో 9 వికెట్లు తీసి దడదడలాడించిన భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ.. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్మన్ను సులభంగా బోల్తా కొట్టించాడు. దీంతో జట్టు స్కోరు 25 పరుగుల వద్ద ఉండగానే రోహిత్ శర్మ క్యాచ్ పట్టగా క్రిస్ గేల్ వెనుదిరిగాడు. 17 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ కొట్టిన గేల్ తక్కువ స్కోరు వద్దే ఔట్ కావడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అంతకుముందు ఈ మ్యాచ్లో బారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు సచిన్ టెండూల్కర్ కుటుంబం మొత్తం వాంఖడే స్టేడియానికి చేరుకుంది. తర్వాత 20 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 64 పరుగుల స్కోరు చేసింది. పావెల్ 23 పరుగులతోను, డారెన్ బ్రేవో 19 పరుగులతోను క్రీజ్ను అంటిపెట్టుకుని ఉన్నారు. సచిన్ చివరి మ్యాచ్ను చూసేందుకు ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, సినీతారలు, సచిన్ అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది. సచిన్కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్రికెట్ ప్రపంచ చరిత్రలో ఇన్ని మ్యాచ్ లు ఆడిన వ్యక్తిగా సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. అలాగే క్రికెట్ సచిన్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.