saagubadi
-
మిరప సహా కూరగాయలు, అలంకరణ మొక్కలకూ కొత్త రకం తామర పురుగుల బెడద
మిరప రైతులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న కొత్త రకం తామర పురుగులు మిరప పూలతో పాటు లేత మిరప కాయలను కూడా ఆశిస్తున్నట్లు డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. లక్షలాది హెక్టార్లలో సాంద్ర పద్ధతిలో సాగులో ఉన్న మిరప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దీని ఉనికిని గుర్తించారు. మిరప తోపాటు టమాటో, బంగాళదుంప, వంగ వంటి సొలనేసియే కుటుంబానికి చెందిన కూరగాయ పంటలకు కూడా కొత్త రకం తామర పురుగులు సోకే ప్రమాదం వున్నందున అప్రమత్తంగా ఉండాలని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది. గత ఏడాది జనవరి–ఫిబ్రవరిలో చిలకలూరిపేట, ప్రత్తిపాడు, యడ్లపాడు మండలాల్లో మొట్టమొదటి సారిగా కొత్త రకం తామర పురుగులు మిరప పూలను ఆశిస్తున్నట్లు లాం లోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే గుంటూరు జిల్లాలో కొత్త రకం తామర పురుగు మిరప తోటలను ఆశించిందని లాం ఉద్యాన శాస్త్రవేత్తలు గమనించారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లోని మిరప తోటలను తామరపురుగు ఆశించిందని సమాచారం. బెంగళూరులోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న వ్యవసాయ సంబంధ పురుగు వనరుల జాతీయ బ్యూరో (ఎన్.బి.ఎ.ఐ.ఆర్.) శాస్త్రవేత్తలతో సంప్రదించిన తర్వాత ఇవి ‘త్రిప్స్ పార్విస్పైనస్’ అనే కొత్త రకం తామర పురుగులని గుర్తించినట్లు డా. వైఎస్సార్ హెచ్.యు. వైస్ ఛాన్సలర్ డా. టి జానకిరాం, పరిశోధనా సంచాలకులు డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త రకం తామర పురుగులు ఇండోనేషియా నుంచి 2015లో మన దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. హవాయి, ఇండోనేషియా దేశాల్లో ఈ తామరపురుగులు సొలనేసియే కుటుంబానికి చెందిన మిరపతో పాటు టమాటో, వంగ, బంగాళ దుంప వంటి కూరగాయ మొక్కలను, అలంకరణ మొక్కలను కూడా ఎక్కువగా ఆశించే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొందరు రైతులు కొత్త రకం తామర పురుగులను చూసి ఎర్రనల్లి అని భావించి సంబంధిత మందులు వాడుతున్నారు. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి తెలిపారు. బయో మందులు వాడితే రసంపీల్చే పురుగుల తీవ్రత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ పురుగు ఆశించిన పొలాల్లో రైతులు భయాందోళనలో విపరీతమైన, విచక్షణారహితంగా పురుగుమందులను కొడుతున్నారు. తద్వారా పురుగు ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందువల్ల తాము సిఫారసు చేసిన పురుగుమందులను సూచించిన మోతాదులో పిచికారీ చేయటం ద్వారా ఉధృతిని తగ్గించుకోవచ్చని డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి వివరించారు. సందేహాలు తీర్చుకోవటం ఎలా? ఈ సమస్య గురించి రైతులు మరింత సమచారం తెలుసుకోవాలంటే.. డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని లామ్ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి – సీనియర్ శాస్త్రవేత్త డా. సి. శారద (94904 49466), శాస్త్రవేత్త డా. కె. శిరీష (99891 92223)లను అన్ని పని దినాలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో కాల్ చేసి మాట్లాడవచ్చు. రేపు వెబినార్ అధిక వర్షాల సందర్భంగా ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలపై ఈ నెల 24 (బుధవారం) ఉదయం 11 గం. నుంచి మ. 1.30 గం. వరకు డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం జూమ్ ఆప్ ద్వారా వెబినార్ను నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం. జూమ్ మీటింగ్ ఐ.డి.. 823 5000 1594 పాస్వర్డ్ – 863362. యూట్యూబ్ ద్వారా కూడా పాల్గొనవచ్చు. మిద్దె తోటల సాగుపై 3 రోజుల ఆన్లైన్ కోర్సు ఇంటిపై కూరగాయలు, పండ్ల సాగులో మెలకువలు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికుల ప్రయోజనార్థం డిసెంబర్ 16–18 తేదీల్లో మూడు రోజుల పాటు ఆన్లైన్ పద్ధతిలో సర్టిఫికెట్ కోర్సును నిర్వహించాలని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, విస్తరణ విద్యా సంస్థ (ఇ.ఇ.ఐ.) సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఆసక్తి గల గృహిణులు, ఉద్యోగులు, యువత తమ ఇంటి నంచే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా శిక్షణ పొందవచ్చని ఇ.ఇ.ఐ. సంచాలకులు డాక్టర్ ఎం. జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్లు డా. ఆర్. వసంత, డా. పి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ కోర్సు జరగనుంది. వంద మందికి మాత్రమే ప్రవేశం. కోర్సు ఫీజు రూ. 1,500. రిజిస్ట్రేషన్ కోసం... https://pjtsau.edu.in/www.eeihyd.org/ https://forms.gle/wPriDddKVao9Ecj16 ఆకాశ్ చౌరాసియా 5 రోజుల శిక్షణా శిబిరం సేంద్రియ సేద్య పద్ధతిలో బహుళ అంతస్థుల వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ 14 జాతీయ అవార్డులు దక్కించుకున్న యువ రైతు శాస్త్రవేత్త ఆకాశ్ చౌరాసియా తెలంగాణలో 5 రోజుల ఆచరణాత్మక శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు మెదక్ జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లెలోని ‘ఐ.డి.వి.ఎం. కామ్యవనం’ ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుంది. మల్టీ లేయర్ ఫార్మింగ్ సహా 11 అంశాలపై శిక్షణ ఇస్తారు. మధ్యప్రదేశ్కు చెందిన బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ చౌరాసియా ఆరుతడి పంటల ద్వారా ఏడాది పొడవునా అధికాదాయం పొందే ఆచరణాత్మక మార్గాలపై శిక్షణ ఇవ్వటంలో ఆయన ప్రసిద్ధి పొందారు. 50 మందికే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనదలచిన వారు భోజనం, వసతి, శిక్షణ రుసుముగా రూ. 4 వేలు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాల కోసం.. 94495 96039. - పతంగి రాంబాబు, సాగుబడి చదవండి: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
సాగుబడి 06 Oct 2020
-
సాగుబడి 29 Sep 2020
-
సాగుబడి 28 July 2020
-
సాగుబడి 19th Aug 2016
-
సాగుబడి 18th Aug 2016
-
సాగుబడి 16th Aug 2016
-
అకాల వర్షం.. కన్నీటి సేద్యం!
ఆశలన్నీ పంటల మీదే పెట్టుకున్న అన్నదాత కలలను అకాల వర్షాలు పేకమేడల్లా కూల్చేస్తున్నాయి. పంట చేతికొచ్చే దశలో వడగళ్లు ఉసురుపోసుకుంటున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న పెనుమార్పుల బారినపడి కుదేలైన రైతన్నకు సత్వర పరిహారంతో సాంత్వన చేకూర్చాలి. సేద్యాన్ని నిలబెట్టేందుకు ముందుచూపుతో నిర్మాణాత్మక చర్యలు అవసరమంటున్నారు - డాక్టర్ జె. సురేష్. పెరుగుతున్న భూతాపం వల్ల ఇటీవలి కాలంలో వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులు వ్యవసాయాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.ఈ పరిణామం ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అభివృద్ధి పేరుతో ప్రబలిన అవాంఛనీయ ధోరణుల వల్ల సహజవనరులపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలో మానవాళిపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. గత రెండు నెలల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అకాల వర్షాలు పంటలను తుడిచి పెట్టటాన్ని ఈ పూర్వరంగంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది. ఉత్తరాదిలో 1.1 కోట్ల హెక్టార్లలో.. మార్చిలో కురిసిన అకాల వర్షాలు ఉత్తర భారతదేశాన్ని కుదిపేసి అన్నదాతను నిలువునా ముంచాయి. తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లలో సుమారు కోటీ 10 లక్షల హెక్టార్లలో చేతి దాకా వచ్చిన పంటలు నీటి పాలై అన్నదాతలకు అపార నష్టం మిగిల్చాయి. అసలే రుతుపవనాలు సకాలంలో రాక, వర్షపాతం తక్కువై ఖరీఫ్ కలసి రాలేదు. దీంతో రైతులు రబీపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆరుగాలం శ్రమించి ఇబ్బడిముబ్బడిగా పెట్టుడులుపెట్టి పైరు చేతికొచ్చే దశలో వరుణుడు సృష్టించిన విలయంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తెలంగాణలో 2.24 లక్షల ఎకరాల్లో.. ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో పంటలపై విరుచుకుపడిన అకాల వర్షాల పుణ్యమా అని రైతాంగం కుదేలైంది. తెలంగాణలో 2.24 లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. రూ. వందలాది కోట్ల మేరకు వరి, మొక్కజొన్న, పత్తి, జొన్న, సజ్జ, మిరప, పసుపు, కూరగాయ పంటలు, పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. పశువులు, గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. కోత కోసి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డుల్లో నిల్వ సదుపాయాలు లేక ఆరుబయట పెట్టిన ధాన్యం తడిసింది. ప్రకృతికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట పెనుశాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాలను అకాల వర్షాలు ముంచెత్తాయి. వేల హెక్టార్లలో మామిడి, కొబ్బరి, అరటి, వరి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కరవు బారిన పడిన తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల గత వర్షాకాలంలో కన్నా అధిక వర్షపాతం నమోదవడం కలవరపరిచే విషయం. విపత్తుల దెబ్బ సేద్యానికే ఎక్కువ ప్రకృతి విపత్తులతో పంటలు భారీగా నాశనమవడం ఏటికేడు పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. గత దశాబ్దకాలంలో విపత్తులు పెచ్చుమీరిన తీరును ప్రపంచ ఆహార సంస్థ(ఎఫ్ఏవో) తాజా అధ్యయనం ఎత్తిచూపింది. 2003-13 మధ్య కాలంలో 48 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 78 సార్లు విరుచుకుపడిన కరవులు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల నష్టాన్ని విశ్లేషించింది. అత్యధికంగా 22% మేరకు నష్టపోయింది వ్యవసాయం, అనుబంధ రంగాలేనని ఎఫ్ఏవో లెక్కతేల్చింది. రైతులతోపాటు వ్యవసాయంపై ఆధారపడిన రైతు కూలీలు, గ్రామీణ పేదలు, బీమా సౌకర్యం లేని బడుగు జీవులు సుమారు 250 కోట్ల మంది విపత్తుల ధాటికి అల్లాడారు. ఈ దశాబ్దంలో సుమారు రూ. 7 వేల కోట్ల డాలర్ల మేరకు పంటలకు, పశుసంపదకు తీరని నష్టం వాటిల్లింది. ఆసియా దేశాల్లో అత్యధికంగా 2,800 కోట్ల డాలర్లు, ఆఫ్రికా దేశాల్లో 2,600 కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగిందని అంచనా. భూసేకరణ ఆర్డినెన్స్పై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అకాల వర్షాలకు కుదేలైన రైతుల పట్ల మరింత సానుభూతితో స్పందించే ప్రయత్నం చేశారు. పంట నష్టపోయిన రైతులకిచ్చే పరిహారం మొత్తాన్ని 50 శాతం పెంచారు. పరిహారమిచ్చే నిబంధనను సైతం సడలించారు. ఇకపై 33 శాతం నష్టపోయినా పరిహారమిస్తామని తెలిపారు. ఇది గతంలో 50 శాతంగా ఉండేది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చారు. అస్థిర వాతావరణ పరిస్థితుల్లో బాధిత రైతులను ఆదుకోవటానికి ఈ చర్యలు చాలవు. పరిశోధనలకు పదునుపెట్టాలి అకాల వర్షాలు, వడగండ్ల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతును కేంద్రంగా తీసుకొని పంటల బీమా సదుపాయంతో పటిష్ట రక్షణ కల్పించాలి. నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా.. సాధ్యమైనంత త్వరగా రైతుకు పరిహారం అందిస్తే సాంత్వన కలుగుతుంది. వాతావరణ మార్పుల ప్రభావంపై పరిశోధనలను వేగిరం చేయాలి. దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించటం ద్వారా నష్టాన్ని తగ్గించే వీలుంది. ఇందుకు ఖర్చుపెట్టే ప్రతి డాలరుకు 4 రెట్ల మేరకు విపత్తు నష్టం తగ్గుతుందంటున్న ఎఫ్ఏవో తోడ్పాటు తీసుకోవాలి. కష్టాల కడలిలో కన్నీటి సేద్యం చేస్తున్న అన్నదాతలకు ప్రభుత్వాలు నిండుమనసుతో బాసటగా నిలవాల్సిన సమయమిది! (వ్యాసకర్త : సహాయ ఆచార్యులు, ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం.మొబైల్: 93976 68770) -
వైరస్ను తట్టుకునే బొప్పాయి!
బొప్పాయి సాగు చేస్తూ పపయా రింగ్స్పాట్ వైరస్(పీఆర్ఎస్వీ)తో సతమతమవుతున్న రైతులకు శుభవార్త. ఈ వైరస్ను చాలా వరకు తట్టుకునే రెండు వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. పుణే (మహారాష్ట్ర)లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఐ) శాస్త్రవేత్తలు పుణే సెలక్షన్-1, పుణే సెలక్షన్-3 అనే రెండు రకాల బొప్పాయి వంగడాలను రూపొందించారు. ఈ వంగడాలకు వైరస్ త్వరగా సోకదని, ఒకవేళ సోకినా నష్టం చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల రైతులకు ఈ విత్తనాలను పరీక్షల నిమిత్తం పుణేలోని ఐఏఆర్ఐ ఉచితంగా అందిస్తోంది. ప్రయోగాత్మకంగా సాగు చేయదలచిన రైతులు సంప్రదించాల్సిన చిరునామా: డా. ఎస్.కె.శర్మ, అధిపతి, ఐఏఆర్ఐ, ఫోన్: 020-25889968, ఫాక్స్: 020-25889969. జ్ఛ్చిఛీచిఞఠ్ఛఃజ్చీటజీ.ట్ఛట.జీ పుణే ఐఏఆర్ఐ నుంచి సికింద్రాబాద్లోని ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఈ విత్తనాలు కొన్నిటిని తెప్పించి ఇస్తోంది. ఆసక్తి గల వారు 040-27017735 నంబరులో సంప్రదించవచ్చు. -
వీళ్లు కరువును జయించారు!
చేను కిందే చెరువుంది.. ► ఎకరానికి రూ. వెయ్యి ఖర్చుతో కాంటూరు కందకాల ద్వారా సాగునీటి భద్రత ► నీటి వెతల నుంచి విముక్తి పొందిన ఇద్దరు నల్లగొండ రైతులు ► శాశ్వత సాగునీటి భద్రతకు ఇదే సులువైన మార్గం అంటున్న ► తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక ► నీటి కష్టాలకు శాశ్వత, సత్వర పరిష్కారం.. రైతు చేతిలోనే.. అసలే మెట్ట పొలాలు.. అందులోనూ కరువు కాలం! ఎండాకాలంలో పంటలను, పండ్ల తోటలను ఎలాగైనా బతికించుకోవాలన్న తపనతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్న రోజులివి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో సాగునీరు, తాగునీటి కొరత తీవ్రరూపం దాల్చింది. ఇటువంటి గడ్డుకాలంలో, నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు మాత్రం స్వల్ప ఖర్చుతోనే శాశ్వతంగా సాగు నీటి భద్రతను సాధించారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక(తె.వి.ఇం.వే.) నేతలు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ రైతులు సాగు నీటి సమస్యను అధిగమించారు. కందకాల ద్వారా వాన నీటి సంరక్షణపై ‘మన చేను-మన చెరువు’ పేరిట ఈ వేదిక ప్రచారోద్యమం నిర్వహిస్తూ.. మెట్ట రైతులకు వెలుగుబాట చూపుతుండడం ప్రశంసనీయం. రూ.25 వేలతో పండ్ల తోటకు జలసిరి! పరకాల జోగేశ్వరరావు సింగరేణి కాలరీస్లో అదనపు జనరల్ మేనేజర్గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పదేళ్ల క్రితం ఉద్యాన పంటల సాగు చేపట్టారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లిలో 36 ఎకరాల భూమి కొని.. బత్తాయి(18 ఎకరాలు), మామిడి(9 ఎకరాలు), సీతాఫలం, ఉసిరి తదితర తోటలు సాగు చేస్తున్నారు. 15 బోర్లు వేయగా.. 5 బోర్లలో నీరు పడింది. తోట మొత్తానికీ డ్రిప్ ద్వారా నీరందిస్తున్నారు. బోరు ఎండిపోయి.. చెట్ల వయసు పెరిగే కొద్దీ నీటి అవసరం పెరిగింది. ఒక బోరు పూర్తిగా ఎండిపోయింది. గత మూడేళ్లుగా వేసవిలో పక్కన రైతులను పంటలు వేయొద్దని బతిమాలి.. వారి బోర్ల నుంచి, ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేశానని జోగేశ్వరరావు తెలిపారు. తోటల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న అటువంటి సంక్లిష్ట దశలో తె.వి.ఇం.వే. నేతలు కందకాలు తవ్వుకోమని ఆయనకు సూచించారు. 2014 జనవరిలో తోటలో వాలుకు అడ్డంగా.. 50 మీటర్లకు ఒక కందకం చొప్పున.. 25 వరకు కందకాలు తవ్వించారు. మొత్తం రూ. 25 వేల వరకు ఖర్చయింది. తవ్విన నెల రోజుల్లోనే మంచి వానలు కురవడంతో.. రెండు దఫాలుగా కందకాలు నిండాయి. పొలంలో పడిన ప్రతి చుక్కా బయటకుపోకుండా తొలిసారి భూమిలోకి ఇంకింది. కందకాలతో మళ్లీ జలకళ దీంతో, భూగర్భ జలమట్టం పెరిగి.. ఎండిపోయిన బోరుకు మళ్లీ నీటి కళ వచ్చింది. ఇతర బోర్లలో నీటి పరిమాణం పెరిగింది. దీంతో 2014 ఎండాకాలంలోనూ నీరు కొనాల్సిన అవసరం రాలేదని జోగేశ్వరరావు వివరించారు. ఆ తర్వాత వర్షాకాలం ముగిసే వరకూ ఒక్క పెద్ద వానా కురవలేదు. ఒక్కసారీ కందకాలు నిండలేదు. ఈ(2015) ఎండాకాలం ఎలా గడుస్తుందోనన్న ఆందోళన తలెత్తిన నేపథ్యంలో.. అదృష్టవశాత్తూ ఏప్రిల్ రెండో వారంలో కందకాలు నిండేంత పెద్ద (2 సాలేటి)వాన కురిసింది. కందకాలు తవ్వి ఉన్నందున ప్రతి చుక్కా పొలంలోనే ఇంకి.. నీటి కొరత తీరింది. ఎండిపోయిన బావికి పునర్జలం! నార్కెట్పల్లి మండలం తొండ్లవాయికి చెందిన కంచర్ల మధుసూదన్రెడ్డి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైరైన తర్వాత తన 33 ఎకరాల పొలంలో సేద్యం చేస్తున్నారు. బత్తాయి, వరి, మామిడి తదితర పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో 60 అడుగుల (10 కోలలు) వ్యవసాయ బావి పూర్తిగా ఎండిపోయింది. దశల వారీగా 30 బోర్లు వేయగా.. 3 బోర్లు మాత్రమే నీటిని అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఖరీఫ్, రబీల్లో 8 ఎకరాల వరకు వరి సాగు చేసేవారు. నీరు అందుబాటులో లేక.. వరి సాగు కొన్నేళ్ల క్రితం మానుకున్నారు. విశ్రాంత ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ చంద్రమౌళి స్వస్థలం కూడా తొండ్లవాయి కావడం వల్ల మధుసూదన్రెడ్డి పొలంలో మూడేళ్ల క్రితం బావి, బోర్ల వద్ద కేవలం నాలుగు కందకాలు తవ్వించడంతో... నీటి కరువు తీరిపోయింది. కందకాల పుణ్యమా అని మళ్లీ వరి సాగు.. కందకాలు తవ్వించిన తర్వాత నుంచి వర్షాకాలంలో బావిలో 45 అడుగుల లోతున నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడూ పది అడుగుల లోతున నీళ్లున్నాయి. 7.5 హెచ్పీ మోటారు బావి నీటిని తోడి పంటలకందిస్తోంది. ఈ కరవు కాలపు వేసవిలోనూ 3 బోర్లు అంతరాయం లేకుండా ఇంచున్నర నీరు పోస్తున్నాయి. కందకాల పుణ్యమా మళ్లీ వరి సేద్యం చేస్తున్నారు. ఇప్పుడు రబీ వరి కోతకు సిద్ధంగా ఉంది. పొలంలో కందకాలుంటే చేను కింద నీటి చెరువు ఉన్నట్లే. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవాలి. - కంచర్ల మధుసూదన్రెడ్డి (99495 22288),తొండ్లవాయి, నార్కెట్పల్లి మండలం, నల్లగొండ జిల్లా కందకాలు తవ్వేది ఇలా.. పొలంలో వాలుకు అడ్డంగా మీటరు లోతు, ముప్పావు మీటరు వెడల్పున కందకాలు తవ్వుకోవాలి. ప్రతి 50 మీటర్లకో చోట కందకం తవ్వితే చాలు. కందకం పొడవు 25 మీటర్ల వరకు ఉండొచ్చు. ఎకరానికి కేవలం రూ. వెయ్యి- రూ. వెయ్యిన్నర ఖర్చుతోనే కందకాల ద్వారా.. చేను కింద భూగర్భంలోనే చెరువును నిర్మించుకోవచ్చు. శాశ్వతంగా సాగు నీటి భద్రత కందకాలతోనే సాధ్యపడుతుంది. భూమి కోతను పూర్తిగా అరికట్టడం కూడా కందకాలతోనే సాధ్యం. మెట్ట భూముల్లో రెండు ఆరుతడి పంటలు దిగుల్లేకుండా సాగు చేసుకోవచ్చు. ఎకరంలో 22 లక్షల లీటర్ల నీటిని ఒడిసిపట్టొచ్చు మా పొలంలో 8 ఏళ్ల క్రితమే కందకాలు తవ్వించాను. 5 బోర్లను వాడటం ఆపేసి.. పాత బావి నీటి ద్వారానే 12 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నా. నల్లగొండ జిల్లాలో ఏడాదికి సగటు వర్షపాతం 750 ఎం.ఎం. ఈ సంవత్సరం కరువు వల్ల 400 ఎం.ఎం. మాత్రమే వర్షం పడింది. అయినా, కందకాలు తవ్వుకున్న రైతులకు ఇప్పుడు నీటికి కొరత లేదు. నల్లగొండ జిల్లాలో లక్ష ఎకరాల్లో సాధారణంగా 1.5 టీఎంసీల వాన నీరు భూమిలోకి ఇంకుతుండగా.. ఈ లక్ష ఎకరాల్లో కందకాలు తవ్వితే 8 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకుతుంది. ఎకరం పొలంలో సాధారణంగా 5 లక్షల లీటర్ల నీరు భూమిలోకి ఇంకుతున్నది. కందకాలు తవ్వితే 22 లక్షల లీటర్ల వాన నీరు భూమిలోకి ఇంకుతుంది. మనచేను అడుగునే పెద్ద చెరువున్నట్లు లెక్క. ఇందులో కనీసం 80 శాతం నీటిని మనకు అవసరమైనప్పుడు తిరిగి బోర్లు, బావుల ద్వారా వాడుకోవచ్చు. అందుకే ‘మనచేను మన చెరువు’ ఉద్యమం చేపట్టాం. - సంగెం చంద్రమౌళి (98495 66009), నీటిపారుదల విశ్రాంత చీఫ్ ఇంజినీర్, అధ్యక్షులు, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ఇక మాకు నీటి దిగుల్లేదు! ఇక ఈ ఎండాకాలంలో మాకు దిగుల్లేదు. ఇటీవలి వర్షంతో భరోసా వచ్చింది. పక్క పొలాల్లో బోర్ల నుంచి నీటిని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కందకాలు తవ్విన తర్వాత వరుసగా రెండో వేసవి కూడా నీటి సమస్య లేకుండా గడుస్తున్నది. ఇదంతా తె. వి. ఇం. వే. నేతలు చంద్రమౌళి, శ్యాంప్రసాద్రెడ్డి దగ్గరుండి మా పొలంలో తవ్వించిన కందకాల పుణ్యమే. గత ఏడాది బత్తాయి తోటపై రూ. 9 లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు వేసవి పంటగా 20 టన్నుల బత్తాయిలు, మామిడి కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. కాలువ నీటి సదుపాయం లేని ప్రతి రైతూ పొలంలో కందకాలు తవ్వుకుంటే.. సాగు నీటికి కొరతన్న మాటే ఉండదు. - పరకాల జోగేశ్వరరావు(98663 49019),పండ్ల తోటల సాగుదారు, సుంకెనపల్లి, చిట్యాల మండలం, నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్కు పరిష్కారం కందకాలే..! ప్రతి రైతు పొలంలోనూ కందకాలు తవ్వడం ద్వారా సాగునీరు, తాగునీటి కరువుతోపాటు ఫ్లోరోసిస్ను 100% రూపుమాపడానికి అవకాశం ఉంది. ఫ్లోరోసిస్కు తాగునీరు 10%, సాగు నీరు 90% మేరకు కారణభూతమవుతున్నాయి. కందకాల వల్ల నీటి కొరతతోపాటు నీటి నాణ్యత బాగా పెరుగుతుంది. కరెంటు వాడకం తగ్గుతుంది. అతి తక్కువ వర్షం కురిసే దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో ప్రతి రైతూ కందకాలు తవ్వుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. మన చేను కిందే భూగర్భంలో నీటిని దాచుకొని, కావాలనుకున్పప్పుడు వాడుకోవచ్చు. అందువల్లే మన చేను- మన చెరువు అని నినాదంతో ప్రచారోద్యమం నిర్వహిస్తున్నాం. నీటి ప్రాజెక్టుల ద్వారా ఎకరానికి నీరు పారించడానికి రూ. లక్షకు పైగా ఖర్చవుతుంది. కందకాలు తవ్వడానికి ఎకరానికి రూ. వెయ్యి చాలు. వాటర్షెడ్ పథకంలో కందకాలను చేర్చాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లా రైతులు కోరినా సాంకేతిక సహకారం అందించడానికి మేం సిద్ధమే. - మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి (99638 19074), విశ్రాంత ఈఈ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక -
ఇంటి మట్టికి వందనాలు!
ఈయన పేరు చతుర్వేదుల తారకం. విశ్రాంత అధ్యాపకుడు. అంతేకాదు.. ఇప్పుడాయన ‘సిటీ ఫార్మర్’ కూడా! కిక్కిరిసిన కాంక్రీటు అరణ్యంలో నివసిస్తూ కూడా నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కల్యాణ్నగర్-1లో సొంత అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ.. మేడ మీదే సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేస్తున్నారు. తన కిచెన్ గార్డెన్కు అవసరమైన నల్లబంగారాన్ని (కంపోస్టును) తానే తయారు చేసుకుంటున్నారు. వంటింటి వ్యర్థాలు, పూజకు వాడిన పూలు, రాలిన ఆకులు.. ఎండిన కొమ్మలు, రెమ్మలు.. వీటన్నిటినీ కలిపి కంపోస్టుగా మార్చుతున్నారు. చెత్తను బయట పారేసి మున్సిపాలిటీపై భారం వేయకపోవటం విశేషం. మేడపైన పాలిథిన్ బ్యాగ్లలో ఏరోబిక్ పద్ధతిలో, వంటింట్లో ఏరోబిక్ పద్ధతిలో కంపోస్టు తయారు చేసుకుంటున్నారు. పాలిథిన్ బ్యాగ్లలో చెత్తను 4 అంగుళాల మందాన పొరలు పొరలుగా వేస్తూ మధ్యలో బొకాషి ఎంజైమ్ పొడిని చల్లుతున్నారు. నెలలో కంపోస్టు తయారవుతుందని, 3 నెలల్లో స్వచ్ఛమైన ‘మట్టి’ తయారవుతుందంటున్నారాయన. కేవలం ఈ మట్టినే మడులు, కుండీల్లో వాడుతున్నానన్నారు. ఈ విధంగా సకల పోషకాలున్న మట్టిని నగరంలో మేడపైనే స్వయంగా తయారు చేసుకోవడం.. ఆ మట్టితోనే ఆరోగ్యదాయకమైన ఇంటిపంటలు పండించడం తనకెంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తోందంటారాయన. బోలెడు మాటలు చెప్పేకన్నా.. ఇటువంటి ‘ఆకుపచ్చని’ పనొకటి ఇంటిపట్టునే ఉన్న వనరులతో చేయడం ఎంతో మేలు కదూ..! తారకం(99890 16150) మాస్టారూ.. ‘వరల్డ్ సాయిల్ వీక్’ సందర్భంగా అందుకోండి ‘ఇంటిపంట’ల వందనాలు!! - ఇంటిపంట డెస్క్ -
‘సాక్షి’కి ఎన్ఐఎఫ్ మీడియా అవార్డు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రికకు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘మీడియా అవార్డు’ దక్కింది. ఈ అవార్డును నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) శుక్రవారం ప్రకటించింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మం త్రిత్వ శాఖ పరిధిలోని ఈ ఫౌండేషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. వ్యవసాయ పనుల్లో కాయకష్టాన్ని, సాగు ఖర్చులను తగ్గించే అనేక యంత్రపరికరాలను మారుమూల గ్రామాల్లోని అన్నదాతలు, గ్రామీణులు తమ స్వీయ పరిజ్ఞానంతో ఆవిష్కరిస్తున్నారు. ఇటువంటి అద్భుత ఆవిష్కరణలనెన్నిటినో ‘సాగుబడి’ పేజీ ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో మార్చి 7న జరిగే 8వ నేషనల్ గ్రాస్రూట్స్ అవార్డు ఫంక్షన్లో ఎన్ఐఎఫ్ చైర్పర్సన్ డాక్టర్ ఆర్ఏ మషేల్కర్ చేతుల మీదుగా ‘సాక్షి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రదర్శనకు ఏపీ, తెలంగాణ ఆవిష్కరణలు రాష్ట్రపతి భవన్లో మార్చి 7 నుంచి 13 వరకు గ్రామీణుల సృజనాత్మక ఆవిష్కరణల ప్రదర్శన జరగనుంది. ప్రదర్శనకు మహిపాల్చారి(వరంగల్), మువ్వా కృష్ణమూర్తి(గుంటూరు), గోదాసు నర్సింహ(నల్గొండ), కె. చంద్రశేఖర్(గుంటూరు)ల ఆవిష్కరణలు ఎంపికయ్యాయి. ఈ మేరకు ‘పల్లె సృజన’ అధ్యక్షుడు పోగుల గణేశం మీడియాకు తెలిపారు.