breaking news
Rayachoti town
-
రాయచోటి పరిస్థితిపై వైఎస్ జగన్ ఆరా
- శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచన.. - అదుపులో శాంతిభద్రతలు రాయచోటి: వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకొన్న పరిణామాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఆరా తీశారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్బాషాలకు ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సంఘటన దురదృష్టకరమని, శాంతియుత వాతావరణం నెలకొల్పేలా కృషి చేయాలని సూచించారు. పలువురు ముస్లిం మైనార్టీ నాయకులతో కూడా ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. వైఎస్ జగన్ సూచన మేరకు ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, అంజాద్బాషా పోలీసు అధికారులతో చర్చించారు. పట్టణ పెద్దలతోనూ సంప్రదింపులు జరిపారు. స్థానిక ఎంపీ మిథున్రెడ్డి కూడా వివరాలు తెలుసుకున్నారు. రాయచోటిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి 144 సెక్షన్తో 30 పోలీసు యాక్టును అమలు చేస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు రాయచోటిలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ నవీన్ గులాటీ పట్టణ పెద్దలతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
ఏం కష్టమొచ్చిందో!
రాయచోటిటౌన్: వారికి రెండేళ్ల క్రితం వివాహమైంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. వారి దాంపత్య జీవ నం అన్యోన్యంగా సాగుతోంది. కానీ ఏం కష్టమొచ్చిందో తెలియదు. విషం తీసుకుని నిండుప్రాణాలు తీసుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారిని అనాథను చేసి వెళ్లిపోయారు. స్థానికులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రాయుడి కాలనీకి చెందిన ఎం. కోటయ్య నాయక్, సునీతలకు ముగ్గరు కుమార్తెలు (ఝాన్సీ, శ్రీవాణి, శిరీషా), కుమారుడు అంజి గోపాల్నాయక్ (27). వారి స్వగ్రామం సుండుపల్లె మండలం ఫించా సమీపంలోని కటారుమడుగు. వీరు సుమారు 15 ఏళ్లు క్రితం బ్రదుకుతెరువు కోసం రాయచోటికి వచ్చారు. ఇక్కడే ఉంటూ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అంజిగోపాల్ నాయక్కు సంబేపల్లె మండలం బిడికీకి చెందిన కాంతమ్మ, శేఖర్నాయక్ల కుమార్తె రజని(23)తో రెండు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. అంజిగోపాల్ నాయక్ సుమారు పదేళ్లుగా ఆటోను నడుపుకొంటూ జీవనం సాగించే వాడు. ఈ మధ్య కాలంలో సకాలంలో ఆటో ఫైనాన్స్ బకాయిలు చెల్లించక పోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను తీసుకెళ్లారు. దీంతో కోటయ్య కుమారుడికి ఒక ఎద్దుల బండి కొనిచ్చాడు. దీనినే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తూ ఎస్ఎన్ కాలనీ లోని చెక్ పోస్టు వద్ద కాపురం ఉండేవాడు. కోటయ్య మాత్రం రాయుడి కాలనీలోనే ఉండేవాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం తన భార్య బిడ్డతో కలసి తండ్రి ఉన్న ఇంటిలోకే గోపాల్నాయక్ మకాం మార్చాడు. అందరూ కలిసే ఉంటున్నారు. అయితే గత నాలుగు రోజులుగా కుమారుడు మౌనంగా ఉంటుండటాన్ని గమనించిన తండ్రి ఆరా తీశాడు. అయినా కొడుకు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కోటయ్య భార్య తన కుమార్తెతో కలిసి తిరుపతికి వెళ్లింది. ఇదే సమయంలో తండ్రి కూలిపనికి వెళ్లాడు. మంగళవారం ఉదయం వీరు వీరు తమ పక్కింటి వాళ్ల సెల్ఫోన్ మళ్లీ ఇస్తామని తీసుకెళ్లారు. ఎవరితో మాట్లాడారో తెలియదు కానీ ఎంతకు ఫోన్ ఇవ్వక పోవడంతో తమ ఫోన్ కోసం పక్కింటి మహిళ వెళ్లింది. అమ్మానాన్నల మధ్య వెక్కివెక్కి ఏడుస్తున్న చిన్నారి ఏడుపులు వినిపించాయి. తన ఫోన్ ఇవ్వాలని కోరగా అంజిగోపాల్ నాయక్ తన 6నెలల కుమార్తెను తీసుకొచ్చి ఆమె చేతికిచ్చి ఈ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఫోన్ ఇచ్చి లోపలికి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. ఆమె కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి పరిస్థితి గమనించి వెంటనే 108 ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా మార్గ మధ్యంలోనే భార్య మృతి చెందగా అంజి గోపాల్ నాయక్ ఆస్పత్రిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.