breaking news
Rajarajeshwari Nagar
-
ఏమో.. ప్రధానినీ కావచ్చేమో : నటుడు
శివాజీనగర: విధానసభ ఎన్నికల్లో బెంగళూరు రాజరాజేశ్వరి నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సినీ నటుడు హుచ్చ వెంకట్ తెలిపారు. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వినూత్న నటన ప్రదర్శిస్తూ ఆయన సినీ అభిమానులకు సుపరిచితమే. శనివారం ప్రెస్క్లబ్లో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే మునిరత్నం అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అందుచేత ఈసారి కాంగ్రెస్పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వదన్నారు. అలాగే జేడీఎస్ సైతం మునిరత్నంకు టికెట్ ఇవ్వటానికి నిరాకరిస్తోందని, ఒకవేళ టికెట్ ఇస్తే ముందు ఏర్పడే బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కళంకం ఏర్పడుతుందని ఇవ్వదని జోస్యం చెప్పారు. ఇప్పటికే కుక్కర్ల రాజకీయం ఆరంభమైందని, అంతేకాకుండా చీరలు, మద్యం అమ్మకాలు అధికమయ్యాయని తెలిపారు. ఇకపై స్థలాలు అమ్ముతారు, విధానసౌధను సైతం అమ్మటానికి వెనుకాడని నాయకులకు ఎన్నికల్లో అవకాశం కల్పించరాదని పిలుపునిచ్చారు. మునిరత్నం ఎమ్మెల్యేగా కాకముందు ఉన్న బ్యాంకు బ్యాలెన్స్, ప్రస్తుతమున్న బ్యాంకు బ్యాలెన్స్పై లోకాయుక్త తనిఖీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. వినూత్న రీతిలో ప్రచారం చేపడతా త్వరలోనే ఎమ్మెల్యే నామినేషన్ వేసిన తరువాత వినూత్నంగా ప్రచారం చేపడతానన్నారు. నరేంద్ర మోదీ, బరాక్ ఒబామా సైతం చేపట్టని ప్రచారాన్ని చేపట్టాలని ప్లాన్ చేసుకున్నానని మీడియాకు చెప్పారు. తనది కుక్కర్ల పార్టీ కాదని, ఎన్నికల్లో గెలిపిస్తే తనకు వచ్చే జీతం తీసుకొంటూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తానన్నారు. -
అప్పాజీ విగ్రహానికి నిప్పు
బెంగళూరు : స్థానిక రాజరాజేశ్వరి నగరలో కన్నడ కంఠీరవుడు, పద్మభూషణ్ డాక్టర్ రాజ్కుమార్ (అప్పాజీ) విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిందితులను పట్టుకోడానికి రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి గురువారం మీడియాకు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఇక్కడి రాజరాజేశ్వరి నగరలోని బంగారప్ప లేఔట్ దగ్గర ఉన్న గుడ్డేలో రాజ్కుమార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. గుడ్డే సమీపంలో గ్రానైట్తో పెద్ద దిమ్మె ఏర్పాటు చేశారు. రాజ్కుమార్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘సిపాయి రాము’ సినిమాలోని స్టిల్ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సింథటిక్తో విగ్రహం తయారు చేయించారు. బుధవారం ఆ విగ్రహం తీసుకువచ్చారు. ఈ నెల 23వ తేదీన ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం వేకువ జామున గుర్తు తెలియన అల్లరిమూకలు రాజ్కుమార్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనారు. గురువారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కర్ణాటక రక్షణా వేదిక, జయ కర్ణాటక రాజ్ కుమార్ అభిమానుల సంఘం, అఖిల కర్ణాటక రాజ్కుమార్ అభిమానుల సంఘంతో పాటు వివిధ సంఘాలు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి, నగర అడిషనల్ పోలీసు కమిషనర్లు అలోక్కుమార్, దయానంద్, డీసీపీలు లాబురామ్, అభిషేక్ గోయల్ తదితరుల సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ముందు జాగ్రత చర్యగా ముగ్గురు డీసీపీలు, ఐదు మంది ఏసీపీలు, 10 మంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో పాటు ఎస్ఐలు, కానిస్టేబుల్లు, రెండు కేఎస్ఆర్పీ బెటాలియన్లను సంఘటన స్థలంలో భద్రత కోసం నియమించారు. నిరసన కర్ణాటక రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ, అఖిల కర్ణాటక డాక్టర్ రాజ్కుమార్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సా.రా. గోవిందు, జయ కర్ణాటక సంఘం నాయకులతో పాటు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తదితర పార్టీల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధర్నా నిర్వహిస్తూ.. నిందితులను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. అదే విధంగా కన్నడ సినీ రంగానికి చెందిన రెబల్స్టార్ అంబరీష్, డాక్టర్ భారతీ విష్ణువర్దన్, లీలావతి, జయంతి, జయమాల, పవర్ స్టార్ పునీత్రాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్, ఈగ ఫేం సుదీప్ తదితరులు ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. కన్నడ సినీ రంగంలోని వివిధ విభాగాలకు చెందిన వారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.