breaking news
Radisson Blu
-
ఆ డ్రగ్స్ను ఎవరు, ఎక్కడి నుంచి తెచ్చారు?
బంజారాహిల్స్: పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ పార్టీలో ప్రధాన నిందితులుగా ఉన్న పబ్ భాగస్వామి ఉప్పల అభిషేక్, మేనేజర్ అనిల్ కుమార్లను గురువారం కస్టడీకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు రెండోరోజైన శుక్రవారం కూడా ప్రశ్నించారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు విభాగం ఏసీపీ నర్సింగ్రావు, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, లంగర్హౌస్ డీఐ భాస్కర్రెడ్డి, హుమాయున్నగర్ డీఐ కోటేశ్వర్రావు, బంజారాహిల్స్ డీఐ హఫీజుద్దీన్, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావులతో కూడిన బృందం వీరిని 4 గంటలపాటు విచారించింది. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? ఎవరెవరికి సరఫరా చేశారు..? ఆ రోజు ఎవరెవరు తీసుకున్నారు..? అన్న కోణంలో ప్రశ్నలు సంధించగా తమకు తెలియదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. పబ్లో డ్రగ్స్ తీసుకొని పారేసిన వందలాది సిగరెట్ పీకలను సీజ్ చేసిన పోలీసులు వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో కూడా ప్రశ్నించారు. ఇద్దరి మొబైల్ ఫోన్లలో ఉన్న పలువురు మాదకద్రవ్యాల విక్రేతల నంబర్లను బట్టి గోవా, ముంబై, నైజీరియా నుంచి కొకైన్ తీసుకొచ్చి పబ్లో అమ్ముతున్నట్లుగా గుర్తించి ఆ దిశలోనే వీరిని ప్రశ్నించారు. ఈ పబ్ ప్రధాన భాగస్వాములు వీరమాచినేని అర్జున్, కిరణ్రాజ్ల పాత్రపై కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు. పార్టీలు ఏర్పాటు చేసినప్పుడు ఈ నలుగురు తలా కొంత మందిని పబ్కు పంపిస్తున్నట్లుగా, వీరికి సినీతారలు, సంపన్న వర్గాల పిల్లలతో సత్సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఇద్దరు నిందితులను మరో రెండురోజులపాటు పోలీసులు విచారించనున్నారు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
పోలీసు కస్టడీకి డ్రగ్స్ కేసు నిందితులు
బంజారాహిల్స్: పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులు ఉప్పల అభిషేక్, మహాదారం అనిల్కుమార్ను గురువారం బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిని పోలీసుస్టేషన్కు తరలించారు. డ్రగ్స్ పార్టీపై గురువారం నుంచి 4 రోజులపాటు పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నెల 3న పబ్పై పోలీసులు జరిపిన దాడుల్లో కొకైన్ బయటపడటంతో పబ్ మేనేజర్ అనిల్, భాగస్వామి అభిషేక్పై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా అనిల్, ఏ–2గా అభిషేక్ను చేర్చారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు అర్జున్ వీరమాచినేని, కిరణ్రాజ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
తెచ్చిందెవరు.. వాడిందెవరు?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాడిసన్బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సూత్రధారులతోపాటు మాదకద్రవ్యాలు వినియోగించిన వారిని గుర్తించేందుకు బంజారాహిల్స్ పోలీసులు పలు కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం అరెస్టయిన మహాదారం అనిల్కుమార్, ఉప్పాల అభిషేక్లను సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసులో వీరమాచినేని అర్జున్, పి.కిరణ్రాజులను కూడా నిందితులుగా చేర్చారు. పబ్ మేనేజర్గా ఉన్న అనిల్కుమార్ ఈ కేసులో కీలకమని.. అతడితోపాటు అభిషేక్ను వారం పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు: ఫుడింగ్ అండ్ మింక్ పబ్పై ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి.. డ్రగ్స్, రేవ్ పార్టీ గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సం దర్భంగా బిగ్బాస్ విన్నర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్ధార్థ్తోపాటు పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డా రు. పోలీసులు వారందరి వివరాలు నమోదు చేసు కుని పంపేశారు. ఈ వ్యవహారంపై ఎన్డీపీఎస్ చట్టంలోని 8సీ, 22 బీ, 29 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం మాదకద్రవ్యాలు దొరికిన ప్రాంగణం యజమానులు నిందితులుగా మారతారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది పబ్ను లీజుకు తీసుకున్న అభిషేక్, అర్జున్, కిరణ్లను నిందితులుగా చేర్చారు. పబ్లోని బార్ కౌంటర్పై స్ట్రాలు పెట్టే క్యాడీ (ప్లాస్టిక్ డబ్బా) నుంచి 5 కొకైన్ పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మొత్తం 4.64 గ్రాముల కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ బార్ కౌంటర్ మేనేజర్ అనిల్కుమార్ ఆధీనంలో ఉండటంతో అతడు నిందితుడిగా మారాడు. వీరిలో అభిషేక్, అనిల్ లను అరెస్టు చేయగా.. అర్జున్, కిరణ్రాజ్ ఇద్దరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పబ్ యజమా నుల్లో ఒకరైన కిరణ్రాజ్ ఓ కేంద్ర మాజీ మంత్రి అల్లుడిగా తెలుస్తోంది. దీన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. సీసీ కెమెరాల్లో దొరకలే.. పబ్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సోమవారం విశ్లేషించారు. 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ పబ్లో ఓ పక్కగా బార్ కౌంటర్ ఉంది. పార్టీ జరిగే సమ యంలో అంతా కిక్కిరిసి, కౌంటర్కు అడ్డుగా ఉండటంతో.. అనిల్కుమార్ కదలికలు కనిపించలేదని పోలీసులు చెప్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే.. అతడి ఫోన్, ఐపాడ్లను విశ్లేషిస్తే.. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకున్నారన్న అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక పబ్లో డ్రగ్స్ వాడినవారిని గుర్తించడానికి అవసరమైన ప్రతి ఆధారాన్నీ పోలీసులు సేకరిస్తున్నారు. పబ్లో ఆదివారం చేసిన దాడుల్లో క్లూస్టీం 216 సిగరెట్ బడ్స్ను సీజ్ చేసింది. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం ద్వారా ఎవరైనా డ్రగ్స్ వాడారా అనేది తేల్చాలని భావిస్తున్నారు. వాటిని వినియోగించిన వారి లాలాజలం సిగరెట్ పీకలకు అంటుకుని ఉం టుందని.. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయిస్తే, ఎవరు కాల్చారనేది బయటపడుతుందని అధికారులు చెప్తున్నారు. దీనితోపాటు అనిల్కుమార్ను విచారించి డ్రగ్స్ వాడినవారి పేర్లను రాబట్టాలని.. వారి నుంచి రక్తం, తల వెంట్రుకల శాంపిల్స్ తీసుకుని ఫోరెన్సిక్ పరీక్షలు చేయించాలని భావిస్తున్నారు. రాడిసన్ హోటల్ బార్ లైసెన్సు రద్దు రాడిసన్బ్లూ రెస్టారెంట్ అండ్ బార్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాత్రి హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎన్ఏ అజయ్రావు ఉత్తర్వులు జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 6లో ఉన్న ఈ రెస్టారెంట్ అండ్ బార్లోని పబ్లో డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో 2బి లైసెన్స్ను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తొలుత ఈ విషయంగా షోకాజ్ నోటీసు జారీ చేసిన అధికారులు.. కొద్దిగంటల్లోనే లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. -
ఫైవ్ స్టార్ హోటల్ సీజ్
హరిద్వార్: గంగా నదిని అపవిత్రం చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. పవిత్ర గంగా నదిని కాలుష్య కసారం చేస్తున్నందుకు హరిద్వార్ లోని రాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్ ను ఉత్తరాండ్ కాలుష్య నియంత్రణ బోర్డ్(ఎస్పీసీబీ) అధికారులు సీజ్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిబంధనలకు విరుద్ధంగా కాల్యుష్యాన్ని గంగా నదిలోకి వదులుతున్నందుకు ఈ చర్య తీసుకున్నామని ఎస్పీసీబీ రూర్కీ ప్రాంతీయ అధికారి అంకుర్ కాన్సాల్ తెలిపారు. ఎన్జీటీ నివేదిక ఆధారంగా పది రోజుల క్రితం నోటీసు ఇచ్చినా హోటల్ యాజమాన్యం పద్ధతి మార్చుకోలేదని ఎస్పీసీబీ కార్యదర్శి వినోద్ సింఘాల్ వెల్లడించారు. కాలుష్య కారకాల ఆధారంగా హోటళ్లను మూడు విభాగాలుగా ఎస్పీసీబీ వర్గీకరించింది. గంగా నదిని కాలుష్య రహితంగా, స్వచ్ఛంగా మార్చేందుకు నరేంద్ర మోదీ సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.