breaking news
PVN Madhav
-
బీజేపీ ఐదు శాతం పార్టీనే ఉండిపోతుందేమో!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ భాగస్వామి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్యాయానికి గురవుతోందా? నామ్ కా వాస్తే మాత్రమే ప్రభుత్వ భాగస్వామిగా మిగిలిపోతోందా? ఆ పార్టీ నేతలు స్వయంగా వాపోతున్న విషయాలివే. ఈ ఆవేదన కూడా అర్థం చేసుకోదగ్గదే. ఏదో పెద్దన్న పాత్ర పోషిద్దామన్న ఆలోచనతో తెలుగుదేశంతో జతకట్టిన ఆ పార్టీ రాష్ట్ర నేతలకు ఇప్పుడు కనీసం చిన్నతమ్ముడు పాత్ర కూడా లభిస్తున్నట్లు లేదు. కొందరు మిత్రపక్ష నేతలు ఇప్పటికే బీజేపీని ఐదు శాతం పార్టీగా అవహేళన చేస్తున్నారని వీరు వాపోతున్నారు. పార్టీకి కొత్త అధ్యక్షుడుగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైన సందర్భంగా జరిగిన సమావేశంలో కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తికి దర్పణం పడుతున్నాయి. మంత్రివర్గం కూర్పు నుంచి, నామినేటెడ్ పదవుల నియామకం వరకూ అన్నింటిలోనూ తమకు అన్యాయం జరుగుతోందన్నది వారి ఆవేదన. 2014-19 మధ్యకాలంలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలే ఉన్నా కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావుల రూపంలో రెండు మంత్రి పదవులు దక్కాయి. 2024లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఒకే మంత్రి పదవి దక్కడం.. అది కూడా ఢిల్లీలో పలుకుబడి కలిగిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కావడం విశేషం. ఆ నియోజకవర్గానికి ఆయనకు సంబంధమే లేదట. సూట్ కేస్తో ధర్మవరం వెళ్లి ఎమ్మెల్యే అయిపోయారని, తదుపరి మంత్రి అయ్యారని వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈసారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డట్టు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సభలో ఆయన తన బాధను వ్యక్తం చేసినట్లు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేదని, బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండని రాజు వ్యాఖ్యానించారు. ఇది నిజం కూడా. ఎందుకంటే 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం నానా తంటాలు పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు జరిపింది. ఆ విషయాన్ని ఆయన ఆ రోజుల్లో బహిరంగంగానే చెబుతూ తాను టీడీపీ పొత్తు గురించి మాట్లాడితే బీజేపీ పెద్దలు చివాట్లు పెట్టారని అనేవారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్లు బతిమలాడి మరీ పొత్తు కుదిరేలా చేసుకున్నారు. పొత్తు కోసం చంద్రబాబు స్వయంగా ఢిల్లీలో రెండు,మూడు రోజులు వేచి చూసిన సందర్భాలూ ఉన్నాయి. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత లోకేష్ తన పెద్దమ్మ పురందేశ్వరిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంటబెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ క్రమంలోనే పొత్తు పెట్టుకోవడానికి మంతనాలు జరిగాయి. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండడం కూడా కలిసి వచ్చింది. అంతేకాక వైఎస్సార్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపినా, వివిధ కారణాల వల్ల వైసీపీ ముందుకు రాలేదు. ఆ తర్వాత బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో పొత్తుకు ఓకే చేసిందని చెబుతారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాని మోడీని, భారతీయ జనతా పార్టీని ఎంత తీవ్రంగా విమర్శించారో గుర్తు చేసుకుంటే.. రాజకీయాలలో ఇంతగా దూషించుకుని మళ్లీ కలవగలుగుతారా అన్న సందేహం వస్తుంది. ఎలాగైతేనేం..పొత్తు కుదరడంతో బీజేపీ తన కార్డును ప్లే చేసినట్లే ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో కూటమి ప్రయోజనాలకు అనుకూలంగా పని చేసిందన్న విమర్శలు వచ్చాయి. కొందరు పోలీసు అధికారులను బదిలీ చేసిన తీరు దీనికి దర్పణం పడుతుందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అంతేకాక ఈవీఎంల మానిప్యులేషన్ జరగిందని కూడా చాలా మంది నమ్ముతారు. పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓట్ల శాతం, ఆ తర్వాత అర్దరాత్రికి పెరిగిన ఓట్ల శాతంపై పలు అనుమానాలు వచ్చాయి. అయినా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదు.ఎన్నికల తర్వాత వీవీపాట్ స్లిప్లను, ఈవీఎంలతో కలిపి లెక్కించాలని కొందరు అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో అనుమానాలు మరిన్ని పెరిగాయి. ఇదంతా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్లే జరిగిందన్నది పలువురి భావన. ఆ విషయం నేరుగా చెప్పకపోయినా, విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల మతలబు ఇదేనన్న సందేహాం వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ వ్యూహాత్మకంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యత నడుపుతూ, వారు కోరిన విధంగా రాజ్యసభ సీట్లు కేటాయిస్తూ, క్షేత్ర స్థాయి బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదన్నది ఒక అభిప్రాయం.ఈ నేపథ్యంలోనే తమను ఐదు శాతం పార్టీగా ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. అయినా బీజేపీ నేతల డిమాండ్లు ఎంతవరకు నెరవేరతాయన్నది అప్పుడే చెప్పలేం. గతంలో బీజేపీతోపాటు ఇతరత్రా వారు కూడా పురందేశ్వరిని టీడీపీ ప్రతినిధే అన్నట్లుగా పరిగణిస్తుండే వారు. ఒకప్పుడు చంద్రబాబుకు దగ్గుబాటి కుటుంబానికి మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పుగా ఉన్నా, తదుపరి వారి కుటుంబాల మధ్య రాజీ చేసుకున్నారు. దీంతో ఒరిజినల్ బీజేపీ నేతలు వెనకబడిపోయారు. ఆ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే సీట్లు కూడా పలువురు మాజీ టీడీపీ నేతలకే దక్కాయని అంటారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలలో ఐదుగురు టీడీపీ మద్దతుదారులు కావడం విశేషం. ఇదేమి రహస్యం కాదు. వారిలో ఒకరైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీకి సరైన ప్రాధాన్యత లభించడం లేదని అన్నారట. ఆయన కూడా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో సహజంగానే అసంతృప్తి ఉంటుంది. నామినేటెడ్ పదవులకోసం చంద్రబాబుకు జాబితాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదట. తాజాగా కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒరిజినల్ బీజేపీ నేత కావడంతో ఆ పార్టీ క్యాడర్లో కాస్త ఆశ చిగురించినట్లయింది. ఆయన టీడీపీతో గొడవ పెట్టుకోకపోయినా, అవసరమైనప్పుడు గట్టిగానే నిలదీయవచ్చని అనుకుంటున్నారు. కొంతకాలం క్రితం రాజ్యసభ సీటును బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు పాకా సత్యానారాయణకు కేటాయించడం, ఇప్పుడు మాధవ్కు అధ్యక్ష పదవి ఇవ్వడంలో కేంద్ర బీజేపీకి ఏమైనా వ్యూహం ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. భవిష్యత్తులో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడానికి కూడా సిద్దపడవచ్చన్న అభిప్రాయం ఉన్నా, టీడీపీ బీజేపీ కేంద్ర నేతలను ప్రసన్నం చేసుకుంటున్నంత కాలం కూటమి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అందువల్ల బీజేపీ క్యాడర్కు రాష్ట్రంలో పదవులు పెద్దగా దక్కకపోవచ్చు. వారు నిజంగానే ఐదు శాతం పార్టీగానే మిగిలిపోవచ్చు. అప్పుడప్పుడు మీటింగ్లలో తమ గోడు వెళ్లగక్కుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చు. కేంద్ర బీజేపీ పెద్దలే పలు అవమానాలను దిగమింగుకుని టీడీపీతో కలిసిన తర్వాత రాష్ట్రంలోని బీజేపీ నేతలుకాని, కార్యకర్తలు కాని ఏమి చేయగలుగుతారు?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అవకాశవాదులకు బైబై.. సొంత కార్యకర్తలకు జైజై
భారతీయ జనతా పార్టీ తెలుగువ రాష్ట్రాల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించే విషయంలో పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని స్వచ్ఛమైన సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే పట్టంగట్టింది. ఈ విషయంలో పైరవీలు రికమండేషన్లకు తావు లేకుండా నికార్సైన బిజెపి కార్యకర్తలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణకు ఎన్ రామచంద్రరావుని అధ్యక్షునిగా నియమించగా ఆంధ్ర ప్రదేశ్కు పివిఎన్ మాధవ్ ను సారధిగా నియమించారు. ఈ నియామకం విషయంలో పార్టీ ఢిల్లీ పెద్దలు పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి అవకాశవాదాన్ని కేంద్రంలోని బిజెపి పెద్దలు క్షమించే ఉద్దేశంలో లేకపోబట్టి ఆవిన్ను పక్కకు తప్పించారు. వాస్తవానికి ఆవిడ టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమార్తె అయినప్పటికీ కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎంపీగా కేంద్రంలో మంత్రిగా పనిచేశారు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో బిజెపిలో చేరారు. ఇక్కడ ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఆమె మనసు ఆలోచనలు అన్నీ కూడా ఆమె సామాజిక వర్గం వ్యాపార వర్గంతోబాటు ముఖ్యంగా తెలుగుదేశం అనుకూలంగానే ఉంటూ వచ్చారు తప్ప బీజేపీకి ఆమె ఏనాడు ఉపయోగపడలేదు. బిజెపి పేరు చెప్పుకొని ఆమె తన సొంత పరపతిని పెంచుకొని రాజకీయంగా ఎదిగారు తప్ప పార్టీని ఆమె ఎదగనివ్వలేదు. ఏదైతేనేం మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటినుంచి అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పురందేశ్వరిని తప్పించాలని హార్డ్ కోర్ బిజెపి కార్యకర్తలు కోరుతూ వస్తున్నారు. పురందేశ్వరి ఎంత సేపు తన కుటుంబ పార్టీ ఆయన చంద్రబాబుకు తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలే తీసుకున్నారు తప్ప బిజెపి బలోపేతానికి వీసమెత్తు కృషి కూడా చేయలేదు. ఆమె వైఖరిని మొదటి నుంచి గమనిస్తూ వస్తున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఆమెను పక్కకు తప్పించి జన్మతః బిజెపి కార్యకర్త ఆయన మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.విశాఖనగరానికి చెందిన పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ టర్మ్ పదవి ముగిసాక 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. వాస్తవానికి మాధవ తండ్రి పీవీ చలపతిరావు సీనియర్ బిజెపి నాయకుడు. అద్వానీ వాజ్పేయి వంటి దిగ్గజాలతో కలిసి నడిచిన వాడు. చలపతిరావు అంటే మోడీ ఇతర బిజెపి పెద్ద నాయకులకు కూడా అపారమైన గౌరవం. నికార్సైన చలపతిరావు కుటుంబానికి న్యాయం చేయాలి అనే భావనతో ఉన్న ఢిల్లీ పెద్దలు ఆయన కుమారుడు మాధవ్ కు ఇప్పుడు బిజెపి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. ఈ నియామకం తెలుగుదేశంతోపాటు అవకాశవాద రాజకీయాలు నేరిపే పురందేశ్వరికి షాకింగ్ అని చెప్పాలి.పార్టీ ఆలోచనలు పార్టీ గీత దాటి అడుగు వేయని నిబద్ధత కలిగిన మాధవ్ ఏ విషయంలోనూ తెలుగుదేశానికి తలవంచకుండా పార్టీ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారు అని బిజెపి కార్యకర్తలు నమ్ముతున్నారు. అన్నిటికి మించి చంద్రబాబు బంధువు అయిన పురందేశ్వరి కబ్జా నుంచి బిజెపిని విడిపించడం అతి పెద్ద అడుగు అని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. బిజెపిని చంద్రబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాలు పరపతి పెంచుకున్న పురందేశ్వరికి ఈ నిర్ణయం చేదుగానే ఉంటుంది కానీ నిజమైన బిజెపి కార్యకర్తలకు మాధవ నియామకం తీపి కబురు అని చెప్పాలి.-సిమ్మాదిరప్పన్న -
ఏపీ బీజేపీ కొత్త బాస్గా PVN మాధవ్
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వైపు మొగ్గు చూపించింది అధిష్టానం. దీంతో ఈ మధ్యాహ్నాం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఇవాళ నామినేషన్స్ జరుగుతున్నాయి. అంతకు ముందు అధిష్టానం ఏకగ్రీవంగా పీవీఎన్ మాధవ్ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సంప్రదాయబద్దంగా జరగనున్న ప్రక్రియలో భాగంగా.. సోము వీర్రాజు, జీవీఎల్తో కలిసి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం మాధవ్ పేరును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పీవీఎన్ మాధవ్.. పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలిలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గానూ ఆయన వ్యవహరించారు. ఆయన పదవీకాలం 2019 మార్చి 30 నుండి 2025 మార్చి 29 వరకు కొనసాగింది. అయితే..ఈ మధ్యలో.. 2023లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయ జీవితానికి తోడు సామాజిక కార్యక్రమాల్లోనూ మాధవ్ చురుకుగా పాల్గొంటారు. 2024లో విశాఖపట్నంలో జరిగిన "ఆర్గానిక్ మేళా"ను నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. -
పవన్ మాతో కలిసి రావడం లేదు: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
అమరావతి: అవసరం అయితే బీజేపీకి బైబై చెప్పేందుకు కూడా సిద్ధమేనంటూ ఇప్పటికే తన వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పేశాడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇది మరింత స్పష్టమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీకి పవన్ కల్యాణ్ దూరం జరగాడా అనే దానిపై ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. దీనికి బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఊతన్నిచ్చాయి. తమతో పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదని మాధవ్ సంచలన ఆరోపణలు చేశారు. జనసేనతో పొత్తు ఉన్నా.. లేనట్లే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఎమ్మెల్సీ ఎన్నికలలో సహకరించాలని కోరినా పవన్ స్పందించలేదని ఆయన స్పష్టం చేశారు. పైగా కమ్యూనిస్టులు తమకు సపోర్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, దాన్ని ఖండించాలని కోరినా పవన్ కల్యాణ్ ఖండించలేదన్నారు మాధవ్. -
సీఎం జగన్కు ధన్యవాదాలు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్కు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. ‘సుదీర్ఘ కాలం రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ తుది శ్వాస విడిచిన నా తండ్రి పీవీ చలపతిరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన ప్రభుత్వానికి, సీఎం జగన్కు కృతజ్ఞతలు. ధన్యవాదాలు’ అని పీవీఎన్ మాధవ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: (విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సమావేశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు) -
దుబ్బాకలో బీజేపీ విజయం అద్భుతం: మాధవ్
సాక్షి, విశాఖపట్నం: హోరాహోరిగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికలో చివరకు బీజేపీ విజయం సాధించింది. ఈ సందర్భంగా విశాఖపట్నం బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ అద్భుతమైన విజయం సాధించింది. అనంతరం బీజేపీ అభ్యర్థి రఘునందన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలను ఎన్నో విధాలుగా అధికార పార్టీ టీఆర్ఎస్ ఇబ్బందులకు గురిచేసిందిని, తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కిందన్నారు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేదన్న వారికి దుబ్బాక ఫిలితమే ఒక నిదర్శనం అన్నారు. బీహార్లో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, బీజీపీ విజయం సాధించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనితిరే నిదర్శనం అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. -
'ఒంటరిగానే బలమైన శక్తిగా ఎదుగుతాం'
సాక్షి, విజయవాడ : మేము ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేమని, ఒంటరిగానే బలమైన శక్తిగా ఎదుగుతామని బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని, పోలవరం విషయంలో విచ్చల విడిగా అవినీతి జరిగిందని మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రే పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని అన్నారని విమర్శించారు. టీడీపీ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపిస్తే దానికి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక వైఎస్ జగన్ 100 రోజుల పాలనలో చిత్తశుద్ది కనిపిస్తుందని, నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలనకు సీఎం జగన్ పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 19 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు త్వరగతిన పూర్తి చేసేలా త్వరలోనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తామని మాధవ్ తెలిపారు. -
చిరంజీవి మమ్మల్ని సంప్రదించలేదు..
సాక్షి, అమరావతి : బీజేపీలో చేరే విషయమై మెగాస్టార్ చిరంజీవి తమతో సంప్రదింపులు జరపలేదని, జాతీయ స్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారేమో తెలియదని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 11తరువాత పార్టీలో కీలక మార్పులు, చేర్పులు ఉంటాయని వెల్లడించారు. టీడీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్సీలు బీజేపీతో టచ్లో ఉన్నారన్నారు. తమ పదవులకి రాజీనామా చేసి బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి పదవి వస్తుందని, సామాజిక న్యాయం ఆధారంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అనేది ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుగుతుందని, కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడై రెండేళ్లు మాత్రమే అయ్యిందన్నారు. -
‘నారా, నందమూరి పార్టీగా టీడీపీ’
సాక్షి, విజయవాడ: ఈనెల 23 తరువాత రాష్ట్రంలో టీడీపీ రెండుగా చీలబోతుందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజమైన టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు చేయనున్నారని తెలిపారు. నారావారి పార్టీ, నందమూరి వారి పార్టీగా టీడీపీ చీలనుందన్నారు. రాష్ట్రంలో సైకిల్ టైరులో గాలిలేదని, ఎక్కడ ఉండాలో అక్కడే ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాష్ట్రంలో స్థానం లేదు కాబట్టే జాతీయ స్థాయిలో ఉనికి కోసం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి చంద్రబాబే దోహద పడ్డారని, జనసేన పార్టీ చీల్చిన ఓట్లు టీడీపీవేనని ప్రజలు గమనించారన్నారు. ప్రజాశాంతి పార్టీ పేరుతో రాయలసీమలో చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ధోరణి దొంగే దొంగా అన్నట్టు ఉందని, డేటా చోరి కేసులో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబును ఎన్నికల సంఘం విచారించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ, బీజేపీ కలిసిపోయాయంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొందని.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని మాధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయొచ్చు కదా ?
సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో అసహనం పెరిగిపోయిందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు నాయుడులో అసంతృప్తి పెరిగిపోయిందని, అందుకే బీజేపీ నేతలపై దాడులకు దిగుతోందని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు దీక్షలు కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని ఆరోపించారు. పార్లమెంట్ లాబీలో ఆ పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్పై బీజేపీ స్పష్టమైన వైఖరిని అవలంభిస్తోందని, ఉక్కు పరిశ్రమ ఇస్తున్నారని తెలిసికూడా రాజకీయాలకు పాల్పడుతున్నారని మాధవ్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఉద్యోగాల పేరుతో మంత్రలు కోట్లు దండుకుంటున్నారని, మంత్రుల ఇళ్లలోనే నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పదవులకు రాజీనామా చేయొచ్చు కదా! : తెలుగదేశం పార్టీ దీక్షలన్నీ రాజకీయం, మైలేజే కోసమేనని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. నాలుగేళ్లు పనులు చేయకుండా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు ఎందుకు దీక్ష చేస్తున్నారో ప్రజలకు తెలుసునని.. దీక్షలకు బదులు రాజీనామా చేసి పోరాడాలంటూ డిమాండ్ చేశారు. దొంగ దీక్షల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు. -
చెప్పిందే చెప్పడంలో సీఎం దిట్ట..!
సాక్షి, విజయనగరం : బీజేపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తీతువు పిట్టలా అరుస్తూ, అబద్ధాలు చెబుతూ.. చెప్పిందే చెప్తూ రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏదో వెలగబెడుతున్నట్టు ప్రజల్ని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. పనికిరాని పర్యటనలతో ప్రజాధనం నీళ్లలా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ‘తీతువు పిట్ట సముద్రం ఒడ్డున పడుకొని ఆకాశాన్ని కిందపడకుండా ఆపానని కలలు కంటుందట. చంద్రబాబు తీరు అలానే ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజీపీని అడ్డుకుంటానంటున్న ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం’ అని వ్యాఖ్యానించారు. బాబు రాజకీయాలను ఆ పార్టీ నాయకులే సహించలేక పోతున్నారని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా బలపడదామనుకునే ఆయన కుట్రల్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ రూపేణా రావాల్సిన 16,500 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ, మోదీ సర్కారును బద్నాం చేయడానికి చంద్రబాబు ఆ నిధులను తీసుకోవడం లేదని ఆరోపించారు. -
చంద్రబాబుది వాడుకొని వదిలేసే తత్వం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అవసరం ఉన్నప్పుడు వాడుకొని, అవసరం లేనప్పుడు వదిలేసే తత్వం చంద్రబాబునాయుడిదని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ విమర్శించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి వస్తున్న ఆదరణ చూడలేక, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆ నెపాన్ని బీజేపీపై నెట్టేందుకు చంద్రబాబు ఎత్తుగడ వేశారన్నారు. బీజేపీని రాజకీయ క్రీడలో భాగంగా వాడుకున్నారన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకొన్నట్టు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో ఉంటారన్నారు. పొత్తులతో సంబంధం లేకుండా పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అవినీతి రహితపాలన అందిస్తున్న నరేంద్రమోదీకి అన్ని రాష్ట్రాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సైతం బీజేపీ విజయం సాధించిందన్నారు. రాష్ట్రంలో కార్యకర్తల బలం ఉందని, బలం నిరూపించుకొనేలా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తొలుత స్థానిక గాంధీనగర్ మున్సిపల్ పార్కులో స్మార్ట్సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగుతున్న పనులు పరిశీలించారు. కేంద్రం కాకినాడ స్మార్ట్సిటీ అభివృద్ధికి నిధులు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. రెండేళ్ల క్రితం కేంద్రం కాకినాడకు రూ.400 కోట్లు మంజూరు చేస్తే ఇప్పటి వరకు కేవలం రూ.250 కోట్లకు సంబంధించిన పనులు మాత్రమే ప్రారంభించారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు పర్సంటేజీల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని వాపోయారు. సమావేశంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రామ్కుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పైడా కృష్ణమోహన్, జిల్లా అధ్యక్షుడు వై మాలకొండయ్య, కార్పొరేటర్లు సాలగ్రామ లక్ష్మీప్రసన్న, నల్లబిల్లి సుజాత, గోడి సత్యవతి పాల్గొన్నారు. -
మాధవ్ వర్సెస్ వరప్రసాద్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యేక హోదా అంశంపై ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బుధవారం శాసనమండలిలో టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటే, ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. టీడీపీ తప్పుడు రాతలు: ఎమ్మెల్సీ మాధవ్ ‘టీడీపీ మాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటున్నారు ఎప్పుడు ఇవ్వలేదో చెప్పమనండి. ఎయిమ్స్ పనిజరగడం లేదని టీడీపీ అధికార వెబ్సైట్లో తప్పుడు రాతలు రాస్తున్నారు. మంగళగిరి వెళ్లి పనులు పరిశీలించి మాట్లాడండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి బాకీ లేదు, బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. 2019 ఎన్నికల కోసం హడావుడిగా స్పిల్వే పనులు చేపట్టారు. నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. మేము అన్నీ నిజాలే చెబుతామ’ని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఏపీపై కేంద్రం పోలీసింగ్: ఎమ్మెల్సీ డొక్కా ‘రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. ఇది రాజకీయ ధర్మమా, మిత్ర ధర్మమా? ఏపీ ప్రభుత్వం అడిగిన ప్రతివిషయాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. అహ్మదాబాద్, ముంబై మెట్రోకు వేల కోట్లు కేటాయిస్తారు. అమరావతి మెట్రోకు మాత్రం నిధులు కేటాయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం పోలీసింగ్ చేస్తోంది. అభివృద్ధి ఎలా చేయాలో చంద్రబాబు నుంచి కేంద్రం నేర్చుకోవాలి. పార్లమెంటు చట్టాలంటే బీజేపీకి గౌరవం లేదు. ఐదుకోట్ల ఏపీ ప్రజలను నిర్లక్ష్యం చేయొద్దు. కేంద్రంపై పోరాటం చేసేవరకూ తెచ్చుకోవద్ద’ని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.