breaking news
pulichinthila project
-
పోటెత్తిన వరద.. ప్రకాశం గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకతో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. మంగళవారం ఉదయం నుంచి పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తి దిగువన గల ప్రకాశం బ్యారేజికి నీటిని వదులుతున్నారు. దీంతో ప్రకాశంకు భారీ ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టులో నీటినిల్వ 12 అడుగులకు చేరింది. దీంతో 72 గేట్లను ఎత్తిన అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుడడంతో జగ్గయ్యపేటలోని ముత్యాల, వేదాద్రి, రావిరాల గ్రామల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా, సాగర్ గేట్లను పూర్తిగా ఎత్తడంతో ప్రస్తుతం 152 అడుగులకు చేరింది. సాగర్, శ్రీశైలం నుంచి వరద ఉదృతంగా ఉండడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ల్లో నీటి నిలువ గంటగంటకు పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం, సాగర్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. వరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి విడుదలను కలెక్టర్ ఇంతియాజ్ అహ్మాద్ పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 72 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు గేట్లు ఎత్తే ముందు సైరన్ మోగించి అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకి వరద పెరిగే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ తెలిపారు. ముందు జాగ్రత్తగా గేట్ల ఎత్తి నీటిని విడుదల చేశామాన్నారు. పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని, మత్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. వరద మరింత పెరిగినా.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రెస్క్యూ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఎక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వచ్చని పేర్కొన్నారు. -
పులిచింతల ప్రారంభం
సాక్షి, గుంటూరు: కృష్ణా నదిపై కొత్తగా నిర్మించిన డాక్టర్ కె.ఎల్.రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. సీఎం 12.50 గంటలకు గుంటూరు జిల్లా అచ్చంపేట మండ లం జడపల్లిమోటు తండాకు చేరుకున్నారు. పులిచింతల ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించి, ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రేడియల్ క్రస్ట్గేట్లను ఎత్తి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో స్పీకర్ మనోహర్తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాగా, సీఎంను కలిసి గోడు వెళ్లబోసుకునేందు కు వచ్చిన వందలాది మంది పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. మహానేత వైఎస్ ఫ్లెక్సీ లేదు.. పేరూ లేదు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 15న పులిచింతల ప్రాజె క్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జలయజ్ఞంలో భాగంగా మొదలైన మొట్టమొదటి ప్రాజెక్టు ఇది. ఇక్కడికొచ్చిన రైతులు, పలువురు కిందిస్థాయి ఉద్యోగులు నేరుగా వైఎస్ కృషిని శ్లాఘించినా.. ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కిరణ్గానీ, మంత్రులుగానీ ప్రాజెక్టు ప్రదేశంలో వైఎస్ పేరును కనీసం ప్రస్తావించలేదు. ఫ్లెక్సీల్లో ఎక్కడా వైఎస్ పేరు కానీ, ఫొటో కానీ పెట్టకపోవటం రైతాంగాన్ని విస్మయానికి గురిచేసింది. అలాగే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్, ప్రధాని మన్మోహన్ల ఫోటోలు కూడా ఎక్కడా కనిపించకపోవటం విశేషం.