టైల్స్ దుకాణంలో చోరీ
రూ.2.60 లక్షల సొత్తు అపహరణ
నెల్లూరు(క్రైమ్): డీఎస్ఆర్ ఆస్పత్రి సమీపంలోని ఓ టైల్స్ షాపు షట్టర్ తాళాలు పగులకొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.2.60 లక్షల సొత్తు అపహరించుకుపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నేతాజీనగర్ రెండో వీధికి చెందిన అయాజ్పూర్ భాస్కర్ ఐదేళ్లుగా దివ్యసాయి ఏజెన్సీ పేరుతో టైల్స్ విక్ర య దుకాణం నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు షాపు తెరిచి ఉంటుంది. గురువారం రాత్రి టైల్స్ విక్రయం ద్వారా వచ్చిన నగదును బ్యాగ్లో పెట్టి క్యాష్కౌంటర్లో భద్రపర్చారు.
టైల్స్ లోడ్ శుక్రవారం వస్తున్న నేపథ్యంలో వారికి చెల్లించేందుకు దుకాణంలోనే డబ్బు ఉంచి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం భాస్కర్ దుకాణానికి వచ్చి చూడగా షాపు తాళాలు తెరచి ఉన్నాయి. షట్టర్పైకిలేపి చూడగా క్యాష్కౌంటర్ బాక్స్ బల్లపై ఉంది. బ్యాగ్లో నగదు లేదు. అక్కడే ఉన్న వాచ్మన్ను అడిగారు. ఆయన తనకు తెలియదని చెప్పడంతో వెంటనే ఐదోనగర పోలీసులకు సమాచారం అందించారు.
ఇన్స్పెక్టర్ పి. సుబ్బారావు, ఎస్సై వైవీ సోమయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం వేలిముద్రలను సేకరించింది. చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాగా తెలిసిన వారే చోరీ చేసి ఉంటారనే అనుమానంతో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.