ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన
గుంటూరు ఎడ్యుకేషన్
గుంటూరు రూరల్ మండలం చౌడవరంలోని చేతన ప్రాంగణంలో శ్రీవేంకటేశ్వర బాలకుటీర్ అనుబంధ సంస్థలైన నందన, ఉషోదయ పాఠశాలలు ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సోమవారం ప్రదర్శనను ప్రారంభించిన ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ కె.రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిన సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయన్నారు.
అంతరిక్షయానం, తుపానులు, భూకంపాలు, వరదలు- వాటి నియంత్రణ మార్గాలను సూచిస్తూ ఉషోదయ విద్యార్థులు ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ సందర్శకులను ఆకట్టుకుంది. వివిధ రకాల వ్యర్ధాలతో నందన గ్రామీణ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన క్రేన్లు, బ్రిడ్జ్లు విశేషంగా అలరించాయి. గణిత రోబో, చంద్రకళలు, స్మార్ట్ సిటీ, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర ప్రాజెక్టులు విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టాయి.
బాలకుటీర్ వ్యవస్థాపకురాలు ఎన్.మంగాదేవి, మరుద్వతి, జయశ్రీ, ప్రణయజ, ఆదినారాయణ, పద్మజ, మల్లికార్జునరావు, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల సందర్శనార్ధం మంగళవారం ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.