breaking news
Private land
-
‘నవీన్ మిత్తల్’ ఎన్ఓసీ జారీపై 3న విచారణ: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ స్థలానికి సంబంధించి నవీన్ మిత్తల్ కమిటీ ఎన్ఓసీ జారీ చేసిన అంశంలో దర్యాప్తును మరో సంస్థకు అప్పగింతపై 3న విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ధ్రువపత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే రంగారెడ్డి జిల్లా గుడిమల్కాపూర్లోని 5,262 గజాల స్థలానికి ఎన్ఓసీ జారీ చేయడంపై దర్యాప్తును సిట్కు లేదా సీబీఐకి అప్పగించాలన్న మధ్యంతర పిటిషన్ను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. శాంతి అగర్వాల్ కొనుగోలు చేసిన దాదాపు 5వేల గజాల స్థలానికి తప్పుడు పత్రాలు సమర్పించిన వారికి నవీన్ మిత్తల్ కమిటీ ఎన్ఓసీ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ శాంతి 2011లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్ఓసీ రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. నవీన్ మిత్తల్, జాయింట్ కలెక్టర్ వి.వి.దుర్గాదాస్, తహసీల్దార్లు మధుసూధన్రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుపై 2017లో ప్రైవేటు వ్యక్తులతోపాటు అధికారులు అప్పీళ్లు వేశారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. -
నా స్థలంలో అన్న క్యాంటీన్ ఎలా పెడతారు?
పెద్దాపురం: ప్రైవేట్ స్థలంలో ‘అన్న క్యాంటీన్’ ఎలా ఏర్పాటు చేస్తారంటూ అధికారులను ఓ మహిళ నిలదీసింది. పట్టణంలో ఇంకెక్కడ స్థలం లేదా అని ప్రశ్నించింది. పేదల స్థలమే కావాల్సి వచ్చిందా అని బోరున విలపించింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఆమె స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగింది. పట్టణానికి చెందిన జాలా కన్య మరియ, జాలా పుష్పల తండ్రికి ప్రభుత్వం 1983లో స్థానిక మున్సిపల్ సెంటర్లో రెండున్నర సెంట్లు ఇచ్చింది. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామంటూ మున్సిపల్ అధికారులు ఆదివారం ఆ స్థలం వద్దకు వచ్చారు. దీంతో మరియ అధికారులను అడ్డుకుంది. అయినా కూడా వారు వినకపోవడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంతలో స్థానికులు, ఆమెను అడ్డకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎస్ఐ కృష్ణ భగవాన్ ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోకపోతే.. ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చని అధికారులు చెప్పారు. అందుకే ఆ స్థలంలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు. కాగా, రోడ్డు విస్తరణ వల్ల ఇంటి నిర్మాణం ఆలస్యమైందని బాధితురాలు చెప్పింది. విస్తరణలో పోగా మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకుందామనుకుంటే.. ప్రభుత్వమిలా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామనడం ఎంత వరకు సమంజసమని బాధితురాలి సోదరి కరుణ ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, టీపీవో భాస్కరరావులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. -
ఇసుకాసురులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నక్కవాగులో దొంగలు పడ్డారు...ఇష్టానుసారం తవ్వేసుకుంటున్నారు. ఈ ఇసుక మాఫియా దెబ్బకు నక్కవాగు రూపమే మారిపోయింది. పటాన్చెరు మండలం కంజెర్ల నుంచి మొదలు కొని సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్ పేట వరకు చొరబడిన అక్రమార్కులు వాగును తోడేశారు. దాదాపు 10 కిలోమీటర్ల మేరకు వాగును పూర్తిగా ధ్వంసం చేశారు. అంతటితో ఆగక వాగుకు ఇరువైపులా ఉన్న ప్రైవేటు భూముల్లో ఇసుక మేటలు ఉన్నంత వరకు కొనుగోలు చేసి ఇసుకను తోడేస్తున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలతో నక్కవాగు నామరూపాలు లేకుండా పోయింది. గూగుల్ చిత్రంలో పరిశీలిస్తే 10 ఏళ్ల కిందట గలగల సెలయేటీ నీళ్లతో పారిన నక్కవాగుకు ఇప్పుడు మాఫియా చేతిలో పడి ఉనికే కోల్పోయింది. ఈ వాగులో ఇసుక మొత్తం తోడేసిన అక్రమార్కులు తాజాగా వాగు గర్భంలోని మట్టిని తోడి...అదే వాగు నీళ్లతో ఫీల్టర్ చేసి ఇసుకను తీసి అమ్ముతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఈ వ్యవహారం అంతా రెవిన్యూ అధికారులు, పోలీసుల అండతోనే సాగుతోంది. రోజుకు కనీసం 1000 ట్రాక్టర్ల ఇసుక సంగారెడ్డి పోలీసు స్టేషన్ ముందు నుంచి కలెక్టరేట్ మీదుగా హైదరాబాద్కు వెళ్లిపోతోంది. ఏ ఒక్క అధికారి కూడా ఇసుక లారీలను ఆపేందుకు ప్రయత్నించడం లేదు. ఇసుక ‘రవ్వలు’ కంట్లో పడతాయని సారోళ్లంతా కళ్లు మూసుకుంటున్నారు. కళ్లు తెరిచే సరికి కాసుల గలగలలు కనిపిస్తున్నాయి. అందుకే ఇసుక దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా నిరాటంకంగా సాగుతోంది. గ్రామ పంచాయతీల పేర నకిలీ వే బిల్లులు కొందరు వ్యక్తులు అక్రమ ఇసుక దందాను తమకు ఆదాయంగా మలుచుకుంటున్నారు. ఇసుక రవాణా అడ్డుకోవాల్సిందిగా పోయి నకిలీ వే బిల్లులు ముద్రించి ప్రతి ఇసుక వాహనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధి పనుల పేరిట ఇసుక ఫిల్టర్ యాజమాన్యాలకు కొన్ని పంచాయతీలను వేలం వేసి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో మండలంలోని ఎనిమిది గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ తవ్వకాల కారణంగా భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టడంతోపాటు భవిష్యత్లో పర్యావరణం దెబ్బతినే ప్రమాదం కనిపిస్తున్నా, అక్రమ తవ్వకాలు మాత్రం ఆగటం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వే బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణ సాగుతున్నా, అధికారులు పట్టించుకోవటంలేదు. జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు ఉండే సంగారెడ్డి ప్రాంతంలోనే అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. వందల అడుగల మేర గుంతలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వేస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు కొందరు అక్రమార్కులు. కాసులకు కక్కుర్తి పడిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక ఫిల్టర్ల నిర్వాహణ నిరాటంకంగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే నక్కవాగుకు ఇరువైపుల వెలిసిన ఇసుక ఫిల్టర్లు రాత్రింబవళ్లు నడుస్తున్నాయి. మండలంలోని ఆరుట్ల, చిద్రుప్ప, బేగంపేట్, ఎర్దనూర్, బ్యాతోల్, గౌడిచర్ల, ఇస్మాయిల్ఖాన్పేట్తో పాటు హత్నూర మండలం గుండ్లమాచ్నుర్ శివారులో కూడా ఇసుక ఫిల్టర్లు నిర్వహిస్తున్నారు. వాగు చుట్టూ సుమారు 100 వరకు ఇసుక ఫిల్టర్లు రాత్రీపగలు తేడా లేకుండా నడుపుతూ నిర్వాహకులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ ప్రభుత్వ నిబంధనలన్నింటిని పక్కన పెడుతున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా ఆయా గ్రామ శివారులోని భూముల్లో వందల అడుగల మేర పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ గుంతలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. గుట్టలుగా ఇసుక డంపింగ్లు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇసుకాసురులు పెద్ద మొత్తంలో ఇసుక నిల్వ చేస్తున్నారు. ఫిల్టర్లు నిర్వహిస్తున్న ప్రాంతాలకు సమీపంలో గుట్టల మాదిరాగా వేలాది టన్నుల ఇసుకను పోగు చేస్తున్నారు. ప్రొక్లయిన్లతో తవ్విన మట్టిని నక్కవాగు నీటితో కడిగి ఫిల్టర్ చేస్తున్నారు. తయారైన ఇసుకను లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రతీ రోజు వందలాది లారీలు ఫిల్టర్ ఇసుకను హైదరాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు, సంగారెడ్డి, సదాశివపేట తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫిల్టర్ల ద్వారా తయారైన ఇసుక విలువ లక్షల్లో ఉంటోంది. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో చాలా మంది అక్రమార్కులు అధికారులకు మస్కా కొట్టి చీకటి వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. ఇదంతా బహిరంగాగనే కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకాల వల్ల ఇస్మాయిల్ఖాన్ చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్బ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే నక్కవాగు రూపు కోల్పోతుంది. వాగు పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంటోంది.