ఇక వైట్హౌస్ నాదే...
వాషింగ్టన్: ఒపీనియన్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా డోనాల్డ్ ట్రంప్ తన హవాను కొనసాగించారు. మంగళవారం జరిగిన ఎన్నికలలో ఐదు రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసిన ఉత్సాహంలో ఓ సంచలన ప్రకటన చేశారు. ఇక పోటీ ముగిసింది.. వైట్ హౌస్ తనదేనని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీ తరపున తానే అధ్యక్ష అభ్యర్థినని స్వయంగా ప్రకటించుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలలోని ఐదు ప్రైమరీలను కైవసం చేసుకున్న తర్వాత ట్రంప్ ఇలా ప్రకటించుకున్నారు. కనెక్టికట్, డెలావేర్, మేరీల్యాండ్, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్ లను గెలుచుకున్న తర్వాత జరిగిన విజయోత్సవ ప్రసంగంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది భారీ విజయం. హిల్లరీని ఓడించి వైట్ హౌస్ ను కైవసం చేసుకునే అర్హత తనకు మాత్రమే ఉందని ప్రకటించారు. విజయానికి చాలా దగ్గరలో ఉన్నామని, ఇక రేస్ ముగిసిందని సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు ఐదు రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా ఓట్లకు పైగా గెలుచుకున్నామని ప్రకటించారు. చైనా, జపాన్ , మెక్సికో లాంటి దేశాలను డీల్ చేసే సమర్ధత హిల్లరీకీ లేదని విమర్శించిన ట్రంప్ గతంలో ఎన్నడూలేని విధంగా ఉద్యోగాలను వెనక్కి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అటు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆమె నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించారు. మరోచోట బెర్నీ శాండర్స్ గెలుపొందారు.
కాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ సాధనకు అవసరమైన 1,237 మంది డెలిగేట్ల మద్దతుకు గాను ఈ ఐదు రాష్ట్రాలతో కలిపి ట్రంప్ ఇప్పటి వరకూ 944 మంది మద్దతును సాధించగలిగారు. ఇక డెమొక్రాట్ పార్టీలో క్లింటన్ అభ్యర్థిత్వ రేసులో తన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ కన్నా ముందున్నారు. రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీ నేతలు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇప్పటికే అధికశాతం ప్రైమరీలలో తమ ప్రత్యర్థులపై విజయం సాధించి తమ పార్టీల అభ్యర్థిత్వానికి చేరువవుతున్న విషయం తెలిసిందే.