బ్యాంకు ఉద్యోగులకు చైనాలో వెరైటీ పనిష్మెంట్!
బీజింగ్: ఉద్యోగులు ఎవరైనా బాగా పనిచేయకపోతే.. పైస్థాయి ఉద్యోగులు వారిని మందలించడం సహజంగా జరుగుతోంది. కానీ, చైనాలో మాత్రం ఆశించిన పనితీరు కనబర్చని బ్యాంకు ఉద్యోగులను వరుసక్రమంలో నిలుచోబెట్టి దుడ్డుకర్రతో చితకబాదిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగు చూడటంతో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. సరిగ్గా పనిచేయని ఉద్యోగులను దుడ్డుకర్రతో బాదిన ఉదంతంలో సదరు బ్యాంకు బాస్ తోపాటు పలువురు ఉన్నతాధికారులపై వేటు పడింది.
పని విషయంలో వెనుకబడిన ఎనిమిది ఉద్యోగులు -నలుగురు పురుషులు, నలుగురు మహిళలను ఓ వేదిక మీద నిలుచోబెట్టి.. మీరు ఎందుకు మంచి పనితీరు కనబరచలేదని ఓ వ్యక్తి అడిగాడు. ఈ ప్రశ్నకు ఆ ఎనిమిది సమాధానం ఇవ్వగా.. పనితీరు కనబర్చనందుకు తగినశాస్తి అనుభవించేందుకు సిద్ధం కండి అంటూ.. పడవ తెడ్డులాంటి కర్రతో ఆ వ్యక్తి ఎనిమిది మంది వెనుకభాగంలో బాదాడు. ఓ మహిళ ఈ దెబ్బలు తప్పించుకోవడానికి రెండు చేతులు వెనుకకు పెట్టినా.. ఆ చేతులు తీయమని చెప్పిమరీ కొట్టాడు. చాంగ్ ఝీ ఝాంగ్ జె గ్రామీణ వాణిజ్య బ్యాంకు ఉద్యోగులకు ఈ మేరకు ట్రైనింగ్ సేషన్ లో చేదు అనుభవం ఎదురైంది. ఈ వీడియో వెలుగుచూడటంతో చైనా నెటిజన్లు భగ్గుమన్నారు.
ఈ పద్ధతి పురాతన కాలంలో బానిస వ్యవస్థను సూచిస్తున్నదని, ఉద్యోగులకు కూడా గౌరవాభిమానులు ఉంటాయని, వారినిలా దండించడం దారుణమని చైనా నెటిజన్లు 'వీబో' (చైనా ట్విట్టర్)లో మండిపడ్డారు. ఈ వీడియోపై ప్రజాగ్రహం నేపథ్యంలో చాంగ్ ఝీ బ్యాంకు చైర్మన్ గా ఉన్న స్థానిక కమ్యూనిస్టు పార్టీ చీఫ్ తోపాటు, పలువురు ఉన్నతాధికారులను చైనా సర్కార్ సస్పెండ్ చేసింది.