యజమాని ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టింది
టూటికోరన్ : ఓ పెంపుడు జంతువు మరణించినా అది తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంది. యజమాని ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టి ఓ పెంపుడు శునకం చనిపోయినా... అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ ఘటన తమిళనాడులోని టూటికోరన్లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టూటికోరిన్లో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంట్లోకి గురువారం రాత్రి ఓ తాచుపాము ప్రవేశించింది. ఈ విషయాన్ని పసిగట్టిన పమేరియన్ జాతికి చెందిన ఆమె పెంపుడు శునకం మొరగడం ప్రారంభించింది. నిద్రిస్తున్న యజమానిని పాము కాటేయాలనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా పమేరియన్ విజృంభించింది.
పాము కాటేసినా పెంపుడు జంతువు ఏమాత్రం వెనకంజ వేయకుండా దాని తల వద్ద కొరికి చంపేసింది. ఈ అలికిడికి నిద్ర లేచిన యజమాని తన పెంపుడు శునకాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అది చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆ శునకం అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. విశ్వాసానికి మారుపేరు శునకాలు అన్న మాటను ఈ పమేరియన్ మరోసారి రుజువుచేసింది.