breaking news
polio victims
-
కేటీఆర్ చొరవతో వైకల్యంపై విజయం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో 4వతరగతి చదువుతున్న అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిరాం అనే బాలుడు అందరిలాగా నడిచే స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విటర్లో వెల్లడిస్తూ.. ‘సీఎంఆర్ఎఫ్ సాయంతో పలు శస్త్రచికిత్సల అనంతరం సాయిరాం సాధారణ స్థితికి చేరుకోవడం ఆనందంగా ఉంది’అని పేర్కొన్నారు. గోదావరిఖనికి చెంది న సాయిరాం అనే బాలుడికి పోలియో వల్ల బాల్యంలోనే రెండు కాళ్లు వంకరగా మారి.. నడవలేని స్థితికి చేరుకున్నాడు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి బాలుడు సాయిరాం ఈ ఏడాది జనవరిలో కేటీఆర్ను కలిసి, సాయం కోరారు. సాయిరాంకు వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యతను హైదరాబాద్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్కు అప్పగించారు. దీంతోపాటు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అవసరమైన ఆర్థిక సాయా న్ని బాలుడి కుటుంబానికి అందజేశారు. నగరం లోని ప్రముఖ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సల అనంతరం .. సాయిరాం ప్రస్తుతం సొంతగా నడవగలిగే స్థితికి చేరుకున్నాడు. చికిత్సల ద్వారా పూర్తిగా కోలుకున్న సాయిరాం తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం టీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను.. ఆయన బంజారాహిల్స్ నివాసంలో కలుసుకున్నారు. సాయిరాం సాధారణ స్థితికి చేరుకోవడంపై కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. -
డాక్టర్ సుంకరకు జాతీయ పురస్కారం
బాలల సంక్షేమానికి అందించిన సేవలకు గుర్తింపు సాక్షి, న్యూఢిల్లీ/భీమవరం అర్బన్: వేలాది మంది పోలియో బాధితులకు వైద్య సేవలందించి.. వారు నడవగలిగేలా చేసిన ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావుకు ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ అవార్డ్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్-2013’ పురస్కారం లభించింది. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనూహ్య విజయాలు సాధించిన బాలలకు, బాలల సంక్షేమానికి అవిరళ కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 20 మంది బాలురకు, శిశు సంక్షేమానికి విశేష కృషి చేసిన నాలుగు సంస్థలకు, వ్యక్తులకు జాతీయ శిశు సంక్షేమ, రాజీవ్గాంధీ మానవసేవ అవార్డులను అందజేశారు. ఈ నేపథ్యంలో బాలల సంక్షేమంలో వ్యక్తిగత కేటగిరీలో ఆదినారాయణరావు జాతీయ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతులమీదుగా అందుకున్నారు. ఆదినారాయణరావు పోలియో రహిత భారతదేశం కలను సాకారం చేయడం లక్ష్యంగా ఆయన వైద్యరంగంలో సేవలందిస్తున్నారు. వేలాదిమంది పోలియో బాధితులకు సేవలందించారు. ఆదినారాయణరావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. విశాఖలో స్థిరపడ్డారు. పోలియో వ్యాధిగ్రస్తుల పాలిట దైవంగా పేరుపొందిన ఆయన తన వైద్యసేవల ద్వారా దేశ, విదేశాల్లో పేరుపొందారు. గతంలోనూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖలో ప్రీ పోలియో సర్జికల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా, ప్రేమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ఇనిస్టిట్యూషన్స్ డైరక్టర్ జనరల్గా సేవలందిస్తున్నారు.