breaking news
people shift
-
ఆ ఐదు గ్రామాలూ ఖాళీ
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. బస్సుల్లో వీరిని సింహాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సింహాచలం కొండ దిగువ పాత గోశాల దగ్గర నుంచి మార్కెట్ కూడలి వరకు ఉన్న పలు ప్రైవేటు కల్యాణ మండపాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. వెంకటాపురంలో ఉన్న 1250 ఇళ్ల నుంచి సుమారు 8 వేల మందిని, నందమూరినగర్లో ఉన్న 600 కుటుంబాలకు చెందిన 2,250 మందిని, కంపరపాలెంలోని 250 ఇళ్ల నుంచి 1200 మందిని, పద్మనాభనగర్లో 500 కుటుంబాల నుంచి 2,500 మందిని, ఎస్సీ, బీసీ కాలనీలో 480 ఇళ్ల నుంచి 2 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వారందరికీ అక్కడే భోజన ఏర్పాట్లు చేసి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. పూర్తిగా ప్రమాదం లేదని నిర్ధారించిన తరువాతే ప్రజలను గ్రామాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, చినగదిలి తహసీల్దార్ పునరావాస కేంద్రాల వద్దకు వెళ్లి బాధితులను పలకరించారు. కాగా, గురువారం అర్ధరాత్రి కూడా వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
ఫైలిన్ దెబ్బకు 'పూరి' మొత్తం ఖాళీ
ఫైలిన్ తుపాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిషాలోని కోస్తా తీర ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిషాలోని పవిత్ర పుణ్యక్షేత్రం జగన్నాథస్వామి దేవాలయం ఉన్న పూరి పట్టణాన్ని మొత్తం ఖాలీ చేయించారు. పూరితో పాటు గంజాం, గజపతి, ఖోర్దా, జగత్సింగ్పూర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. యాత్రికులెవరూ పూరి జగన్నాథస్వామి దర్శనానికి వెళ్లరాదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హోటళ్లను మూయించి వేశారు. తీరం ప్రాంతంలో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను ఈ రోజు సాయంత్రం తీరం దాటే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో 70 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు.