breaking news
Panchayat Election 2014
-
'గ్రేటర్'లో విలీనం కాని పంచాయతీలకు పోలింగ్
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని 22 పంచాయతీల ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సరళిని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలు ప్రకటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 22 పంచాయతీల పరిధిలో 573కిపైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించారు. గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసేందుకు మార్గం సుగమంకాకపోవడంతో ఈ గ్రామ పంచాయతీలకు ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ మండలంలోని నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, హైదర్షాకోట్, నేక్నాంపూర్, హిమాయత్సాగర్, బండ్లగూడ, కిస్మత్పూర్, ఖానాపూర్, వట్టినాగులపల్లి, కోకాపేట్, పీరంచెర్వు, గండిపేట్ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. శంషాబాద్ మండలంలోని శంషాబాద్... కుత్బుల్లాపూర్ మండలంలోని బాచుపల్లి, నిజాంపేట్, కొంపల్లి, దూలపల్లి, ప్రగతినగర్.. శామీర్పేట మండలంలోని జవహర్నగర్.. కీసర మండలంలోని నాగారం, దమ్మాయిగూడ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. -
పాంచ్ పటాకా..!
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో ఒకే కుటుంబం నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. విశేషమేంటంటే వీరంతా కాంగ్రెస్ అభ్యర్థులే. ఇబ్రహీంపట్నంలోని ఆంగ్లిస్ట్ స్కూల్ యజమాని నీల్ల చెన్నయ్య కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు పలు వార్డులలో కౌన్సిలర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకటో వార్డు నుంచి చెన్నయ్య కుమారుడు నీల్ల భానుబాబు, 15వ వార్డు నుంచి భార్య అండాలు, 4, 13 వార్డుల నుంచి కూతుళ్లు పల్లె భానురేఖ, ఎన్.భానుప్రియ, 20వ వార్డు నుంచి అల్లుడు పల్లె శ్రీధర్బాబు పోటీ చేస్తున్నారు. మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో కాంగ్రెస్ నుంచి పెద్దగా పోటీ లేకపోవడం కూడా ఈ కుటుంబానికి లాభించింది. బహుశా గతంలో ఏ ఎన్నికల్లో లేనివిధంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకే పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉండడం రికార్డుగా చెప్పుకోవచ్చు.