breaking news
Osho Rajneesh
-
లుక్ మ్యాచ్ అవుతుందా?
లేటెస్ట్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ చిత్రం కంప్లీట్ అవ్వకముందే తన నెక్ట్స్ సినిమాపై దృష్టి పెట్టారు ఆమిర్ ఖాన్. ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీశ్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో రజనీశ్ పాత్రలో ఆమిర్ ఖాన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చినప్పటికీ, ఓషోలా తన లుక్ మ్యాచ్ అవుతుందా? లేదా? అనే విషయంపై ఆమిర్ సందిగ్ధంలో పడ్డారట. దీనికి సంబంధించి తన లుక్స్పై లుక్ టెస్ట్ చేయనున్నారని సమాచారం. ఇందులో ఆయన నాలుగు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నారట. తన గెటెప్కు సంబంధించి ప్రొస్థెటిక్ మేకప్ ఆర్టిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. లుక్స్ పరంగా సంతృప్తి చెందాకే సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నారట ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఇందులో ఆలియా భట్ కీలక పాత్రలో కనిపిస్తారట. -
వెబ్ సిరీస్లో ఆమిర్ ఖాన్..!
ముంబై : ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ఆటగాళ్లు, నటులు, స్పూర్తిదాయక వ్యక్తుల జీవిత చరిత్ర ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ఓషోగా సుపరిచితులైన ఆధ్మాత్మిక గురువు భగవాన్ రజనీశ్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు కరణ్ సన్నద్ధమైనట్లు.. ఓషోగా రణ్వీర్ సింగ్ నటించనున్నట్లు వదంతులు ప్రచారం అయ్యాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఒక అంతర్జాతీయ చానెల్ ఓషో జీవిత చరిత్రను వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం రచయిత శకున్ బత్రా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి కనబరిచారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు లాస్ ఏంజెల్స్ వెళ్లి మరీ చానెల్ ప్రతినిధులను కలిసేందుకు సుముఖంగా ఉన్నారట ఆమిర్. ఇదే గనుక నిజమైతే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ లిస్టులో మరో విలక్షణ పాత్ర చేరడంతో పాటు.. వెబ్ సిరీస్లో ఆమిర్ను చూసి అభిమానులు కూడా కొత్త అనుభూతి పొందవచ్చు. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఓషో 1990లో మరణించారు. వైల్డ్ వైల్డ్ కంట్రీ పేరుతో ‘ద నెట్ఫ్లిక్స్’ ఓషో జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో బీ- టౌన్లో కూడా పలువురు ఈ సిరీస్ గురించి చర్చిస్తున్నారు. అలియా కూడా..! శకున్ సినిమా కపూర్ అండ్ సన్స్లో నటించిన అలియా భట్ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉందట. అయితే ఇందులో తాను నటిస్తుందో లేదో తెలియదు గానీ ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్ అని అలియా చెబుతోంది. -
రజనీష్ ఆశ్రమంలో వినోద్ ఖన్నా
ముంబై: అలనాటి బాలివుడ్ నటుడు వినోద్ ఖన్నా సినీ జీవితం గురించే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయన ఓషో రజనీష్ ఆశ్రమంలో ‘స్వామి వినోద్ భారతి’గా గడిపిన వివాదాస్పద జీవితం గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు. అమితాబ్ బచ్చన్తో పోటాపోటీగా బాలివుడ్ సినిమాల్లో నటిస్తున్న కాలంలోనే ఆయన పుణెలోని రజనీష్ ఆశ్రయం పట్ల ఆకర్షితులయ్యారు. ప్రతి వారంతంలో అక్కడికెళ్లి అక్కడే రెండు రోజులు గడిపి వచ్చేవారు. అందుకు వీలుగా ఆయన తన షూటింగ్లన్నీ పుణె చుట్టుపక్కలనే ఉండేలానే చూసుకునేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అంటే, 1975, డిసెంబర్ 31వ తేదీన సినిమాలకు గుడ్బై చెబుతున్నానని ఆయన బహిరంగంగా ప్రకటించినప్పుడు బాలివుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఆయన కొత్త సినిమాలను కాల్షీట్లు ఇవ్వకుండా షూటింగ్ దశలోవున్న సినిమాలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ‘కామిగాని వాడు మోక్షగామి కాలేడు. ఇదే జీవితానికి ముక్తి మార్గం’ అంటూ ప్రచారం. చేయడం ద్వారా స్వామి రజనీష్ తన ఆశ్రయాన్ని స్త్రీ, పురుషుల శృంగార లీలలకు నిలయంగా మార్చారు. అప్పటికే విలాస జీవితాన్ని గడుపుతున్న వినోద్ ఖన్నా అటువైపు పూర్తిగా ఆకర్షితులయ్యారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఎంత చెప్పినా వినకుండా ఆయన 1982లో రజనీష్ ఆశ్రమానికి పూర్తిగా మకాం మార్చేశారు. అక్కడ ఆయన్ని సహచరులు ‘సెక్సీ స్వామీజీ’ అని పిలిచేవారట. ఆశ్రమాన్ని మూసేయాల్సిందిగా మహారాష్ట్ర పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరగడంతో రజనీష్ తన ఆశ్రమాన్ని అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రానికి మార్చారు. ఆయనతోపాటు వినోద్ ఖన్నా కూడా అమెరికా వెళ్లారు. అక్కడ తాను తోటకు నీళ్లుపోసే వాడినని, తన గురువైన స్వామీజీ రజనీష్ బట్టలు ఉతికే వాడినని వినోద్ ఖన్నా ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో ఓ దీవిని కొనుగోలుచేసి అందులోనే రజనీష్ తన ఆశ్రమాన్ని నడిపారు. దానికి రజనీష్పురం అని కూడా పేరు పెట్టారు. ఆశ్రమంలో ఎయిడ్స్ కారణంగా ఆరేడుగురు మరణించడంతో కోపగించిన అమెరికా ప్రభుత్వం బలవంతంగా రజనీష్ ఆశ్రమాన్ని 1985లో మూసివేసి రజనీష్ను భారత్కు పంపించింది. అప్పుడే వినోద్ ఖన్నా కూడా భారత్కు వచ్చారు. మళ్లీ పుణెలో రజనీష్తోపాటు రెండేళ్లు ఆశ్రమంలోవున్న వినోద్కన్నా 1987లో తిరిగి సినీరంగంలో అడుగుపెట్టారు. రజనీష్ మాత్రం 1990లో చనిపోయే వరకు ఆశ్రమంలోనే గడిపారు. సమాజంలో కావల్సినంత డబ్బు, హోదా లభించడంతో ఇంకేం చేయాలో తోచకా, ఇంకా ఏదో చేయాలనే ఒకలాంటి తాత్విక చింతనతో రజనీష్ మాయలో పడిపోయానని వినోద్ ఖన్నా తన ఆశ్రమ జీవితం గురించి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సరిగ్గా పీక్ టైమ్లో సినిమాలకు వినోద్ ఖన్నా దూరమవడంతో ఆయనకు రావాల్సిన అవకాశాలు కూడా అమితాబ్ బచ్చన్కే ఎక్కువ వచ్చాయి. అమితాబ్ నటించిన ఎక్కువ సినిమాల్లో ఆయన పాత్ర పేరు విజయ్కాగా, వినోద్ ఎక్కువగా అమర్ అనే పేరుగల పాత్రల్లో నటించారు. అప్పట్లో వారికి అదో సెంటిమెంట్. 1960లో విడుదలైన ‘మొగల్ ఏ ఆజం’ సినిమాను వినోద్ ఖన్నా తన 14వ ఏటా చూశారు. అప్పుడే తాను హీరో కావాలని నిర్ణయించుకున్నారట. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వినోద్ ఖన్నాను హాలివుడ్ నటుడు కిర్గ్ డగ్లస్తో పోల్చేవారు. ఇద్దరి గదుమ కింద సన్నటి సొట్ట కనిపించడమే అందుకు కారణం.