Orissa High Court
-
నివ్వెరపరిచే ఆదేశాలు!
కొన్ని ఉదంతాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. వింటున్నది నిజమేనా అనిపిస్తాయి. ఒరిస్సా హైకోర్టు కొన్ని బెయిల్ దరఖాస్తుల విషయంలో వెలువరించిన ఆదేశాలు అటువంటివే. నిరుడు ఏప్రిల్–సెప్టెంబర్ల మధ్య ఆ హైకోర్టు 50 బెయిల్ దరఖాస్తుల్ని అంగీకరించింది. కానీ అందుకు సంబంధించి విధించిన షరతులు అందరినీ నివ్వెరపరిచాయి. ఆ నిందితులంతా రెండు నెలలపాటు పోలీస్స్టేషన్లు, గుడులు, ఆసుపత్రులు, గ్రామీణ రహదారులు, చెరువులు ప్రతిరోజూ ఉదయం మూడు గంటలపాటు శుభ్రం చేయాలన్నది వాటి సారాంశం. మైనింగ్ కార్యకలాపాలు నిలిపేయాలంటూ ఉద్యమించిన వారితోపాటు దొంగతనం, హత్య తదితర క్రిమినల్ కేసుల్లో ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు. నిందితుల్లో అత్యధికులు దళిత, ఆదివాసీ వర్గాలకు చెందినవారు కావటం గమనించదగ్గది. ఇలాంటి పారిశుద్ధ్య పనుల కేటాయింపులో న్యాయమూర్తి కులం కోణాన్ని మించి చూడలేకపోయారని ఈ బెయిల్ ఆదేశాలు తేటతెల్లం చేస్తున్నాయి. సాధారణంగా సామాజిక ఉద్యమకారులెవరైనా ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి ఉదంతాలు న్యాయస్థానం దృష్టికి పోతాయి. కానీ ‘ఆర్టికల్ 14’ అనే డిజిటల్ మీడియాలో గత నెల 27న వచ్చిన కథనాలను సర్వోన్నత న్యాయస్థానం తనంత తానే గమనించటం, ఆ షరతులు చెల్లబోవని వెనువెంటనే ఉత్తర్వులీయటం కొంతలో కొంత ఊరట. ‘కులం పునాదుల మీద మీరు దేన్నీ సాధించలేరు. ఒక జాతినీ నిర్మించలేరు. ఒక నీతినీ నిర్మించలేరు’ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. వచ్చే ఏడాదితో మన దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుని ఎనభైయ్యేళ్లవుతుంది. కానీ దళితులకు, ఇతర అట్టడుగు వర్గాలకూ అడుగడుగునా కులవివక్ష ఎదురవుతూనే ఉంది. కేలండర్లు మారుతున్నా, సాంకేతికత విస్తరించి అభివృద్ధి జరుగుతున్నా ఆ మనస్తత్వం మారటం లేదు. కుల వివక్ష, దానిపేరిట సాగుతున్న హింస దేశాభివృద్ధికే ఆటంకంగా ఉన్నదనీ, అది మనుషులను వేరు చేస్తోందనీ, మనసుల్ని సంకుచితపరుస్తోందనీ స్వామి వివేకానంద ఏనాడో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మార్పు ఎక్కడ?ఇతర వ్యవస్థల్లో ఇలాంటి జాడ్యాలు కనబడినప్పుడు సరిదిద్దాల్సిన న్యాయవ్యవస్థ సైతం ఆ తానులో ముక్కగా మారితే...? ఒరిస్సా హైకోర్టు ఆదేశాలు చూసి రాయగడ అదనపు సెషన్స్ న్యాయస్థానం, మరో ఆరు కింది కోర్టులు ఈ మాదిరి ఆదేశాలే జారీ చేశాయి. ‘ఒడిశా న్యాయవ్యవస్థ వ్యక్తీకరించిన ఈ తిరోగమన మనస్తత్వం మమ్మల్నెంతో కలవరపరుస్తోంది. ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించటమేకాక నిందితుల గౌరవాన్ని దెబ్బతీసే చర్య’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జయ్మాలా బాగ్చీ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్మొహమాటంగా తెలిపింది. విచారణకు ముందే నేరం చేసినట్టు నిర్ణయానికొచ్చి ‘శిక్షించటం’ అమల్లోవున్న చట్టాల ప్రకారం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.బాక్సైట్ మైనింగ్ కోసం వేదాంత గ్రూప్ సంస్థలకు రాయగడ, కలహండి జిల్లాల్లో ఇచ్చిన లీజులవల్ల తూర్పు కనుమల్లోని 1560.40 హెక్టార్ల అటవీభూమి నాశనం కాబోతోంది. రెండు జిల్లాల్లోని రెండు గ్రామాలు అదృశ్యమవుతాయి. ఆదివాసీ, దళిత వర్గాలు ఈ లీజుల రద్దుకు 2023 నుంచి ఉద్యమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం సైతం విశాఖ ఏజెన్సీలో ఇలాగే లీజుకీయటం, ఉద్యమాలు చెలరేగటం ఎవరూ మరిచిపోరు. అటు తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ అనుమతుల్ని రద్దు చేసింది. ప్రకృతి విధ్వంసానికి దారితీసే, స్థానికుల జీవికను దెబ్బతీసే ఇలాంటి చర్యను ఒడిశా సర్కారు విరమించుకోకపోగా, ఉద్యమకారుల్ని నిర్బంధిస్తోంది. సకాలంలో జోక్యం చేసుకోకుండా వ్యవస్థలు నిర్లిప్తంగా మిగిలితే ఉద్యమాలు హింసాత్మక రూపం ధరిస్తాయి. వాటిని ప్రభుత్వాలు శాంతిభద్రతల సమస్యగా పరిగణించి అణచ టానికి చూస్తాయి. నక్సలైటు ఉద్యమాల తీవ్రత, పర్యవసానాలు చూశాకైనా ఈ పోకడలు మానుకొని, స్థానికుల ఆకాంక్షల్ని గౌరవించే సంస్కృతిని వ్యవస్థలు అలవర్చుకోవాలి. ఈ విషయంలో ఒరిస్సా హైకోర్టు తీరు ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్యపట్ల సుప్రీంకోర్టు ప్రదర్శించిన అప్రమత్తత, దిద్దుబాటు చర్యలు నిస్సహాయ పౌరులకు వ్యవస్థలపట్ల విశ్వాసాన్ని పెంచుతాయి. -
నౌకకు హైకోర్టు అరెస్టు ఉత్తర్వులు!
కటక్: పారాదీప్ ఓడ రేవులో మూడు నెలలుగా బెర్త్ అద్దెను చెల్లించని ఓ విదేశీ నౌకను అరెస్ట్ చేయాలని ఒరిస్సా హైకోర్టు ఆదేశించింది! ఎంవీ డెబి అనే ఈ నౌకలో రూ.220 కోట్ల విలువైన కొకైన పట్టుబడటంతో గత డిసెంబర్ నుంచి పోర్టులో లంగరేసి ఉంది. తమకు ఫీజు చెల్లించనందుకు షిప్పును అరెస్ట్ చేయాలంటూ పారాదీప్ పోర్టు కార్గో టెర్మినల్ విభాగం కోర్టుకెక్కింది. దాంతో నౌక అరెస్టుకు న్యాయమూర్తి జస్టిస్ వి.నరసింహ ఆదేశించారు. అడ్మిరాలిటీ చట్టం–2017 ప్రకారం ఇలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం ఒరిస్సాతో పాటు మరో ఏడు హైకోర్టులకుంది. -
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..
భువనేశ్వర్: బిజూ జనతాదళ్ అభ్యర్థి, తిర్తోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బిజయ్శంకర్ దాస్ చిక్కుల్లో పడ్డారు. ఆయన స్నేహితురాలు సోమాలికా దాస్(29) దాఖలు చేసిన పిటిషన్ స్వీకరించి, విచారణ జరిపిన ఒడిశా హైకోర్టు నిందిత శాసనసభ సభ్యుడికి వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే... 2022 మే 13న సోమాలికా దాస్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పట్ల కేసు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రధానంగా జగత్సింగ్పూర్ పోలీస్ స్టేషన్ ఐఐసీ ఆమె సమస్యలను పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది. ఎఫ్ఐఆర్ ఆధారంగా సీఆర్పీసీ 154(3) సెక్షన్ కింద ఏదైనా చర్య తీసుకోవడంలో జిల్లా ఎస్పీ చొరవ కల్పించుకోవాలి. ఈ మేరకు ఎటువంటి చర్యలు చేపట్ట లేదని ఆమె ఆరోపించింది. ఈ మేరకు సోమాలికా దాఖలు చేసిన పిటిషన్ను జనవరి 27న జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు బిజయ్శంకర్కు వ్యతిరేకంగా తాజా ఫిర్యాదుతో పాటు తన ఆర్డర్ కాపీతో ఐఐపీ, జగత్సింగ్పూర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పిటిషనర్కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా అనుబంధ సమాచారంతో ఫిర్యాదు ఆమోదించి, కేసు నమోదు చేయాలని జగత్సింగ్పూర్ ఐఐసీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. హైకోర్టు ఆదేశాల మేరకు సోమాలికా జగత్సింగ్పూర్ ఐఐసీని సంప్రదించి, రాతపూర్వక ఫిర్యాదును సమర్పించింది. దీని ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఆమెకు సంబంధిత అధికారి హామీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో దాఖలు చేసిన ఫిర్యాదు వ్యతిరేకంగా ఠాణా పోలీసు అధికార వర్గాలు స్పందించక పోవడంతో హైకోర్టుని ఆశ్రయించడం అనివార్యమైందని స్పష్టంచేశారు. బీజేడీ ఎమ్మెల్యే తన ఎన్నికల ఖర్చుల కోసం డబ్బును సేకరించేందుకు సెక్స్ రాకెట్లను నిర్వహిస్తున్నారని సోమాలికా గతంలో ఆరోపించారు. అలాగే పెళ్లి చేసుకుంటానని దగా చేశారని, జగత్సింగ్పూర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహానికి అన్నీ సిద్ధం చేసి, సకాలంలో కానరాకుండా అదృశ్యమై తనను మోసం చేశారని విమర్శించింది. దీనిపై తనపై సంబంధిత ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని ఆరోపించింది. వీటికి సంబంధించి అన్ని సాక్ష్యాలను అందిస్తానని పేర్కొంది. -
అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు..
భువనేశ్వర్: ఒరిస్సా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని స్పష్టం చేసింది. ఏంటీ కేసు..? నిమపారకు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. భువనేశ్వర్ తీసుకెళ్లి ఆమెతో కొన్ని రోజులు సహజీవనం చేశాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఆమెను వదిలి పారిపోయాడు. దీంతో మహిళ అతడిపై కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడు జిల్లా కోర్టులో బెయిల్కు దరఖాస్తు చేసుకుంటే న్యాయస్థానం నిరాకరించింది. అయితే అతడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేసిందున దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం చెప్పింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అలాగే మహిళను బెదిరించవద్దని అతన్ని ఆదేశించింది. కేసు విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. చదవండి: విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్హోస్టస్తో అసభ్యకరంగా.. -
ఒరిస్సా హైకోర్టు స్వయం సమీక్ష
కటక్: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒరిస్సా హైకోర్టు స్వయం సమీక్ష జరుపుకుంది. ఈ మేరకు వార్షిక నివేదిక–2021ను ఇటీవల విడుదల చేసింది. జవాబుదారీతనంతో ఉండటం, నిర్దేశిత లక్ష్యంతో పనిచేయాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. ఎదురైన సవాళ్లు, ప్రధాన తీర్పు, పేరుకుపోతున్న కేసుల తీరును వివరించింది. ఇందులో..హైకోర్టులో 40 ఏళ్లకు పైగా నలుగుతున్న కేసులు 400కుపైగానే ఉన్నట్లు తెలిపింది. కేసుల సంఖ్య పెరుగుతూ పోతుండటపై ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కరోనా సమయంలో కోర్టుల్లో కార్యకలాపాలు కొనసాగించడం ప్రధాన సవాల్గా మారిందని పేర్కొంది. కోవిడ్ కారణంగా ఏడాదిలో 67.20 రోజులను జిల్లా కోర్టులు నష్టపోయాయని తెలిపింది. -
వాటిని అత్యాచారంగా పరిగణించలేం : హైకోర్టు
భువనేశ్వర్ : వయసులో ఉన్న యువతీ, యువకులు ప్రేమలో మునిగితేలడం ఆ తరువాత అమ్మాయి గర్భవతి కావడం మోసం చేశాడంటూ కోర్టుకు ఎక్కడం వంటి కేసులను తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే తాజాగా ఒడిశాలో చోటుచేసుకోగా.. దానిపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టి, శారీరక కలయిక అనంతరం యువతి గర్భం దాలిస్తే దానిని రేప్ (ఐపీసీ 376 అత్యాచారం)గా పరిగణించలేమని న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో ఓ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్ల పాటు తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ఆ యువతి పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండు సార్లు గర్భందాల్చానని, పెళ్లి చేసుకోమ్మని అడిగితే ముఖం చాటేశాడని ఫిర్యాదులో తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపించారు. ఈ క్రమంలోనే నిందితుడు గత ఆరు నెలలుగా జైల్లో ఉంటున్నారు. దీనిపై నిందితుడు హైకోర్టు ఆశ్రయించగా.. శనివారం ఒడిశా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి ఎస్కే పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును చెబుతూ.. ‘ఇటీవల కాలంలో కొంతమంది యువతీ యువకులు ప్రేమలో మునిగితేలుతున్నారు. వారిలో కొందరు యువకులు పెళ్లి చేసుకుంటామని నమ్మించి ప్రియురాళ్ళతో ముందుగానే శారీరక సుఖం పొందుతున్నారు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో యువతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని లైంగిక దాడి కేసులుగా భావించలేం’ అని 12 పేజీల తీర్పులో ప్రతిలో పేర్కొన్నారు. దీంతో జైల్లో ఉన్న యువకుడికి కేసు నుంచి ఉపశమనం కలిగింది. -
21 ఏళ్ల జైలు జీవితం.. తర్వాత నిర్దోషిగా తీర్పు
కటక్: సాక్ష్యాధారాలను క్షుణ్నంగా పరిశీలించడంలో జిల్లా కోర్టు పొరపాటు చేయడంతో ఓ వ్యక్తి 21 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష అనుభవించి... ఆ తరవాత నిర్దోషిగా విడుదలైన ఘటన ఒడిశాలో జరిగింది. గంజామ్ జిల్లాలోని కంటపాడ గ్రామానికి చెందిన సాధు ప్రధాన్ 1997 నవంబర్లో హత్య కేసులో అరెస్టయ్యారు. మహిళను హత్య చేయడంతో పాటు ఆమె ఆభరణాలను కూడా దొంగిలించాడని జిల్లా కోర్టు అతన్ని దోషిగా తేలుస్తూ 1999 ఆగస్టులో జీవిత ఖైదు విధించింది. అనంతరం అతడు హైకోర్టులో తీర్పును సవాల్ చేశారు. ఈ వ్యాజ్యం జూలైలో జస్టిస్ ఎస్కే మిశ్రా, ఏకే మిశ్రాల ధర్మాసనం ఎదుటకు వచ్చింది. సాక్ష్యాధారాలను సరైన కోణంలో పరిశీలించని కింది కోర్టు పొరపాటు చేసిందని పేర్కొంటూ... తీర్పును సవరించి హైకోర్టు సోమవారం ఆయన్ను విడుదల చేసింది. హత్య వెనుక కారణాలను నిరూపించడంలో ప్రాసెక్యూషన్ విఫలమైందని తీర్పు సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. -
'వైఫ్ స్వాపింగ్' కేసులో దంపతులకు ఊరట
భువనేశ్వర్: ఒడిశాలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్య మిశ్రా దంపతులు, ఆయన కుమారుడిని ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అత్తింటి వారు వేధిస్తున్నారని త్రైలోక్య మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అత్త, మామలు, భర్త అరెస్టులో జాప్యం చేస్తే తనకు, తన బిడ్డకు ప్రాణాపాయం ముంచుకు వస్తుందని బాధితురాలు పోలీసులకు తెలిపారు. కాగా, పారిశ్రామికవేత్త త్రైలోక్య మిశ్రా దంపతులు, ఆయన కుమారుడిని ఈనెల 29 వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోగా కోర్టులో పోలీసులు కేసు డైరీ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పెళ్లయిన తొలి రోజుల నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త వేధింపులకు అత్త, మామ పరోక్షంగా కొమ్ముకాసి తన సహనానికి పరీక్ష పెట్టినట్టు లోపముద్ర మిశ్రా అంతకుముందు ఆరోపించారు. హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో వైఫ్ స్వాపింగ్(భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో భర్త వేధింపులు ప్రారంభమైనట్టు తెలిపారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో వివాహం జరిగిందని పేర్కొన్నారు.


