breaking news
Opposition Politics
-
Karnataka election results 2023: హస్తానికి బూస్టర్ డోసు
న్యూడిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన అఖండ విజయం కాంగ్రెస్లో నూతనోత్సాహాన్ని నింపింది. కీలకమైన రాష్ట్రంలో పాగా వేయడంతో పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలాఏళ్లుగా గెలుపు రుచి లేకుండా నీరసించిపోయిన కాంగ్రెస్కు ఇది నిజంగా ఒక బూస్టర్ డోసు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇది దివ్యౌషధంగా పనిచేయనుంది. కేంద్రంలో అధికార బీజేపీని ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఎవరన్న ప్రశ్నకు కొంతవరకు సమాధానం దొరికినట్లే. బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి సాకారం కావడం లేదు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అనే ప్రయత్నాలకు బ్రేక్ పడొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో విజయం నేపథ్యంలో ఇతర పార్టీలు కాంగ్రెస్ ఛత్రఛాయలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోనే ఏకైక విపక్ష కూటమి ఏర్పాటైనా ఆశ్చర్యం లేదు. ఇక నాలుగు రాష్ట్రాలపై గురి లోక్సభ సభ్యుడిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఇటీవలే అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసం నుంచి ఆయనను బలవంతంగా ఖాళీ చేయించడం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి కలిగించాయి. రాహుల్ బీసీల వ్యతిరేకి అంటూ బీజేపీ చేసిన ప్రచారం ఫలించలేదు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కర్ణాటకలో స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారితోనే ఎక్కువగా ప్రచారం చేయించడం కాంగ్రెస్కు లాభించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో 15కు పైగా సీట్లు సాధించింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ ఏడాది తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఛత్తీస్గఢ్, రాజస్తాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ నెగ్గడంతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కర్ణాటకలో విజయంతో ఆ పార్టీ ఇక మరింత దూకుడుగా వ్యవహరించనుంది. ఈ గెలుపు జాతీయ స్థాయిలో తమ పార్టీ పునర్వైభవానికి దోహదపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. -
స్వచ్ఛ రాజకీయాలకు పట్టం కట్టండి
* అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి * ‘మీట్ ది ప్రెస్’లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని * ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం * సెటిలర్లపై టీఆర్ఎస్ పార్టీకి స్థిరత్వం లేదు * టీఆర్ఎస్ నేతలు సెటిలర్లపై ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు సాక్షి, హైదరాబాద్: ‘‘అధికార, ప్రతిపక్ష పార్టీ లు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఓడిపోయిన పార్టీల వాళ్లు.. గెలిచిన పార్టీల్లో చేరుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న వారు.. ఐదేళ్లు కూడా ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. జనాన్ని దోచుకున్నా పర్వాలేదుగానీ.. విమర్శించే ప్రతిపక్షం ఉండకూడదని అధికార పక్షం భావిస్తోంది. ఈ ధోరణులు పరోక్షంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇలాంటి పార్టీలను ప్రోత్సహించటం సరికాదు. అందుకే ‘గ్రేటర్’ ఎన్నికల్లో స్వచ్ఛ రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టాలి. అవినీతికి వ్యతిరేకంగా ‘వన్ హైదరాబాద్’ కూటమితో లోక్సత్తా, వామపక్షాలు ప్రత్యామ్నాయ ఫ్రంట్గా పోటీ చేస్తున్నాయి’’ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో తమ్మినేని ప్రసంగించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో బూర్జువా పార్టీల అజెండా అంతా ఒక్కటిగా మారిందని, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో.. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అవే చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. ఇంకో పార్టీలో మంత్రిగా పనిచేస్తున్నారని.. ఈ భ్రష్టు విధానాలను రాజకీయ వ్యభిచారం అనకుండా ఏమనగలమని ప్రశ్నించారు. దీనికి ప్రత్యామ్నాయం చూపటమనేది.. నిజమైన రాజకీ యవాదులపై ఉన్న బాధ్యత అని చెప్పారు. వామపక్షాలకు ప్రత్యామ్నాయ విధానాలు ఉండటం వల్ల అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన లోక్సత్తాతో కలసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు స్వచ్ఛ రాజకీయాలవైపు మళ్లాలని ఈ సందర్భంగా తమ్మినేని పిలుపునిచ్చారు. వన్ హైదరాబాద్ కూటమి 90 స్థానాల్లో పోటీ చేస్తోందని, మిగతా 60 స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. ఈ కూటమికి మేయ ర్ పీఠం దక్కక పోయినా.. ఎక్కువ స్థానాలను సాధించటానికి కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోందని, టీడీపీ-బీజేపీ కూటమికి ఆ సత్తా లేదని తమ్మినేని విమర్శించారు. సెటిలర్లపై స్థిరత్వం లేదు... సెటిలర్లపై టీఆర్ఎస్కు స్థిరత్వం లేదని తమ్మినేని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు సెటిలర్లపై ఎప్పుడేం మాట్లాడతారో.. వారికే తెలియదన్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల జీతాల పెంపు కోసం తాము ఉద్యమిస్తే.. ఆంధ్ర కుక్కలని సీఎం కేసీఆర్ నిందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీని వెయ్యి నాగళ్లతో దున్నుతానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఆయన కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై నోటుకు ఓటుకు సంబంధించి ఎన్నో విమర్శలు చేసిన కేసీఆర్ అమరావతి సభలో ఆయన గురించి గొప్పలు చెప్పారని దుయ్యపట్టారు. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు కాదు.. ప్రజాసేవ.. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు, రోడ్లు, కులానికో భవనం, ఎతైన భవనాలు కట్టటం కాదని, సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వాస్తవమైన అభివృద్ధిని చూపాల్సిన అవసరం ఉందని తమ్మినేని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్నికల వరకు మాత్రమే పరిమితమన్నారు. టీడీపీ-బీజేపీ కూటమి నగరాన్నిగానీ, తెలంగాణనుగానీ అభివృద్ధి చేస్తుందం టే.. అది భ్రమే అవుతుందని తమ్మినేని ఎద్దేవా చేశారు. బీజేపీ మతతత్వ పోకడలు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్పై ఇంకా భ్రమలున్నాయి టీఆర్ఎస్పై ప్రజల్లో ఇంకా భ్రమలున్నాయని తమ్మినేని అభిప్రాయపడ్డారు. సెంటిమెంట్ అభిమానం కొనసాగుతోందని, ఈ సానుకూలతతో పాలనా వైఫల్యాలను సరి చేసుకుంటే మంచిదన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కారణంగానే ప్రజలు తమ వైపు ఉన్నారని టీఆర్ఎస్ భావిస్తే పప్పులో కాలేసినట్టే అని చెప్పారు. ఈ కార్యక్రమం లో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు సోమ య్య, బసవపున్నయ్య, పద్మరాజు, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, సీపీఎం నేతలు డీజీ నర్సింహారావు, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.