breaking news
ongole corporation
-
కొత్త బాదుడు!
► నూతన మద్యం విధానంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార ధోరణి ► రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో భారీ వడ్డన ► ఏటా అదనపు ఆదాయం ఆర్జనకు పథక రచన ► బెంబేలెత్తుతున్న దరఖాస్తుదారులు ఒంగోలు క్రైం: నూతన మద్యం విధానం దరఖాస్తుదారులకు బుగ్గగిల్లి జోల పాడినట్లుగా మారింది. ఒక పక్క మద్యం షాపుల లైసెన్స్ ఫీజులను తగ్గిస్తున్నామని చెబుతూనే భారీ వడ్డనకు రాష్ట్ర ప్రభుత్వం పథక రచన చేసింది. మద్యం విధానంలో వ్యాపార ధోరణినే అవలంభించినట్లయింది. ముందుగా మద్యం షాపుల లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించినట్లు చూపించి, ఇతరత్రా ఫీజుల మోతతో బెంబేలెత్తించే పనిలో పడింది. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మద్యం దుకాణానికి దరఖాస్తు చేసి లాటరీ విధానం కోసం గేటుదాటి లోపలకు వెళ్లాలంటే అక్షరాలా రూ.లక్ష కట్టాల్సిందే. నగరం పరిధిలో 30 షాపుల కోసం టెండర్లో పాల్గొనాలంటే రూ.30 లక్షలు సాధారణంగా వస్తాయి. ఒక్కో దుకాణానికి పది చొప్పున దరఖాస్తులు వస్తే 300 దరఖాస్తులు అన్నమాట. అంటే టెండర్ల దశలోనే రూ.3 కోట్లు ప్రభుత్వానికి అదనంగా వస్తున్నట్లు. మున్సిపాలిటీల పరిధిలో రూ.75 వేలు చెల్లించాలి. ఇక నగర పంచాయతీలు, మండలాల్లోని షాపులకు రూ.50 వేలు. ఈ విధంగా లెక్కిస్తూ పోతే గత ఏడాదికంటే మూడు, నాలుగు రెట్లు అధికంగా ఆదాయాన్ని ఒక్క రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారానే ప్రభుత్వం సమకూర్చుకోనుంది. 2015–17 మద్యం విధానంలో 11 వేల దరఖాస్తులు వస్తే దరఖాస్తు ఫీజు ద్వారా రూ.40 కోట్లు అదనపు ఆదాయం సమకూరింది. ఇప్పుడు రెండేళ్లకు కాకుండా ఏటా రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో గతంలో కంటే మూడు, నాలుగురెట్లు దరఖాస్తుదారుల నుంచి గుంజనున్నారు. పర్మిట్ రూమ్లు తప్పనిసరి...: గతంలో మద్యం విధానం ప్రారంభించినప్పుడు మాత్రమే దరఖాస్తు ఫీజు కట్టించుకునే వారు. ఆ తర్వాత రెండేళ్లపాటు మద్యం షాపు కొనసాగేది. ప్రస్తుతం కూడా రెండేళ్లపాటు మద్యం విధానం అమలు చేస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిందే. దీంతో పాటు మద్యం షాపులకు పర్మిట్ రూము తప్పనిసరి చేశారు. ప్రతి షాపు ఏడాదికి రూ.2 లక్షల చొప్పున చెల్లించాల్సిందే. జిల్లాలో 331 షాపులకు ఏడాదికి అదనంగా రూ.6.62 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ అదనపు బాదుడుతో ఏడాదికి రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేర రిజిస్ట్రేషన్ ఫీజులు, పర్మిట్ రూము ద్వారానే రాబట్టే విధంగా నూతన మద్యం విధానాన్ని రూపొందించారు. ఇక మద్యం విక్రయాలు సరేసరి. జిల్లాలో ప్రతినెలా రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. అంటే ఏడాదికి జిల్లాలో రూ.1,100 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల మద్యం విక్రయాలు సర్వసాధారణం.. -
క్రమబద్ధీకరణతో ఆదాయం రూ.10 కోట్లపైనే
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ర్ట ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మున్సిపాల్టీలు, పట్టణ ప్రాంతాల్లోని అనధికారిక భవనాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని మున్సిపాలిటీలు, ఒంగోలు కార్పొరేషన్కు మొత్తం మీద పది కోట్ల రూపాయలకుపైగానే ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఒక్క ఒంగోలు కార్పొరేషన్కే 5.9 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 2008లో బీపీఎస్కు అనుమతి ఇచ్చినపుడు మొత్తం 1041 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 894 మందికి క్రమబద్ధీకరణకాగా మిగిలిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తిపన్ను పెంచేశారు. ఇప్పుడు వీరు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. లేఅవుట్లు కూడా 15 వరకూ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లేఅవుట్ వేసిన వారు అమ్మేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కొనుక్కున్న వారు కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అంచనాకన్నా ఎక్కువ ఆదాయమే వస్తుందని భావిస్తున్నారు. మార్కాపురం పురపాలక సంఘంలో మొత్తం 324 మంది గతంలో తమ భవనాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 62మంది తమక్రమబద్ధీకరించుకున్నారు. మిగిలిన 262 మంది దరఖాస్తులను తిరస్కరించారు. పురపాలక సంఘానికి రూ.36.82 లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మళ్లీ అవకాశం వస్తే కోటి రూపాయలకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. చీరాలలో 2008 సంవత్సరం వరకూ 914 భవనాలు క్రమబద్ధీకరించుకోగా కోటీ 90 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఇప్పుడు 166 భవనాలు లైన్లో ఉన్నాయని సుమారు రూ.60 లక్షలు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కందుకూరులో 125 వరకూ ఉండగా రూ.40 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. కొత్తగా నగర పంచాయితీలుగా ఏర్పడిన అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, సింగరాయకొండల్లో కూడా కాసుల వర్షం కురిస్తుంది. దీనివల్ల వీటికి కూడా అర్ధికంగా వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. 2014 డిసెంబర్ 31నాటికి కార్పొరేషన్ వద్దరిజిస్టరైన భవనాలకే ఈ పథకం వర్తిస్తుంది. మొత్తానికి ఈ పథకం పునరుద్ధరణతో రియల్టర్ల వల్ల మోసపోయిన సామాన్య ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అపార్టుమెంట్లలో ప్లాట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటన్నింటినీ క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. అనధికారిక లే అవుట్లలో నిర్మించిన భవనాలకు ఈ పథకం వర్తించదు. -
డబ్బు కొట్టు.. పట్టా పట్టు!
‘ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల పట్టా కావాలా?... దాందేముందీ!... జస్ట్ రూ. 25 వేలు కొట్టండి. పట్టా పుచ్చుకోండి. అధికారి మామూళ్లు దీనికి అదనం సుమండీ!’ఇదండీ.. ప్రస్తుతం ఒంగోలులో అధికార పార్టీ ఛోటా నేతలు దర్జాగా సాగిస్తున్న భూదందా. వీరు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వర్గీయులు కావడంతో ఓ రెవెన్యూ అధికారి భూదందాకు తనవంతు సహకారం అందిస్తున్నారు. పనిలో పనిగా తన జేబు కూడా నింపుకుంటున్నారు. ఈ కథ కమామిషు ఇదిగో ఇలా ఉంది... ఆ నలుగురి చిలక్కొట్టుడు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పేదలకు కేటాయించిన భూమిని ఎంపీ మాగుంట వర్గం చిలక్కొట్టుడు కొడుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 4,200 మంది పేదలకు 74 ఎకరాలు కేటాయించిన విషయం విదితమే. ఆ పేదల పట్టాలను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేసి ఎంపీ మాగుంట వర్గం తమవారికి కేటాయించేందుకు చేస్తున్న యత్నాలను ‘సాక్షి’ కొన్ని రోజుల క్రితం వెలుగులోకి తెచ్చింది. ఈ భూబాగోతంలో ఎంపీ మాగుంట వర్గం అక్రమాల పర్వం కొనసాగుతునే ఉంది. టోకుగా కాకుండా చిల్లరగా ఆ ఇళ్ల పట్టాలకు బేరం పెట్టింది. ఎంపీ మాగుంట వర్గంలో క్రియాశీలంగా వ్యవహరించే నలుగురు ఛోటా నేతలు ఈ భూబాగోతానికి సూత్రధారులు కాగా ఓ ఉన్నతాధికారి పాత్రధారిగా మారారు. ఆ నేతలు ముందుగానే కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ద్వారా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేయించి సరే అనిపించారు. ఆ తరువాత పట్టా నంబర్ల వారీగా ఇళ్ల స్థలాలకు బేరం పెట్టారు. ముందుగా 500 ఇళ్ల స్థలాలను ఎంపిక చేసుకుని బేరం పెట్టారు. ఒక ఇంటి స్థలం ఇప్పించేందుకు రూ. 25 వేలు వసూలు చేస్తున్నారు. ఆ విధంగా 400 ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే వసూళ్లు పూర్తి చేసేశారు. ఆ లెక్కన వారు ఇప్పటికే రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 100 ఇళ్ల స్థలాలకు కూడా వసూళ్లు పూర్తిచేసేసి పట్టాలు ఇప్పించాలన్నది వారి లక్ష్యం. ఇలా తమకు డబ్బులు ముట్టజెప్పినవారిని ఆ స్థలాల్లో పాకలు కూడా వేసుకోవచ్చని ఎంపీ మాగుంట అనుచరులు భరోసా ఇచ్చేస్తున్నారు. తమ లక్ష్యం మేరకు 500 ఇళ్ల స్థలాలను తమ పరం చేసుకున్న తరువాత రెండో విడతగా మరో 500 ఇళ్లస్థలాలకు గురిపెట్టాలన్నది ఆ నలుగురి వ్యూహం. ఎంపీ మాగుంట వర్గీయులు కావడం.. ఉన్నతాధికారి పూర్తిగా సహకరిస్తుండటంతో ఆ నలుగురి భూ దందా మూడు పట్టాలు ఆరు కబ్జాలుగా సాగిపోతోంది. రాజముద్రకూ ఓ రేటు మీ పని బాగానే ఉంది.. మారి నాకేంటంటా అని అడుగుతున్నారు ఓ అధికారి. ఎందుకంటే నిబంధనలను తుంగలో తొక్కుతూ.. కోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ సాగిస్తున్న ఈ భూదందాకు రాజముద్ర వేయాల్సింది ఆయనే మరి. అందుకే ఎంపీ మాగుంట వర్గీయులు ముందుగానే ఓ షరతు విధిస్తున్నారు. పట్టాలు చేతికి రావాలంటే ఆ అధికారినీ సంతృప్తిపరచాలని చెబుతున్నారు. ఇంకేముందీ... ఇదే అదనుగా ఆ అధికారి ఒక్కో పట్టాకు రూ. 10 వేలు చొప్పున గుంజుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఆయన కూడా ఇంతవరకూ దాదాపు రూ. 40 లక్షల వరకు గుంజుకున్నట్లు లెక్క తేలుతోంది. ఇంతగా జేబులు నిండుతుండటంతో ఆయన ఏకంగా ఎవర్నీ లెక్కచేయకుండా ఇష్టానుసారం పట్టాల జారీకి తెగించేస్తున్నారు. తమకు కేటయించిన పట్టాలను రద్దు చేయడంపై అర్హులైన లబ్ధిదారులు ఆయన్ని కలసి విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన వారి ఆవేదనను ఖాతరే చేయలేదు. పైగా ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని తేల్చిచెప్పేశారు. దాంతో అటు ఎంపీ మాగుంట వర్గీయులకు ఇటు ఉన్నతాధికారికి ఈ భూబాగోతం కాసులు కురుపిస్తోంది. వారిలో గుబులు.. వీరిలో దిగులు ఎంపీ మాగుంట వర్గీయులు, అధికారికి డబ్బులు ముట్టజెప్పిన వారిలో ప్రస్తుతం గుబులు మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా తమ పట్టాలు రద్దు చేయడంతో అర్హులైన లబ్ధిదారులు న్యాయపోరాటానికి సిద్ధపడ్డారు. దీంతో ప్రస్తుతం ఎంపీ వర్గీయులకు డబ్బులు సమర్పించుకున్నవారు పునరాలోచనలోపడ్డారు. ఎందుకంటే ఆ ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా వారి పరం కాలేదు. కానీ ఇప్పటికే డబ్బులు ముట్టజెప్పి చేతి చమురు వదిలించుకున్నారు. దీంతో వారంతా ఇటీవల ఎంపీ మాగుంట అనుచరులను నిలదీశారు. పట్టాలు అయినా ఇప్పించండి.. లేకపోతే తమ డబ్బులు అయినా వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారు. దీంతో మాగుంట వర్గీయులు కొన్ని రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకుండా తప్పించుకుంటున్నారు. మరో 500 ఇళ్ల స్థలాలకు గురిపెడితే అసలుకే మోసం వచ్చిందేమోనని వారు గుబులు చెందుతున్నారు.