Oil refinery unit
-
కువైట్లో ప్రధాన చమురు కేంద్రంపై... ఇరాన్ డ్రోన్ దాడులు
ఇజ్రాయెల్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ భారీగా దాడులు కొనసాగించింది. కువైట్లో మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్లో ఒక నీటి శుద్ధి కేంద్రంపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. దానికి భారీ నష్టమే వాటిల్లినట్టు సమాచారం. బహ్రెయిన్లోనూ నిర్విరామంగా సైరన్లు మోతలు విన్పించాయి. పలు డ్రోన్లను అడ్డుకుని నేలకూల్చినట్టు సౌదీ అరేబియా పేర్కొంది. యూఏఈలో కూడా ఒక చమురు క్షేత్రానికి మంటలు అంటుకున్నాయి. దాంతో దాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధ నౌకపైనా దాడులు! అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహంలింకన్ యుద్ధ నౌకపైనా భారీగా దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. సౌదీలోని పాటు అలీ అల్ సలేం డ్రోన్ స్థావరంపై కూడా బాంబుల వర్షం కురిపించినట్టు పేర్కొంది. అమెరికా తమ విద్యుత్కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే యూఏఈలో అమెరికాకు చెందిన కీలకమైన స్టార్గేట్ ఏఐ సెంటర్ను నేలమట్టం చేసేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్లో అమెజాన్, ఒరాకిల్ వంటి పలు టెక్ దిగ్గజ కంపెనీల కార్యాలయాలపై ఇరాన్ ఇప్పటికే దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లో రాపిడ్ సెంట్రీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. -
నాగార్జున ఆయిల్ సింగపూర్ కంపెనీ వశం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమిళనాడులోని నాగార్జున ఆయిల్ కార్పొరేషన్కు (ఎన్వోసీఎల్) చెందిన ఆయిల్ రిఫైనరీ యూనిట్లోని 46.78 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సింగపూర్ కంపెనీ ముందుకొచ్చింది. నాగార్జున ఆయిల్ రిఫైనరీ పేరుతో రూ. 25,000 కోట్లతో కడలూరులో ఎన్వోసీఎల్ రిఫైనరీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఇందులోని పూర్తి వాటాను సింగపూర్కు చెందిన నెట్ఆయిల్ కంపెనీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఎన్వోసీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. కంపెనీ విలువను ఇంకా లెక్కించాల్సి ఉంది. 12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ నిధుల కొరతతో సతమతమవుతోంది. ఈ కొనుగోలు పూర్తయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎన్వోసీఎల్కి పెద్ద ఊరట లభించినట్లే.


