breaking news
ntt
-
ఏఐ వ్యూహంలో భారత్ కీలకం
టోక్యో: గ్లోబల్ ఐటీ సేవల దిగ్గజం ఎన్టీటీ తమ కృత్రిమ మేథ (ఏఐ) వ్యూహాలకు సంబంధించి భారత్ అత్యంత కీలక మార్కెట్గా నిలుస్తోందని వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇండియేఏఐ మిషన్ మొదలైనవి ఇందుకు దన్నుగా ఉంటున్నాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ వపర్మ్యాన్ తెలిపారు. దేశీయంగా డేటా సెంటర్ విభాగంలో తమకు 30 శాతం మార్కెట్ వాటా ఉందని, సమీప భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ నిపుణులకు భారత్ మాకు హబ్గా నిలుస్తోంది. అలాగే ఇక్కడి డెలివరీ సెంటర్కి మా ఆసియా పసిఫిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుబంధంగా పని చేస్తోంది. భారత్లో ప్రతిభావంతులైన యువత లభ్యత ఎక్కువగా ఉంటుంది. వారికి శిక్షణనివ్వడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం‘ అని జాన్ తెలిపారు. దేశీయంగా బీసీజీ, యాక్సెంచర్, డెలాయిట్లాంటి సంస్థలు తమకు ప్రధాన పోటీదార్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో డేటా సెంటర్లతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలాంటి ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు జాన్ చెప్పారు. కేవలం డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలనే కాకుండా ఏఐ, కన్సల్టింగ్ సామర్థ్యాలను కూడా పటిష్టం చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా రంగాలతో పాటు కన్సలి్టంగ్ మొదలైన విభాగాలపైనా ఇన్వెస్ట్ చేశామని జాన్ వివరించారు. నవంబర్ 19 నుంచి 26 మధ్యన టోక్యోలో నిర్వహించిన ఎన్టీటీ ఆర్అండ్డీ ఫోరమ్లో ఎన్టీటీ గ్రూప్ కంపెనీలు 100కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సెక్యూరిటీ, మొబిలిటీ తదితర విభాగాలకు చెందిన సొల్యూషన్స్ వీటిలో ఉన్నాయి. -
రెట్టింపు ఆదాయంపై ఎన్టీటీ ఇండియా దృష్టి
ముంబై: జపాన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎన్టీటీ గ్రూప్ భారత్లో తమ స్టోరేజీ సామర్థ్యాన్ని, కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. వచ్చే రెండేళ్లలో ఈ లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నట్లు ఎన్టీటీ డేటా ఇండియా ఎండీ అభిజిత్ దూబే తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో దేశీయంగా 2.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. మరిన్ని డేటా సెంటర్లు, హరిత శక్తి, సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ సదుపాయాలు మొదలైన వాటిపై ఈ నిధులను వెచ్చించనున్నట్లు దూబే తెలిపారు. 2018లో ప్రకటించిన 2 బిలియన్ డాలర్లకు అదనంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఆయన వివరించారు. జపాన్ వెలుపల తమకు ఇదే అతి పెద్ద మార్కెట్ అని దూబే తెలిపారు. వివిధ దేశాల్లో తమకు మొత్తం 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా .. భారత్లో ఏకంగా 37,000 మంది పైగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ గ్రూప్ ఆదాయం 20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. భారత విభాగం వాటా 700 మిలియన్ డాలర్లుగా ఉందని దూబే చెప్పారు. రాబోయే రెండేళ్లలో దీన్ని రెట్టింపు చేసుకుని సుమారు 2 బిలియన్ డాలర్లకు పెంచుకోగలమని ఆయన ధీమా వ్య క్తం చేశారు. నెట్మ్యాజిక్ సంస్థ కొనుగోలు ద్వారా ఎన్టీటీ గ్రూప్.. భారత మార్కెట్లో ప్రవేశించింది. -
జాతీయ పన్ను ట్రిబ్యునల్ చట్టం రాజ్యాంగ విరుద్ధం
చట్టాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు న్యూఢిల్లీ: పన్నుల వ్యవహారాల కేసులను నిర్ణయించేందుకు జాతీయ పన్ను ట్రిబ్యునల్ (ఎన్టీటీ)ను ఏర్పాటు చేస్తూ 2005లో పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని సుప్రీంకోర్టు గురువారం రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ తీర్పుచెప్పింది. ఎన్టీటీ ఏర్పాటు ఉన్నత న్యాయస్థానాల అధికార పరిధిలోకి చొరబడేలా ఉందని చీఫ్ జస్టిస్ ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఈ ట్రిబ్యునల్ రాజ్యాంగబద్ధతను సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ తీర్పు వెలువరించింది. చట్టానికి సంబంధించి తలెత్తే ప్రశ్నలను కేవలం హైకోర్టులు, సుప్రీంకోర్టే నిర్ణయించగలవని స్పష్టం చేసిన ధర్మాసనం ఆ అధికారాన్ని ట్రిబ్యునల్కు కట్టబెడుతూ పార్లమెంటు చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదిగా పేర్కొంది. ఇటువంటి ట్రిబ్యునళ్లు న్యాయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా పనిచేసే ప్రమాదం పొంచి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకవేళ హైకోర్టుల అధికార పరిధిని ఎన్టీటీకి బదిలీచేస్తే ట్రిబ్యునల్ చైర్పర్సన్, సభ్యుల హోదా కూడా హైకోర్టు జడ్జీలను పోలి ఉండాలని పేర్కొంది. ఈ ట్రిబ్యునల్ ఏర్పాటును సవాల్చేస్తూ మద్రాస్ బార్ అసోసియేషన్ 2006లో తొలిసారి పిటిషన్ దాఖలు చేసింది.


