పన్నుల వ్యవహారాల కేసులను నిర్ణయించేందుకు జాతీయ పన్ను ట్రిబ్యునల్ (ఎన్టీటీ)ను ఏర్పాటు చేస్తూ 2005లో పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని సుప్రీంకోర్టు గురువారం రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ తీర్పుచెప్పింది.
చట్టాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: పన్నుల వ్యవహారాల కేసులను నిర్ణయించేందుకు జాతీయ పన్ను ట్రిబ్యునల్ (ఎన్టీటీ)ను ఏర్పాటు చేస్తూ 2005లో పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని సుప్రీంకోర్టు గురువారం రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ తీర్పుచెప్పింది. ఎన్టీటీ ఏర్పాటు ఉన్నత న్యాయస్థానాల అధికార పరిధిలోకి చొరబడేలా ఉందని చీఫ్ జస్టిస్ ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఈ ట్రిబ్యునల్ రాజ్యాంగబద్ధతను సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ తీర్పు వెలువరించింది.
చట్టానికి సంబంధించి తలెత్తే ప్రశ్నలను కేవలం హైకోర్టులు, సుప్రీంకోర్టే నిర్ణయించగలవని స్పష్టం చేసిన ధర్మాసనం ఆ అధికారాన్ని ట్రిబ్యునల్కు కట్టబెడుతూ పార్లమెంటు చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదిగా పేర్కొంది. ఇటువంటి ట్రిబ్యునళ్లు న్యాయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా పనిచేసే ప్రమాదం పొంచి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకవేళ హైకోర్టుల అధికార పరిధిని ఎన్టీటీకి బదిలీచేస్తే ట్రిబ్యునల్ చైర్పర్సన్, సభ్యుల హోదా కూడా హైకోర్టు జడ్జీలను పోలి ఉండాలని పేర్కొంది. ఈ ట్రిబ్యునల్ ఏర్పాటును సవాల్చేస్తూ మద్రాస్ బార్ అసోసియేషన్ 2006లో తొలిసారి పిటిషన్ దాఖలు చేసింది.