breaking news
Nithari killer
-
నిఠారీ కేసులో బాధితులకే శిక్ష!
ఇరవై ఏళ్ల నాటి నిఠారీ వరుస హత్యల కేసులో నిర్దోషి త్వాల తీర్పు భారత నేర దర్యాప్తు వ్యవస్థలోని వైఫల్యాలను బట్టబయలు చేసింది. 16 మంది మహిళలు, పిల్లల హత్య కేసులో నిందితుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 11న చెప్పిన తీర్పుతో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే!యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ నోయిడా(ఉత్తరప్రదేశ్)లోని నిఠారీ గ్రామంలో డ్రైనేజీలో మానవ అవశేషాలు బయటపడి దాదాపు ఇరవై ఏళ్లు గడచిన తర్వాత కూడా, ఏ ఒక్కరూ దోషిగా నిర్ధారణ కాలేదు. 16 మంది మహిళలు, పిల్లల ‘నిఠారీ’ హత్య కేసులో నింది తుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ‘నేర న్యాయ’ వ్యవస్థలోని దారుణ వైఫల్యాలను బట్టబయలు చేసింది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే.కీలక ఆధారాలు లేకపోవడం వల్లే... 2006 చివర్లో నిఠారీ గ్రామ సమీపాన 31వ సెక్టార్లో మురుగు కాల్వల పూడిక తీస్తుంటే దిగ్భ్రాంతికరమైన దారుణాలు వెలుగు చూశాయి. అంతకంటే ముందు, డి–5, డి–6 ఇళ్ల మధ్య ఒక చెయ్యి కనబడింది. క్రికెట్ ఆడుతున్న కుర్రాడు దాన్ని చూశాడు. అదే ఏడాది డిసెంబర్లో ఈ బంగ్లాల వెలుపల ఉన్న డ్రెయిన్లో మట్టి తొలగించడంతో అక్కడ అనేక పుర్రెలు, ఎముకలు, పీలికలైన పిల్లల దుస్తులు, చిన్ని చిన్ని చెప్పులు దొరికాయి.డి–5 ఇంట్లో పనిచేసే సురేంద్ర కోలీ అనే వ్యక్తి, ఇంటి యజమాని, వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పంఢేర్ ఈ మారణకాండకు బాధ్యులని పోలీసులు అనుమానించారు. పోలీసుల కథనం ప్రకారం – పిల్లలను, ఆడవారిని కోలీ ప్రలోభపెట్టి ఇంటికి రప్పించే వాడు. తర్వాత వారిని హత్య చేసేవాడు. కొన్నిసార్లు హతుల శరీర భాగాలను తిన్నాడు కూడా! ఈ అకృత్యాల్లో పంఢేర్ భాగస్వామి. భయానకమైన ఈ హత్యల కేసులో స్థానిక పోలీసుల విచారణ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ దర్యాప్తులో భాగంగా ఇంటి మేడ పై భాగంలో నీళ్ల ట్యాంకు కింద దాచిన ఓ కత్తిని పోలీసులు ‘స్వాధీనం’ చేసుకున్నారు.ఇది, ఇంకా అనేక వస్తువులు వారికి దొరికాయి. ఇవే వారి దర్యాప్తులో ‘కీలక ఆధారాలు’. వీటి ఆధారంగా వారు రూపొందించిన కథనాలను కోర్టులు విశ్వసించలేదు. దీంతో 2007 జనవరిలో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు. సీబీఐ సైతం స్థానిక పోలీసులు చేసిన తప్పిదాలనే పునరా వృతం చేసింది. కొన్ని వారాల తరబడి కస్టడీలో ఉంచి రికార్డు చేసిన కోలీ నేరాంగీకార పత్రం మీదే సీబీఐ అధికారులు ఆధారపడ్డారు. వారు రికవర్ చేసిన ఆధారాలు నమ్మదగినవిగా లేవు. కోలీ, పంఢేర్ ప్రమేయాన్ని నిరూపించగల సరైన ఫోరెన్సిక్ లింకులను కూడా సంపాదించలేక పోయారు.స్థానిక పోలీసుల మీద ఆధారపడకుండా మళ్లీ మొదటి నుంచి సొంత దర్వాప్తు చేయడంలో సీబీఐ విఫలమైంది. నేరాంగీకారాలు, రికవరీలు, ఆధారాలను అటూయిటూ చేసి... మోపిన 13 కేసుల్లోనూ వాటినే కోర్టుల ముందుంచారు. కాబట్టే, పై కోర్టులు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి వాటన్నిటినీ కొట్టేశాయి. నేరాంగీకార పత్రాలు, నేరాలకు సంబంధించిన రికవ రీలు అన్నీ అంతకు ముందు కొట్టేసిన ఇతర కేసుల్లో ఉన్నట్లే ఏ మాత్రం తేడా లేకుండా ఈ కేసులోనూ ఉన్నాయని సుప్రీంకోర్టు తాజాగా నవంబర్ 11 నాటి తీర్పులో గుర్తించింది.మరి నేరస్థులు ఎవరు?తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రుల విషయానికి వస్తే, వారి పాత గాయాలు ఈ తీర్పుతో మళ్లీ రేగాయి. 2005లో తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది ఈ బాధితులే! డి–5 ఇంటి ముందు తొలుతగా నిరసన చేసింది వీరే. న్యాయస్థానంలో చివరి దాకా పోరా డింది కూడా వీరే. చివరకు కోర్టు తీర్పుతో తమ పిల్లలను ఎవరూ చంపలేదన్న ‘న్యాయపరమైన వాస్తవం’ వారిని వెక్కిరిస్తోంది. ఏళ్ల తరబడి సుదీర్ఘంగా దర్యాప్తు జరిగినప్పటికీ, నిజమైన ద్రోహులెవరో నిరూపణ కాకపోవడం పట్ల న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసి వారి బాధను గుర్తించింది. నిర్లక్ష్యం వహించి, అసాధారణ జాప్యం చేసి నిజనిర్ధారణ ప్రక్రియ పట్ల విశ్వాసం సన్న గిల్లేలా చేశాయంటూ దర్యాప్తు సంస్థలను తప్పు పట్టింది. అవయ వాలతో వ్యాపారం చేసే ముఠాల ప్రమేయం వంటి కొత్త కోణాల నుంచి దర్యాప్తు చేపట్టలేక పోయాయని నిందించింది.నిఠారీ కేసు నిర్దోషిత్వాల తీర్పులు భారత నేర దర్యాప్తు వ్యవస్థకు సోకిన రోగం లక్షణాలను కళ్లకు కట్టాయి. ప్రతి స్థాయి లోనూ వ్యవస్థ విఫలమైంది. స్థానిక పోలీసులు క్రైమ్ సీన్ను పరిరక్షించలేకపోయారు. సరైన ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించలేక పోయారు. ఈ లోపాలను చక్కదిద్దడంలో సీబీఐ విఫలమైంది. కొత్త కోణాలను గుర్తించలేక పోయింది. న్యాయ పరీక్షకు నిలబడేలా పకడ్బందీ వాదనలు చేయడంలో ప్రాసిక్యూటర్లు విఫలమయ్యారు. బాధితుల ఘోర విషాదాన్ని వ్యవస్థల ప్రహసనంగా మార్చి, ప్రభుత్వం వారికి తీవ్రమైన నిరాశ కలిగించింది.సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కోలీ జైలు నుంచి బయటకు వచ్చాడు. పంఢేర్ ఇప్పటికే నేర విముక్తుడు. న్యాయస్థానం చట్టాలకు లోబడి వ్యవహరించింది. తిరుగులేని రుజువులు ఉంటే తప్ప కోర్టు శిక్ష విధించలేదు. తమ పిల్లల మసకబారిన పాత ఫొటోలను పట్టు కుని ఆ తల్లిదండ్రులు క్షోభపడుతూ ఉంటే, న్యాయం అమూర్తంగా మారిపోయింది. నిఠారీలో చట్టం తన చివరి మాటను చెప్పేసింది. ఇక మిగిలింది నిశ్శబ్దమే! అది చెవులు పగిలిపోయేంత కఠోరంగా ఉంది.-ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త లీగల్ అంశాల జర్నలిస్ట్(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
నిఠారి హంతకులెవరు?
కనీవినీ ఎరుగని ఘోరం జరుగుతుంది. పత్రికల్లో పతాక శీర్షికవుతుంది. చానెళ్లలో ప్రధాన చర్చ నీయాంశంగా మారుతుంది. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. కారకులను ఉరికంబం ఎక్కించాలంటూ జనం డిమాండ్ చేస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్కౌంటర్ చేయాలని గొంతెత్తుతారు. తీరా కాలం గడిచాక, న్యాయస్థానాల్లో విచారణలు వాయిదాల్లో సాగాక నిందితులు నిర్దోషులుగా విడుదలవుతారు. అన్ని కేసుల్లోనూ కాకపోవచ్చుగానీ, కొన్నింటి విషయంలో ఇలాగే జరుగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం దక్కలేదని ఆక్రోశించాలో, అమాయకులకు విముక్తి లభించిందని భావించాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది. మరి దోషులెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. సరిగ్గా పదిహేడేళ్ల క్రితం పెనుసంచలనం సృష్టించిన ‘నిఠారీ హత్యల’ కేసుల్లో నిందితులుగా భావించిన సురేందర్ కోలీ, మోనిందర్ సింగ్ పంధేర్లు తాజాగా అలహాబాద్ హైకోర్టు తీర్పుతో నిర్దోషులుగా బయటపడటం బహుశా ఎవరూ ఊహించని ముగింపు. ఎందుకంటే 2005–06 మధ్య వారిద్దరూ చేశారని చెప్పిన నేరాల జాబితా చాలా పెద్దది. వారి చేతుల్లో ఏకంగా 18 మంది బాలికలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. ఒంటరిగా కనబడిన నిరుపేద బాలికలకూ, మహిళలకూ మాయమాటలు చెప్పి బంగ్లాలోకి తీసుకెళ్లటం, వారిని హతమార్చటం నేరగాళ్లు అనుసరించిన విధానం. హత్యల తర్వాత మృతదేహాలపై కోలీ, పంధేర్లు లైంగికదాడి జరిపే వారనీ, నరమాంస భక్షణ చేసేవారనీ వచ్చిన కథనాలు వెన్నులో వణుకు పుట్టించాయి. మృత దేహాలపై లైంగిక దాడి తర్వాత శరీర భాగాలను ఇంటి వెనకున్న కిటికీ నుంచి విసిరేసేవారని కూడా ఆ కథనాల సారాంశం. ఎప్పటికప్పుడు వీరందరి అదృశ్యంపైనా ఫిర్యాదులొచ్చినా పోలీసులు నిర్లక్ష్యం వహించటంవల్లే ఇన్ని హత్యలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. తీరా ఇన్నేళ్లు గడిచాక పోలీసులు సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయారనీ, వారి దర్యాప్తు ఆద్యంతం అస్తవ్యస్థంగా సాగిందనీ హైకోర్టు తేల్చింది. వీధిలో ఆడుకుంటున్న పిల్లలకు మురికి కాల్వలో పుర్రె భాగం దొరకటంతో ఈ కేసుల డొంక కదిలింది. ఆ తర్వాత 8 మంది పిల్లల ఎముకలు ఇంటి వెనుక దొరికాయి. నిందితులపై 2009లో బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్, సైకలాజికల్ అసెస్మెంట్స్ వంటి శాస్త్రీయ పరీక్షలు చేశారని వార్తలొచ్చాయి. ‘హఠాత్తుగా నాలో దయ్యం నిద్ర లేచేది. ఎవరినో ఒకరిని మట్టుబెట్టాలన్న వాంఛ పుట్టుకొచ్చేది’ అని కోలీ చెప్పినట్టు కూడా మీడియా కథనాలు తెలిపాయి. నిందితులిద్దరిపైనా 19 కేసులు నమోదుకాగా, వీటిని విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 12 కేసుల్లో కోలీని దోషిగా తేల్చి మరణశిక్ష విధించగా, రెండు కేసుల్లో పంధేర్ దోషిగా తేలాడు. అతనికి కూడా మరణశిక్ష పడింది. దోషులు అప్పీల్ చేసుకోగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఒక కేసులో మినహా అన్నింటి లోనూ కోలీ నిర్దోషిగా బయటపడ్డాడు. పంధేర్కు అన్ని కేసుల నుంచీ విముక్తి లభించింది. వీరిద్దరి పైనా బలమైన సాక్ష్యాధారాలూ లేవని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నోయిడా సెక్టార్లోని నిఠారి అప్పట్లో ఒక చిన్న గ్రామం. ఇప్పుడు పట్టణంగా మారింది. మన నేర న్యాయవ్యవస్థ మాత్రం ఎప్పట్లాగే లోపభూయిష్టంగా ఉంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు దాన్నే నిర్ధారించింది. మీడియాలో ప్రముఖంగా ప్రచారంలోకొచ్చి, ఆందోళనలు మిన్నంటే కేసుల్లో పోలీసు లపై వాటి ప్రభావం, ఒత్తిళ్లు అధికంగా వుంటాయనటంలో సందేహం లేదు.వాటిని సాకుగా చూపి ఆదరాబాదరాగా ఎవరో ఒకరిని నిందితులుగా తేల్చాలనుకోవటం సరికాదు. సాక్ష్యాధారాల సేక రణలో కూడా పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయారనీ, నిందితులపై థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించి తేల్చటానికే ఉత్సాహం ప్రదర్శించారనీ హైకోర్టు తప్పుబట్టిందంటే దర్యాప్తు ఎలా అఘోరించిందో అర్థం చేసుకోవచ్చు. చాన్నాళ్లక్రితం కేంద్ర ప్రభుత్వ కమిటీ మనుషుల అదృశ్యాల వెనక శరీర అవయవాల వ్యాపారం సాగించే సంఘటిత ముఠాల హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. నిఠారి హత్యల విషయంలో ఆ కోణంలో దర్యాప్తు సాగలేదు. థర్డ్ డిగ్రీ విధానాలను ఉపయోగించటం ద్వారా పోలీసులు కేసు తేల్చేశారన్న అభిప్రాయం జనంలో కలిగించవచ్చుగానీ, న్యాయస్థానాల్లో విచారణ సమయానికి ఇవన్నీ మటుమాయమవుతాయి. సంశయాతీతంగా సాక్ష్యా ధారాలుండకపోతే, మమ్మల్ని కొట్టి ఒప్పించారని నిందితులు చెబితే చివరికి కేసు వీగి పోతుంది. కేవలం ఒక వ్యక్తి లేదా ఇద్దరు ఇంతమందిని హతమార్చారనీ, మరెవరి ప్రమేయమూ ఇందులో లేదనీ నిర్ధారించాలంటే అందుకు దీటైన సాక్ష్యాధారాలుండాలి. అవి శాస్త్రీయంగా సేకరించాలి. ఎక్కడ అశ్రద్ధ చేసినా, ఏ చిన్న లోపం చోటుచేసుకున్నా మొత్తం కుప్పకూలిపోతుంది. దానికి తోడు ప్రతీకారంతో రగిలిపోతూ తక్షణ న్యాయం కావాలని రోడ్డెక్కే ధోరణులు మొత్తం దర్యాప్తును అస్తవ్యస్థం చేస్తున్నాయి. జనాన్ని సంతృప్తిపరచటం కోసం దొరికినవారిని నిందితులుగా తేల్చి పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. సుప్రీంకోర్టులో ఎటూ సీబీఐ అప్పీల్ చేస్తుంది. అక్కడే మవుతుందన్నది చూడాల్సివుంది. అత్యాధునిక ప్రమాణాలతో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. అంతరిక్షంలో ఘనవిజయాలు నమోదు చేస్తున్నాం. కానీ పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దటంలో, దానికి వృత్తిగత నైపుణ్యాలను అలవాటు చేయటంలో విఫలమవుతున్నాం. క్రిమినల్ కేసుల్లో సత్వర దర్యాప్తు, పకడ్బందీ సాక్ష్యాధారాల సేకరణ ప్రాణప్రదం. వాటిని విస్మరిస్తే కేసులు కుప్ప కూలు తాయి. నేరగాళ్లు తప్పించుకుంటారు. నిఠారి నేర్పుతున్న గుణపాఠాలివే. -
కిల్లర్ కోలీ మరణ శిక్షపై సుప్రీం కోర్టు స్టే
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారి వరుస హత్యల కేసు దోషి సురీందర్ కోలీకి తాత్కాలిక వూరట లభించింది. కోలీ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నోయిడాలోని 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్ను దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడింది. మీరట్ జైల్లో అతడిని 12వ తేదీన ఉరి తీసేందుకు రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే. కాగా కోలీ మరణ శిక్ష అమలుపై న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తూ వారం రోజుల పాటు స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో సురేందర్ కోలీకి వేసిన ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. ఉరిశిక్ష అమలుపై అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు పరిశీలించి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సిఫారసు మేరకు 42 ఏళ్ల సురిందర్ కోలి క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 27న తిరస్కరించారు.కాగా కోలిపై మరో 11 హత్యకేసులు పెండింగ్లో ఉన్నాయి. కోలీపై మొత్తం 16 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. 2006లో రింపా హాల్దర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో నోయిడా శివార్లలోని నిఠారి ప్రాం తంలో కోలీ పనిచేసే ఇంటిపక్కనున్న మురికి కాలువలో పలువురు చిన్నారుల అస్థిపంజరాల శిథిలాలు లభించాయి. కోలీకి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టు సమర్ధించాయి. -
సురేందర్ కోలీకి రేపే ఉరి?
మీరట్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిఠారీ’ కేసుల నిందితుడు సురేందర్ కోలీకి సోమవారం ఉదయం ఉరి తీసే అవకాశం ఉందని మీరట్ జైలు అధికారులు తెలిపారు. ఈ కేసులో కోలీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఉరిశిక్ష విధించాలని సీబీఐ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెప్టెంబర్ 4 తేదిన కోలీని గజియాబాద్ లోని దస్నా జైలు నుంచి మీరట్ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 7 తేది నుంచి 12 తేది లోపల ఏ రోజైనా ఉరితీసే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే కోలీ ఉరిపై అధికారుల నోరు మెదపనప్పటికి.. సోమవారం ఉదయం 5.30 నిమిషాలకు ఉరి తీసే అవకాశముందనే వార్తలు వెలువడుతున్నాయి. నైనీ సెంట్రల్ జైలు నుంచి ఉరితాడు.. కొక్కెం జైలు అధికారులకు అందాయని మీరట్ జైలు సూపరింటెండెంట్ ఎస్ఎమ్ రిజ్వీ తెలిపారు. -
నిఠారి కిల్లర్కు ఉరి
మీరట్: నిఠారి సీరియల్ కిల్లర్ సురిందర్ కోలిని ఈ నెల 12వ తేదీన ఉరి తీయనున్నారు. 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్ను పాశవికంగా హత్య చేసిన నేరానికి గానూ కోలీకి ఉరిశిక్ష విధించారు. శిక్ష విధించే సమయంలో మరో నాలుగు కేసులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని నియమ నిబందనల ప్రకారం ఉరిశిక్షను అమలు చేస్తామని మీరట్ జైలు సూపరింటెండెంట్ ఎస్హెచ్ రిజ్వీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సిఫారసు మేరకు 42 ఏళ్ల సురిందర్ కోలి క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 27న తిరస్కరించారు. కోలిపై మరో 11 హత్యకేసులు పెండింగ్లో ఉన్నాయి. కోలీపై మొత్తం 16 కేసుల్లో చార్జిషీట్లు దాఖల య్యాయి. 2006లో రింపా హాల్దర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో నోయిడా శివార్లలోని నిఠారి ప్రాం తంలో కోలీ పనిచేసే ఇంటిపక్కనున్న మురికి కాలువలో పలువురు చిన్నారుల అస్థిపంజరాల శిథిలాలు లభించాయి. కోలీకి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టు సమర్ధించాయి.


