breaking news
national wide strike
-
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోయిన డెలివరీలు
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: ఇయర్ ఎండ్నాడు.. కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. బుధవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో దేశరాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఈ ఉదయం నుంచి డెలివరీ సేవలు నిలిచిపోయాయి. జోమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.ఈ సమ్మెకు తెలంగాణ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ–ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల గిగ్ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో.. ఇవాళ భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంగా ఫుడ్, గ్రాసెసరీలపై అవి ఎక్కువగా ఉండే ఛాన్స్ఉంది. అయితే సమ్మె నేపథ్యంలో ఆ సేవలకు విఘాతం కలగనుంది. పుణె, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాతోపాటు టయర్–2 నగరాల్లో ముఖ్యంగా ఫుడ్ ఆర్డర్లు, గ్రోసరీ డెలివరీలపై ఎక్కువ ప్రభావ పడుతుందని అంటున్నారు. హైదరాబాద్లో ఐటీ కారిడార్ ఈ సమ్మె కారణంగా ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా కొందరు నెటిజన్లు సైతం gig workersకు మద్దతుగా నెట్టింట పోస్టులు పెడుతున్నారు.ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకూ తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ‘ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారెంటీ లేదు, భద్రతతోపాటు గౌరవం కూడా లేదు’అని గిగ్వర్కర్లు వాపోతున్నారు. బ్రేక్ లేకుండా పనిచేస్తున్న తమకు న్యాయమైన జీతంతో పాటు కమీషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా లాంటి సామాజిక భద్రతలతో పాటు.. 10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్ను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించకపోతే.. రాబోయే రోజుల్లో సమ్మెలు తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు.నిజానికి ఈ డిమాండ్లతో.. క్రిస్మస్ రోజునే దాదాపు 40వేల మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయగా.. దాదాపు 50 శాతం డెలివరీలు ఆగిపోయాయి. ఈసారి ఏకంగా లక్షా 50వేల మంది సమ్మెలో పాల్గొంటారని ఓ అంచనా. అదను చూసి గిగ్ వర్కర్లు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మెబాట పట్టినట్లు యూనియన్ల నిర్ణయంతో స్పష్టమవుతోంది.ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులు కానుంది. అలాగే.. సంవత్సరాంత ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్–మైల్ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.సమ్మెతో లాస్ ఎవరికి?.. గిగ్ వర్కర్ల సమ్మె.. అంటే డెలివరీ బాయ్స్ ఆగిపోవడంతో కస్టమర్లకు ఫుడ్, గ్రోసరీ సేవలు నిలిచిపోతాయి. ఈ–కామర్స్ ఆర్డర్లు ఆలస్యం అవుతాయి. లేదంటే రద్దు కూడా కావొచ్చు. తద్వారా లక్షల మందికి ఇయర్ ఎండ్ ప్రణాళికలు తలకిందులు అయ్యే అవకాశం ఉంది. సమ్మె ద్వారా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొదలైనవాటికి భారీగా ఆర్డర్లు నిలిచిపోవడం వల్ల ఆదాయం తగ్గిపోతోంది. రెస్టారెంట్లు, రిటైల్ వ్యాపారాలు దెబ్బ తినే అవకాశం ఉంది. రెస్టారెంట్లు, రిటైల్ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. చిన్న వ్యాపారాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. గిగ్ వర్కర్లు (డెలివరీ ఏజెంట్లు) తాత్కాలికంగా ఆదాయం ఆగిపోతుంది. అయితే.. దీర్ఘకాలంలో తమ డిమాండ్లు నెరవేరితే ఉద్యోగ భద్రత, జీతం, బీమా లాంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉండడంతో.. ఇవాళ వచ్చే అదనపు కమిషన్ల కన్నా సమ్మెకే వాళ్లు మొగ్గు చూపిస్తుండడం గమనార్హం. వినియోగదారుల అసంతృప్తి, కంపెనీల ఒత్తిడి, కార్మిక సంఘాల డిమాండ్లతో.. వెరసి ఈ సమ్మెలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాగైనా.. గిగ్ వర్కర్లను కార్మిక చట్టాల్లో చేర్చే పాలసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం అవుతోంది. -
కోల్కతా ఘటన: వైద్యుల సమ్మెకు మెడికవర్ హాస్సిటల్స్ మద్దతు
హైదరాబాద్, సాక్షి: కోల్కతా యువ వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ పిలుపుతో ఒక్కరోజు సమ్మెను పాటించారు. ఈ క్రమంలో సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించింది మెడికవర్ హాస్పిటల్స్. ఐఎంఏ సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ అధినేత , చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయింది . యావత్ భారతావని దిగ్భాంతికి లోనైంది. ఈ సంఘటన అందరిని కలిచివేసింది అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి’’ అన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశమంతా ఇవాళ ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నది. ఈ సంఘటన అత్యంత బాధాకరమైంది . ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మేము అందరం బాధితురాలికి మద్దతునిస్తూ మా ఓపీ సేవలను బహిష్కరించాం’’ అని అన్నారు మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ హరి కృష్ణ మాట్లాడుతూ..‘‘ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కు ఇలా జరగడం దారుణాతిదారుణం . ఈ ఘటన నన్నెంతో భాదకు గురిచేసింది , భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండావుండే విధంగా ఈ దారుణకి ఒడిగట్టిన వారిని శిక్షించాలి , ఆ బంగారుతల్లి ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అన్నారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్, డబ్బులు ఇప్పుడే డ్రా చేసుకోండి!
బ్యాంక్ ఖాతాదారులకు గమనిక. పలు బ్యాంక్ యూనియన్ల పిలుపు మేరకు మార్చి28, మార్చి 29 బ్యాంక్ల బంద్ జరగనుంది. దీంతో ఎస్బీఐ బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల కార్యకలాపాలలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బ్యాంక్ ఖాతాదారులు ముందస్తుగానే అవసరానికి కావాల్సిన డబ్బుల్ని డ్రా చేసుకోవాలని బ్యాంక్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బంద్ ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండింటిని ప్రయివేటైజ్ చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ రానున్న రోజుల్లో కేబినెట్ అనుమతి కోరే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949కు సవరణలు ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్ లాస్ సవరణ బిల్లు, 2021)ను వ్యతిరేకిస్తూ యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంక్ సేవలకు విఘాతం ఎస్బీఐ వివరాల ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ లు నేషనల్ వైడ్ స్ట్రైక్కు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ఈ బందు కారణంగా ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం కార్యకలాపాలకు విఘాతం కలగనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. -
సమ్మెలో పాల్గొంటే..!
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సమ్మెలో పాల్గొంటే చర్యలు తప్పవని ప్రభుత్వ ఉద్యోగులను కేంద్రం హెచ్చరించింది. ఏ రూపంలోనైనా సమ్మెలో పాల్గొంటే ఏ ఉద్యోగి అయినా తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది. ఇది వేతనాల తగ్గింపుతో పాటు తగిన క్రమశిక్షణా చర్యలను కూడా వుంటాయని ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నిషేధాజ్ఞలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఉద్యోగులను సమ్మెకు వెళ్ళేలా చట్టబద్ధమైన నిబంధనలు లేవని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రతిపాదిత సమ్మె సమయంలో అధికారులు, ఉద్యోగులకు సాధారణం సెలవు లేదా మరే ఇతర సెలవులను మంజూరు చేయొద్దని అధికారులకు సూచించింది. అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్)ను ఆదేశించింది. కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డిఐ) ప్రైవేటీకరణ తదితర కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ రైతు సంఘాల ఐక్యవేదిక సహా వివిధ సంఘాలు రేపు (జనవరి 8) సమ్మె చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెలో ఆరు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కనీస వేతనం, సామాజిక భద్రత తదితర 12 పాయింట్ల సాధారణ డిమాండ్లతో ఈ సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దాదాపు 25 కోట్లమందికి తగ్గకుండా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని పోరాట సంఘాలు అంచనా వేస్తున్నాయి. భారత్ బంద్నకు పిలుపునిచ్చిన ప్రధాన కార్మిక సంఘాలు: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐఎటీయూసీ) హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటియు) ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (ఏఐయూటీయూసీ) ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (టియుసిసి) స్వయం ఉపాధి మహిళల సంఘం (సెవా) ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఏఐసీసీటీయూ) లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్పీఎఫ్) యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (యుటియుసి) చదవండి : ఆ సమ్మెలో 25 కోట్ల మంది జనవరి 8 సమ్మెలో ఆరు బ్యాంకు సంఘాలు -
జనవరి 8 సమ్మెలో ఆరు బ్యాంకు సంఘాలు
సాక్షి, ముంబై: జనవరి 8న దేశవ్యాప్తంగా చేపట్టనున్న అఖిల భారత సమ్మెకు పలు బ్యాంకింగ్ సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించాయి. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబిఎ) ప్రకారం ఆరు బ్యాంకు సంఘాలు కూడా సమ్మెలో చేరనున్నాయి. ఆరు ఉద్యోగ సంఘాలు (ఏఐబీఈఏ, ఏఐబీఓఏ,బీఎఫ్ఎప్ఐ, ఐఎన్ బీఈఎఫ్, ఐఎన్ బీఓసీ, బీకేఎస్ఎంఈ) సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయ. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇచ్చింది. అలాగే సెంట్రల్, కోఆపరేటివ్, రీజినల్ గ్రామీణ , లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు కూడా ఈ సమ్మెలో చేరాలని నిర్ణయించాయి. దీంతో అధికారికంగా ఆ రోజు (జనవరి 8, బుధవారం) సాధారణ సెలవు దినం కానప్పటికీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడనుంది. బ్యాంకింగ్ సేవలు, ముఖ్యంగా బ్యాంకు ఏటీఎం సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే, ఆన్లైన్ లావాదేవీలు ప్రభావితం కావు. మరోవైపు ఈ యూనియన్లలో ఉద్యోగుల సభ్యత్వం చాలా తక్కువ కాబట్టి బ్యాంకు కార్యకలాపాలపై సమ్మె ప్రభావం తక్కువగా ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. -
రెండో రోజు కొనసాగుతున్న భారత్ బంద్..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ రెండో రోజు కొనసాగుతోంది. కార్మిక సంఘాల నాయకుల చేపట్టిన బంద్ బెంగాల్లో కొంత హింసాత్మకంగా మారింది. బెంగాల్లో రోడ్డుపైకి వచ్చిన వాహనాలపై ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో వాహనాల అద్దాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ త్రీవంగా గాయపడ్డాడు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపున్న సీపీఎం నేత సుజన్ చౌదరీను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. దేశ వ్యాప్తంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా 32వేల మంది కార్మికులు బంద్ను పాటిస్తున్నారు. కార్మికుల హక్కులకై వారు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో కూడా రెండో రోజు బంద్ కొనసాగుతోంది. తిరువనంతపురంలో రైలు పట్టాలపై కార్మికులు బైఠాయించడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు కార్మిక సంఘాలు 12 డిమాండ్లను ఉంచిన విషయం తెలిసిందే. రెండు రోజుల బంద్కు పది ట్రేడ్ యూనియన్లు మద్దుతు ప్రకటించాయి. -
నేడు సార్వత్రిక సమ్మె
అనంతపురం అర్బన్: కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జాతీయ కార్మిక సంఘాలు శుక్రవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. జిల్లాలోని వామపక్ష పార్టీలకు అనుబంధంగా ఉన్న సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐయుటీయూసీ, తదితర కార్మిక సంఘాలు, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ సమ్మెకు సమాయత్తమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత కార్మికులందరూ సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధం అయ్యారు. సమ్మె విజయవంతం చేసే భాగంగా రెండు నెలలుగా నాయకులు విస్తత స్థాయిలో పనిచేస్తూ వచ్చారు. సభలు, కార్మిక సదస్సులు, ర్యాలీలు, ప్రదర్శనలు, కరపత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.


