breaking news
Munna Bhai M.B.B.S.
-
‘మున్నాభాయ్’ నటుడు అదృశ్యం.. మూడేళ్లయినా
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించిన సినిమా ‘ మున్నాభాయ్ ఎంబీబీఎస్’. ఈ సినిమాని తెలుగులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ గా రీమేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన పాత్రను బాలీవుడ్లో విశాల్ థక్కర్ పోషించాడు. కాగా మున్నాభాయ్ పార్ట్ 3 కోసం ఇటీవల చర్చలు జరుగుతుండగా ఓ షాకింగ్ విషయం వెలుగుచూసింది. మూడేళ్ల క్రితం డిసెంబరు 31న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ ఆచూకీ నేటికీ దొరకకపోవడం లేదు. విశాల్ కోసం పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిజానికి అతడు జీవించి ఉన్నాడో, లేదో కూడా తెలియడం లేదు. డిసెంబరు 31, 2015న రాత్రి 10:30 గంటల సమయంలో ‘స్టార్ వార్స్’ సినిమాకు వెళ్దామని విశాల్ తన తల్లిని అడిగాడు. తాను రానని చెప్పడంతో ఆమె వద్ద రూ. 500 తీసుకుని ఒక్కడే వెళ్లాడు. ఆ తర్వాత తండ్రికి మెసేజ్ చేస్తూ న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నానని, ఉదయం వస్తానని తెలిపాడు. ఉదయం ఇంటికి వస్తానన్న కుమారుడు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి దుర్గ (60) జనవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాల్ అదృశ్యంపై పోలీసులు మాట్లాడుతూ.. ‘2016 జనవరి 1వ తేదీన థానేలోని గాడ్ బందర్ రోడ్డులో ఉదయం 11:45 గంటలకు ప్రియురాలితో ఉన్నాడు. షూటింగ్ కోసం అంధేరి వెళ్లినట్లు సమాచారం. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అన్నది అతడి ఫేస్బుక్లో చివరి పోస్ట్. న్యూ ఇయర్ రోజు మధ్యాహ్నం 12:10 నిమిషాలకు ఆ పోస్ట్ చేశాడు. తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అప్పటినుంచీ అతడి బ్యాంకు లావాదేవీలు జరగలేదు’ అని చెప్పారు. విశాల్ అదృశ్యం కావడానికి సరిగ్గా రెండు నెలల ముందు అతడి ప్రియురాలు విశాల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే,ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిరినట్టు సమాచారం. సినిమాలు లేకపోవడం, అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో అతడు మానసికంగా దెబ్బతిని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మూడేళ్లయినా తమ కుమారుడి ఆచూకి లభించకోవడంలో విశాల్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'టాంగో చార్లీ', 'చాందిని బార్' తదితర చిత్రాలతోపాటు, టీవీ సీరియల్స్ విశాల్ థక్కర్ నటించాడు. -
మున్నాభాయ్.. ‘బ్లాక్బస్టర్’
ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మున్నాభాయ్ కొత్త సినిమా అంగీకరించాడు. ఈ సినిమాకు బ్లాక్బస్టర్ అనే టైటిల్ కూడా కన్ఫామ్ చేశారు. తనకెంతో ఇష్టమైన కామెడీ జానర్లో మల్టిస్టారర్ చేయడం ఎంతో ఎగ్జైటింగ్గా ఉందని సంజయ్ అన్నాడు. కామెడీ చిత్రాలను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారు అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని మున్నాభాయ్ వ్యాఖ్యానించాడు. మూవీ డైరెక్టర్ అజయ్ అరోరా మాట్లాడుతూ.. సంజయ్ సినిమాలతో పరిచయమైన డైరెక్టర్లు రాజ్కుమార్, డేవిడ్ ధవన్ వంటి వారు విజయవంతంగా దూసుకెళ్తున్నారు. నా కెరీర్ను సంజయ్ సినిమాతో స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. బ్లాక్బస్టర్ షూటింగ్ అంతా మారిషస్లోనే జరగనుంది. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. హిట్ చిత్రాలుగా నిలిచిన గోల్మాల్, హౌస్ఫుల్2, ధమాల్ రిటర్న్స్ సినిమాలకు రచయితగా పనిచేసిన సాజిద్ ఫర్హాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. -
మున్నాభాయ్ ఎస్సెస్సీ!
మున్నాభాయ్ ఎంబీబీయస్ సినిమాలో ఒక డైలాగు... ‘లైఫ్లో తక్కువ టైమ్ ఉంటే, డబుల్ డబుల్ జీవించు’ అని.సినిమాలోని మున్నాభాయ్కి డబుల్ జీవించడం అంటే జీవితాన్ని ఎంజాయ్ చేయడం కావచ్చునేమోగానీ... ముంబై మున్నాభాయ్కి మాత్రం ‘పరులకు సేవ చేయడం’. సేవలో వారం రోజులు జీవించినా సరే... సంవత్సరానికి సరిపడేంత తృప్తి దొరుకుతుంది కదా! ఓ సాధారణ ఆటోడ్రైవర్ అయిన సందీప్ను కింగ్ ఆఫ్ బాంద్రా, మున్నాభాయ్ ఎస్.ఎస్.సి. అని అందరూ పిలుచుకోవడానికి ఆయనలోని సేవాగుణమే కారణం. సందీప్ ఆటో చాలా స్పెషల్. అందులో టెలిఫోన్, వైఫై కనెక్షన్, న్యూస్పేపర్లు, మ్యాగజైన్లు, ఎల్సీడీ స్క్రీన్, మంచినీళ్లు, టీ మొదలైనవన్నీ ఉంటాయి. అతని ఆటో కంటే సందీప్ ఇంకా ప్రత్యేకం. సందీప్ తల్లి క్యాన్సర్తో మరణించారు. ఆ బాధలో నుంచి బయటపడడానికి అతనికి చాలా కాలమే పట్టింది. పేద క్యాన్సర్ పేషెంట్లను చూసినప్పుడల్లా అతనికి తన తల్లే గుర్తుకు వచ్చేది. తల్లికి గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు చికిత్సకు అవసరమైన డబ్బులను సమకూర్చు కోవడానికి పడ్డ కష్టాలన్నీ కంటి ముందు కదలాడేవి. తనలాంటి పరిస్థితి ఎవరికీ ఎదురు కాకూడదనే సంకల్పంతో పేద క్యాన్సర్ పేషెంట్ల కోసం తన ఆటోలో ‘డొనేషన్ బాక్స్’ ఏర్పాటు చేశాడు. ఈ బాక్స్లోని మొత్తానికి రోజూ తన వంతుగా కొంత డబ్బును జమ చేయడం మొదలుపెట్టాడు. ఈ మొత్తాన్ని ప్రతినెలా టాటా మెమోరియల్ వంటి పలు హాస్పిటల్స్లోని పేద రోగులకు ఇచ్చేవాడు. ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాదు... పేషెంట్లకు ధైర్యం చెప్పి నవ్వించడం, భోజనం తినిపించడం, దుస్తులు కొనిపెట్టడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు సందీప్. ఆదివారం అందరూ విశ్రాంతి తీసుకుంటారు. కానీ సందీప్ చాలా బిజీగా ఉంటాడు. ఉదయం పేద రోగులకు బ్రేక్ఫాస్ట్ అందిస్తాడు. తర్వాత ఇంటింటికీ వెళ్లి దుస్తులు, దుప్పట్లు సేకరించి పేదలకు పంచుతాడు.సందీప్ ఆటోలో ఎప్పుడూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. దారిలో వెళుతున్నప్పుడు గాయపడినవారు కనిపిస్తే వారికి ప్రాథమిక చికిత్స చేసి, దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకువెళతాడు. ఓ యువతికి రెండు కిడ్నీలూ పాడైపో యాయి. చికిత్సకు అవసరమైన ఆర్థికసాయాన్ని ఒక ట్రస్ట్ అందించినప్పటికీ, ఇంకా రూ. 35,000 వరకు అవసరమైంది. ఇది తెలుసుకున్న సందీప్ అక్కడా ఇక్కడా అడిగి సమకూర్చాడు. సందీప్ చేసిన సహాయాల్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.సందీప్ మంచితనం గురించి ఆ నోటా ఈ నోటా విన్నవాళ్లు కూడా తమవంతుగా చేయూత ఇస్తున్నారు. కష్టంలో ఉన్నవారికి సందీప్ ఫోన్ నంబర్ ఇవ్వడం మామూలైపోయింది. సందీప్ ఆటోపై - ‘ఎనీ ప్రాబ్లం, కాల్ మున్నాభాయ్ ఎస్.ఎస్.సి.’ అని రాసి ఉంటుంది. తన ఆటోలో ప్రయాణించే వికలాం గులు, గర్భిణి స్త్రీలు, వృద్ధులకు డిస్కౌంట్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద లను ఉచితంగానే తన ఆటోలో తీసుకువెళతాడు. తన సేవకు ట్విట్టర్, ఫేస్బుక్ వంటి మాధ్యమా లను కూడా ఉపయోగిస్తున్నాడు సందీప్. ‘‘ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి. నువ్వేమో వచ్చిన డబ్బును వచ్చినట్లే ఖర్చు చేస్తున్నావు. రేపటి గురించి ఆలోచించు’’ అని బంధువులు ఎప్పుడూ చెబుతుంటారు. ‘‘రేపటి గురించి మాత్రమే ఆలోచిస్తే ఈరోజు జీవించలేము’’ అంటాడు సందీప్. ఆయనకు జీవితం అంటే ‘పొదుపు’, ‘లగ్జరీ’ కాదు. ఎంతమందికి మేలు చేయగలిగామన్నదే జీవితం! పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగమేదో చేయాలనుకున్న సందీప్ పేదరికం కారణంగా పదవతరగతి వరకు మాత్రమే చదువుకో గలిగాడు. ‘‘పెద్ద చదువులు చదువుకోక పోతేనేం... నీది పెద్దమనసు’’ అనిపించుకునేలా ఎదిగాడు. ‘‘ఆటోడ్రైవింగ్ అనేది నా వృత్తి మాత్రమే కాదు... సేవ చేయడానికి ఒక మార్గం కూడా’’ అంటున్న సందీప్ భవిష్యత్లో తన సేవలను మరింత విస్తరించాలనుకుంటున్నాడు. ‘‘నా పెదవుల మీద నవ్వు కనిపించిందంటే, నా మనసులోని కోరిక నెరవేరనుందన్నమాట!’’ అనేది సందీప్ డైలాగ్. అదిగో... సందీప్ నవ్వుతున్నట్లుగానే ఉంది! - యాకూబ్ పాషా