breaking news
Montessori Womens College
-
మాంటిస్సోరి కోటేశ్వరమ్మ కన్నుమూత
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ (94) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925, మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్ను స్థాపించారు. ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి మరీ బాలికలను పాఠశాలలో చేర్పించేవారు. పది మందితో ప్రారంభమైన ఆ పాఠశాల క్రమంగా ప్రా«థమికోన్నత, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలుగా ఎదిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎడ్యుకేషన్, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ వంటి కోర్సులూ ప్రారంభమయ్యాయి. ఆమె విద్యా సంస్థల్లో చదివిన లక్షలాది మంది మహిళలు దేశ, విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. తన సేవలకు గుర్తింపుగా కోటేశ్వరమ్మ పలు అవార్డులు పొందారు. 1971లో బెస్ట్ టీచర్గా జాతీయ స్థాయి అవార్డు, 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళా విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు 2015లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో స్థానం పొందారు. కాగా.. కోటేశ్వరమ్మ భర్త వి.వి.కృష్ణారావు ఆంధ్రా లయోలా కళాశాల అధ్యాపకులుగా పనిచేశారు. ఆయన కొన్నేళ్ల కిందట మృతి చెందారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె డాక్టర్ శశిబాల విజయవాడలోనే ప్రసూతి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె షీలారంజని అమెరికాలో ఉంటున్నారు. ప్రస్తుతం మాంటిస్సోరి విద్యా సంస్థలను మనుమడు అవిరినేని రాజీవ్ నిర్వహిస్తున్నారు. -
టెన్త్ కొత్త సిలబస్పై 14న అవగాహన
విజయవాడ, న్యూస్లైన్ : డాక్టర్ ఏఎస్.రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 14వ తేదీన పదో తరగతి నూతన సిలబస్పై ఉపాధ్యాయులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ ఏఎస్.రామకృష్ణ తెలిపారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలోని మాంటిస్సోరి మహిళా కళాశాల ఆవరణంలో 14వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు అవగాహన తరగతులు జరుగుతాయన్నారు. నూతన సిలబస్ రూపకల్పనలో సమన్వయకర్తగా వ్యవహరించిన ఎస్సీఈఆర్టీకి చెందిన ప్రొఫెసర్ ఎన్. ఉపేందర్రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఆయనతోపాటు పదోతరగతి నూతన పాఠ్యపుస్తకాల రచయితలు, విద్యావేత్తలు పాల్గొని ఉపాధ్యాయులకు సిలబస్పై అవగాహన కల్పిస్తారన్నారు. ముఖ్యంగా గణితం, ఫిజికల్ సైన్స్, జీవశాస్త్రం, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అవగాహన తరగతులకు జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రైవేటు ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు పాల్గొనాలని పిలుపునిచ్చారు.