-
ఆదాయం రూ.5 కోట్లు.. వ్యయం రూ.10 కోట్లు
- ఇదీ మోనో రైలు పరిస్థితి - రైలు నడపటం వల్ల వచ్చే ఆదాయం కంటే భద్రత కోసమే అధికంగా ఖర్చు - భద్రతా బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెమ్మార్డీఏ అధికారులు సాక్షి, ముంబై: అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు.. మోనో రైలు వల్ల వచ్చే ఆదాయం కంటే అందులో ఏర్పాటు చేసిన భద్రత కోసమే ఎక్కువ వెచ్చించాల్సి వస్తోందని ముంబై మహానగర ప్రాంతీయ అభిృద్ధి సంస్థ (c) ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ముంబైలో 2014 ఫిబ్రవరి 2న మోనో రైలు ప్రారంభమైంది. అయితే ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం కంటే ఏర్పాటు చేసిన భద్రత ఎమ్మెమ్మార్డీయేకు తలకు మించిన భారంగా పరిణమించింది. మొదటి దశ మోనో రైలు వడాల-చెంబూర్ మధ్య పరుగులు తీస్తోంది. రెండో దశలో భాగంగా వడాల-జేకబ్ సర్కిల్ (సాత్ రాస్తా) వరకు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వడాల-చెంబూర్ మధ్య ప్రయాణ దూరం చాలా తక్కువగా ఉండటం, స్టేషన్ బయట రవాణా సౌకర్యాలు ఇంకా మెరుగు పడకపోవడంతో ప్రయాణికులు మోనో రైలులో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నారు. 2014 ఫిబ్రవరి నుంచి 2015 ఏప్రిల్ నాటికి 14 నెలల్లో మోనో రైలులో సుమారు 60 లక్షల మంది ప్రయాణించారు. ఎమ్మెమ్మార్డీయేకు దాదాపు రూ.ఐదు కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే అంతే కాలంలో భద్రత కోసం దాదాపు రూ.10 కోట్లకుపైనే ఖర్చు చేసింది. ఆదాయం, ఖర్చులు బేరీజు వేస్తే 50 శాతం నష్టం వచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రెండోదశ పనులు 81 శాతం పూర్తి కావచ్చాయి. మిగతా పనులు 2015 డిసెంబరు లోపు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. రెండు దశల పనులకు మొత్తంగా రూ.2,716 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇందులో రూ.2,290 కోట్లను పనులు చేపడుతున్న మలేషియాకు చెందిన స్కోమి ఇంజినీరింగ్, ఎల్ అండ్ టీ కంపెనీలకు చెల్లించారు. మోనో రైలు ప్రతి ట్రిప్పుకు రూ.3,130 ఖర్చవుతుంది. రోజుకు దాదాపు 131 ట్రిప్పులు తిరుగుతాయి. ఒక్కో రైలులో ప్రతిరోజు దాదాపు 14 వేలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు జారీ టికెట్లను బట్టి తెలుస్తోంది. వడాల-సాత్రాస్తా పనులు పూర్తయితే రైలు ప్రయాణ దూరం పెరగటంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. నష్టాల నుంచి కొంతమేర గట్టేందుకు భద్రతా పన్ను మాఫీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే భద్రత బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు అధికారులు చెప్పారు. -
మోనో రైలుతో రూ.18 కోట్ల నష్టం
త్వరలోనే మంచిరోజులు వస్తాయన్న ఎమ్మెమ్మార్డీయే అధికారి సాక్షి, ముంబై: దేశంలోనే మొట్ట మొదటిసారిగా ముంబైలో ప్రారంభించిన మోనో రైలువల్ల మహానగర ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)కు సంవత్సర కాలంలో ఏకంగా రూ.18 కోట్ల మేర నష్టం వాటిల్లింది. చెంబూర్-వడాల మధ్య 8.9 కి.మీ. దూరం ఉన్నమార్గంపై ఉదయం ఆరు నుంచి రాత్రి 10 గంటల వరకు మోనో రైళ్లు సేవలు అందిస్తున్నాయి. రోజుకు అవి తిరిగే 64 ట్రిప్పుల్లో 36,352 మంది ప్రయాణికులను అవి చేరవేయగలవు. కానీ వాటిలో ప్రతిరోజు సగటున 10-13 వేల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మోనోరైలుకు ప్రయాణికుల ఆదరణ తగ్గడానికి ఎమ్మెమ్మార్డీయే డిప్యూటీ డెరైక్టర్ దిలీప్ కవట్కర్ పలు కారణాలను వివరించారు. మోనోరైలు ప్రయాణించే మార్గం చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా అభివృద్ధి కావాల్సి ఉందన్నారు. ఈ మార్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇతర వాణిజ్య, వ్యాపార భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని చెప్పారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పైన మోనో రైలు దిగిన ప్రయాణికులు అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు అవసరమైన బస్సు, ట్యాక్సీ, ఆటోలు తగినంత సంఖ్యలో అందుబాటులో లేవన్నారు. దీంతో చాలా మంది మోనో రైలుకు బదులుగా ఆటో, ట్యాక్సీ, బెస్ట్ బస్సులనే ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం (చెంబూర్-వడాల) మోనో రైలు చాలా తక్కువ దూరం ప్రయాణిస్తోంది. వడాల నుంచి సాత్రాస్తా మార్గం పనులు పూర్తయితే ఏకంగా ఈ మార్గం 20 కి.మీ. దూరం పెరుగుతుంది. అప్పుడు ప్రయాణికుల నుంచి స్పందన వస్తుందని దిలీప్ కవట్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతవరకు ఈ నష్టాలు తప్పవని అన్నారు. మోనో రైలుకు ప్రస్తుతం లోకల్ రైళ్ల కనెక్టివిటీ లేకపోవడం కూడా తమ నష్టాలకు కారణమని కవట్కర్ అన్నారు. ఈ సంవత్సరం చెంబూర్-వడాల- సాత్రాస్తా మార్గం పనులు పూర్తయితే, వడాల స్టేషన్లో హార్బర్, కరీరోడ్ స్టేషన్లో సెంట్రల్ రైలు మార్గాలు కనెక్టివిటీ అవుతాయి. అప్పుడు మోనోకు మంచి రోజులు వస్తాయని దిలీప్ కవట్కర్ అన్నారు. -
నష్టాల్లో మెట్రో రైలు!
సాక్షి, ముంబై: దేశ ఆర్ధిక నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో రైల్వేకు మొదటి మూడు నెలల్లో రూ.57 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆడిట్లో వెల్లడైంది. ప్రస్తుతం వడాల-చెంబూర్ మధ్య నడుస్తున్న మోనో రైలు కూడా నష్టాల బాటలో నడుస్తోంది. దీని జాబితాలో మెట్రో కూడా చేరిపోయింది. ఘాట్కోపర్-అంధేరి- వర్సోవా మెట్రో సేవలు జూన్ ఎనిమిదో తేదీ నుంచి ముంబైకర్లకు అందుబాటులోకి వచ్చాయి. అందుకు ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) రూ.4,500 కోట్లు ఖర్చు చేసింది. కాని అత్యంత ఖరీదైన సేవలు అతి తక్కువ చార్జీలతో అందించడం గిట్టుబాటు కావడం లేదు. అదేవిధంగా మెట్రో రైళ్లకు, ప్రయాణికులకు కల్పిస్తున్న భద్రత, స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమరాలు, పెద్ద సంఖ్యలో నియమించిన సిబ్బంది, మెట్రో రైళ్ల నిర్వహణ, బ్యాగ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఇస్తున్న రాయితీ తదితర కారణాలవల్ల మెట్రోకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్లో స్పష్టమైంది. ప్రారంభంలో కేవలం రూ.10 ల చార్జీతో ఎక్కడికైనా ప్రయాణించేందుకు అనుమతి కల్పించింది. దీంతో ముంబైకర్లు పూర్తి ఆనందాన్ని ఆస్వాదించారు. మొదటి రెండు, మూడు నెలలు ప్రతీరోజు 2.40 లక్షల మంది ప్రయాణించారు. ఆ తర్వాత ఈ సంఖ్య మూడు లక్షలకు చేరింది. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో రెట్టింపు అయింది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ కార్డులు, సీజన్ పాస్లు జారీచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో వైఫై సేవలు కూడా ప్రారంభించింది. కాని టికెటు చార్జీలు మాత్రం సేవలకు తగ్గట్టుగా పెంచలేదు. కనీస చార్జీ రూ.10 ఉండగా ఆ తర్వాత దూరాన్ని బట్టి రూ.20, రూ.30 నిర్ణయించింది. కాని అనేక మంది ఉద్యోగులు స్మార్ట్ కార్డు, సీజన్ పాస్లు వినియోగిస్తున్నారు. దీంతో ఆదాయం మరింత పెరిగింది. కాని ప్రారంభంలో ఈ సౌకర్యాలు అందుబాటులో లేకున్నప్పటికీ సరదా కోసం ప్రయాణంచే వారి సంఖ్య ఎక్కువ ఉండేది. దీంతో వివిధ నిర్వహణ భారాలు, సిబ్బంది ఖర్చుల భారం ఎమ్మెమ్మార్డీయేపై విపరీతంగా పడింది. ప్రారంభంలో మోనోతో పోలిస్తే మెట్రో లాభాల బాటలో నడుస్తోందని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. కాని ఇదికూడా నష్టాల బాటలో నడుస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్లో స్పష్టమైంది. -
తిరుమలకు కూ.. చుక్చుక్!
తిరుపతి నుంచి తిరుమలకు సురక్షితంగా భక్తులను చేర్చడానికి మోనో రైలును ఏర్పాటుచేయాలని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ప్రతిపాదించింది. రూ.3,510 కోట్లతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రణాళిక నివేదిక)ను రూపొందించింది. ప్రాజెక్టును చేపట్టేందుకు ఆర్థిక సహాయం చేయాలని తుడా అధికారులు కేంద్రానికి నివేదిక పంపారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి విరాజిల్లుతోంది. తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాల ద్వారా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రతి రోజూ ఆర్టీసీ బస్సులు మొదలు ద్విచక్ర వాహనాల వరకూ మొత్తం పదివేల వాహనాల్లో 65 వేల మంది భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. వాహనాలు అధికమవుతుండడం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య తీవ్రమై ప్రమాదాలకు దారి తీస్తోంది. భారీ వర్షాలు కురిసినపుడు కొండచరియలు విరిగి పడడం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. భక్తులను సులభంగా ఏడుకొండల స్వామి వద్దకు చేర్చడానికి తుడా అనేక మార్గాలను అన్వేషించింది. అందులో రోప్ వే ఒకటి. రోపే వే పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో.. మోనో రైలుపై తుడా అధికారులు కసరత్తు చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్స్టేషన్ నుంచి తిరుమలకు 27 కిమీల దూరం ఉంటుంది. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు మార్గాన్ని ఏర్పాటుచేయడానికి నిపుణులతో కలిసి తుడా అధికారులు సర్వే చేశారు. తిరుమల ఘాట్ రోడ్డు వెంబడే రైలు మార్గాన్ని నిర్మించడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తేల్చారు. ఇప్పటికే రోడ్డు మార్గం ఉండటంతో ఆ పక్కనే మోనో రైలు మార్గాన్ని నిర్మించడానికి అటవీశాఖ అనుమతులు కూడా సులభంగా వస్తాయని అంచనా వేశారు. ఈ క్రమంలోనే మోనో రైలు ప్రాజెక్టును చేపట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించడానికి పూర్తి స్థాయిలో సర్వే చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్స్టేషన్ నుంచి తిరుమలకు రైలు మార్గం నిర్మించడానికి.. తొలి దశలో ఆరు మోనో రైలు ఇంజిన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ.3,510 కోట్లు అవసరం అవుతాయని తేల్చారు. ప్రస్తుతం తిరుపతి ఆర్టీసీ బస్స్టేషన్ సముదాయంలో ఉన్న తిరుమల బస్స్టేషన్ను మోనో రైల్వే స్టేషన్గా మార్చాలని ప్రతిపాదించారు. కపిలతీర్థం వద్ద ఓ రైల్వే స్టేషన్.. అలిపిరి వద్ద మరో రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించారు. మోనో రైలు ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు తుడా అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ యాజమాన్యం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేయాలని నివేదిక పంపారు. మోనో రైలు ప్రాజెక్టు భారీ వ్యయంతో కూడినది కావడంతో కేంద్రంపైనే తుడా అధికారులు ఆశలు పెంచుకున్నారు. ఈనెల 15న తిరుపతి ఎంపీ వి.వరప్రసాదరావు తుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు మోనో రైల్వే ప్రాజెక్టు విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నిధులు వచ్చేలా చూడాలని కోరారు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ.. ఆ ప్రాజెక్టు నివేదికను తనకు ఇవ్వడంతోపాటు కేంద్రానికి, టీటీడీ బోర్డుకు పంపాలని ఆదేశించారు. తుడా అధికారులు ఈనెల 16న ఎంపీ వరప్రసాదరావుకు మోనో రైల్వే ప్రాజెక్టు నివేదికను అందించారు. అదే రోజున కేంద్ర ప్రభుత్వానికి, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్కు నివేదిక పంపారు. మోనో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరిస్తే.. తక్కిన 50 శాతం టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం, తుడా భరించేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు స్పష్టీకరిస్తున్నారు. ఏదిఏమైనా మోనో రైల్వే ప్రాజెక్టు సాకారమైతే తిరుమలకు భక్తుల రవాణా కష్టాలు తీరినట్లే..! -
బవానా-గుర్గావ్ మధ్య మోనోరైల్
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని బవానా నుంచి గుర్గావ వరకు మోనో రైలు సేవలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. యాభై కిలోమీటర్ల మోనోమార్గం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపేందుకు సహాయసహకారాలు అందించాల్సిందిగా జపాన్ను కోరింది. ఈ విషయమై జపాన్ భూ, మౌలికవసతులు, రవాణామంత్రి అకిహిరో ఓహ్తాతో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఓహ్తా నేతృత్వంలోని 20 మంది సభ్యుల జపాన్ బృందం దేశంలో పర్యటిస్తోంది. దేశంలోని నగర ప్రణాళికలు, విధానాల రూపకల్పన, విదేశీ ప్రాజెక్టులు, వాటి ప్రణాళికల, రోడ్లు, రైల్వేల పనితీరుపై ఈ బృందం అధ్యయనం జరుపుతుంది. ప్రత్యేకించి దేశంలో బహుళ ప్రయోజనాల రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టే విషయమై అధ్యయనం చేయనుంది. మెట్రో, మోనో, లైట్రైల్ రవాణా సేవలను దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అందించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందనే విషయమై జపాన్ బృందం పరిశీలిస్తుంది. పట్టణాభివృద్ధిపై భారత్తో కలిసి పనిచేసేందుకు జపాన్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఓహ్తా నేతృత్వంలోని బృందం ఇక్కడ పర్యటిస్తోంది. దీంతో ఈ బృందంతో సమావేశమైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ-గుర్గావ్ మధ్య రవాణా వ్యవస్థను మరింత సరళతరం చేసే అవకాశాలపై చర్చించారు. మోనోరైలు ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నందున ఈ విషయాన్ని జపాన్ బృందం దృష్టికి తీసుకొచ్చారు. అయితే బవానా నుంచి గుర్గావ్ వరకు 50 కిలోమీటర్ల దూరముంటుంది. ఇంతటి సుదీర్ఘమైన మార్గంలో మోనోరైలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా? లేదా? అనే విషయమై అధ్యయనం జరపాల్సిందిగా వెంకయ్య కోరారు. అందుకు జపాన్ బృందం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. అధ్యయనం పూర్తయితే ప్రతిపాదనలు సిద్ధం చేసి, అన్నిరకాల అనుమతులు పొంది, చకచకా పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఉత్తర ఢిల్లీ నుంచి గుర్గావ్ మధ్య రాకపోకలు సాగించేవారి ప్రయాణం సుఖవంతమవడమే కాకుండా సమయం కూడా కలిసొస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య బస్సు సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- నీకు మొగుడు లేడా..? టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement