breaking news
Mobile Phone Market
-
మల్టీ కెమెరా స్మార్ట్ఫోన్ల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మంచి కెమెరా, పెద్ద స్క్రీన్, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, ర్యామ్.. ఇవీ ఇటీవలి కాలం వరకు స్మార్ట్ఫోన్ కస్టమర్ల తొలి ప్రాధాన్యతలు. ఇప్పుడీ ట్రెండ్ మారిపోయింది. సామాజిక మాధ్యమాల పుణ్యమాని అత్యాధునిక పాప్–అప్, మల్టీ కెమెరా స్మార్ట్ఫోనే వినియోగదారుల ఏకైక డిమాండ్గా నిలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేవైపు నాలుగు కెమెరాలున్న మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. ఇటీవలే అయిదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్వ్యూ ఫోన్ను తీసుకొచ్చింది. 64 మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన ఫోన్లు కొద్ది రోజుల్లో కస్టమర్ల చేతుల్లో క్లిక్మనిపించనున్నాయి. కెమెరాను కేంద్రంగా చేసుకునే మోడళ్ల రూపకల్పనలో కంపెనీలు నిమగ్నమవడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో కెమెరా టెక్నాలజీతోనే కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకోవాల్సిందేనని జర్మనీకి చెందిన ఆప్టికల్స్ తయారీ దిగ్గజం జాయిస్ సీఈవో మైఖేల్ కాష్కే స్పష్టం చేశారు. కెమెరాల సామర్థ్యం పెరగడంతో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరు మీదున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మారుతున్న కంపెనీల ధోరణి.. స్మార్ట్ఫోన్ల డిజైన్, ఫీచర్ల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. స్క్రీన్కు ఆనుకుని చుట్టుపక్కల ఉండే ప్లాస్టిక్, మెటల్తో కూడిన బెజెల్ తగ్గుతూ వచ్చింది. బెజెల్ లెస్ మోడళ్ల రాకతో డిస్ప్లే సైజు పెరిగింది. ర్యామ్ సామర్థ్యం 12 జీబీకి, ఇంటర్నల్ మెమరీ 256 జీబీ వరకు చేరింది. బ్యాటరీ పవర్ 5,000 ఎంఏహెచ్ దాటింది. 4కే (యూహెచ్డీ) స్క్రీన్, డెకాకోర్ ప్రాసెసర్, వైర్లెస్ చార్జింగ్ మోడళ్లూ వచ్చి చేరాయి. ఇన్ని మార్పులు వచ్చినప్పటికీ వినియోగదార్ల ప్రాధాన్యత మాత్రం కెమెరాకేనని ‘బిగ్ సి’ మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీలు పోటీపడీ మరీ లెన్స్పై దృష్టిసారిస్తున్నాయి. అధిక మెగా పిక్సెల్తోపాటు మల్టిపుల్ కెమెరాల రాక అధికమైంది అని వివరించారు. మల్టిపుల్ లెన్స్ కెమెరాలు, లార్జ్ సైజ్ ఇమేజ్ సెన్సార్ల అమ్మకాల జోరుతో జపాన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సోనీ కార్పొరేషన్ జూన్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.14,490 కోట్ల నిర్వహణ లాభాలను ఆర్జించింది. ఈ మొత్తం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.4%అధికంగా ఉందంటే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. మల్టీ కెమెరాలకే మొగ్గు.. ప్రపంచ స్మార్ట్ఫోన్ రంగంలో మల్టీ కెమెరాలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి. బెజెల్ లేకుండా పూర్తి డిస్ప్లేతో ఫోన్లను అందించేందుకు పాప్–అప్ సెల్ఫీ కెమెరాలతో మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆప్టికల్ జూమ్, ఫాస్ట్ ఆటో ఫోకస్, వైడ్ యాంగిల్ వంటి ఫీచర్లతో ఇవి రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇక వెనుకవైపు రెండింటితో మొదలై అయిదు కెమెరాల స్థాయికి వచ్చిందంటే ట్రెండ్ను అర్థం చేసుకోవచ్చు. ‘ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో అందమైన ఫొటోలను పోస్ట్ చేసేందుకు కస్టమర్లు పాప్–అప్తోపాటు వెనుకవైపు మూడు, నాలుగు కెమెరాలున్న ఫోన్లు కోరుకుంటున్నారు. పాప్–అప్ కెమెరా మోడల్ ఇప్పుడు రూ.18 వేలకూ లభిస్తోంది’ అని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. వివిధ కంపెనీల నుంచి క్వాడ్, ట్రిపుల్ కెమెరా మోడళ్లు 90 వరకు ఉంటాయి. 48 మెగాపిక్సెల్తో ప్రధాన కెమెరా ఉన్న మోడళ్లు 60 దాకా ఉన్నాయి. వీటిలో చాలామటుకు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. 48 ఎంపీతో కూడిన డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఫోన్లూ వచ్చి చేరాయి. 48 ఎంపీ రొటేటింగ్ పాప్–అప్ కెమెరాతో సామ్సంగ్ గెలాక్సీ ఏ80ని ఆవిష్కరించింది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతో షావొమీ, రియల్మీ త్వరలో రంగంలోకి దిగుతున్నాయి. దేశంలో 2019లో 15–16 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. -
మైక్రోమాక్స్ పెద్ద టార్గెటే పెట్టుకుంది!
న్యూఢిల్లీ: దేశీయ ముబైల్ హ్యాండ్సెట్ మేకర్ మైక్రోమాక్స్ అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని భావిస్తోంది. మద్యప్రాచ్యం, ఆఫ్రికా, కామన్వెల్త్ దేశాల మార్కెట్లలోకి ప్రవేశించి.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. రానున్న మూడు నాలుగేళ్లలో అంతర్జాతీయంగా ఐదు అగ్రశేణి ముబైల్ ఫోన్ సంస్థల్లో ఒకటిగా నిలువాలని మైక్రోమాక్స్ సంస్థ తాజాగా టార్గెట్ పెట్టుకుంది. గార్ట్నెర్ సంస్థ ప్రకారం 2015 జూన్తో ముగిసే త్రైమాసికానికి మైక్రోమాక్స్ సంస్థ అంతర్జాతీయంగా పదోస్థానంలో నిలిచింది. ఇప్పటికే తమకు రష్యా, బంగ్లాదేశ్, నేపాల్లో బలమైన మార్కెట్ ఉందని, ఇకముందు మరింత విస్తరిస్తామని మైక్రోమాక్స్ సంస్థ తాజాగా వెల్లడించింది. 'నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి మార్కెట్లలో కొన్ని సంవత్సరాల కిందటే మా అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రారంభించాం. ఇతర మార్కెట్లలోనూ మేం బాగా వృద్ధి చెందాం. రష్యా మార్కెట్లో మాకు ఐదుశాతం వాటా ఉంది' అని మైక్రోమాక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఇంటర్నేషనల్ బిజినెస్) అమిత్ మథూర్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. రానున్న మూడు నాలుగేళ్లలో అంతర్జాతీయంగా టాప్ 5లో ఒకరిగా ఉండటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్లో మైక్రోమాక్స్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ మేకర్గా ఉంది. దేశంలో మొబైల్ అమ్మకాల్లో శామ్సంగ్ తర్వాత రెండోస్థానంలో మైక్రోమాక్స్ ఉంది. -
మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త 4జీ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: ప్రస్తుతం మొబైల్ ఫోన్ మార్కెట్లో 4జీ స్మార్ట్ఫోన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో..ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్ల తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’ తొలిసారిగా ‘కాన్వాస్ఎక్స్ప్రెస్4జీ’ పేరుతో 4జీ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6,599. ‘కాన్వాస్ఎక్స్ప్రెస్4జీ’ స్మార్ట్ఫోన్లు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. టాప్ 10లో మైక్రోమ్యాక్స్: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మైక్రోమ్యాక్స్ అమ్మకాలు రెట్టింపయ్యాయి. 56 లక్షల నుంచి 1.21 కోట్లకు పెరిగాయని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ తెలిపింది. దీంతో అంతర్జాతీయంగా టాప్ 10 దిగ్గజ కంపెనీల్లో మైక్రోమ్యాక్స్ కూడా చోటు దక్కించుకున్నట్లు వివరించింది.