breaking news
mla puvvada ajay
-
ఖమ్మంలో మట్టిరోడ్లు కనిపించవ్
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మంఅర్బన్: కార్పొరేషన్ పరిధిలోని అన్ని మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామని, రానున్న రోజుల్లో ఖమ్మంలో మట్టి రోడ్లు కనిపించవని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గురువారం నగరంలోని 14వ డివిజన్లో రూ.15లక్షలతో, 9వ డివిజన్లో రూ.10లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణాలకు మేయర్ పాపాలాల్తో కలిసి ఎమ్మెల్యే పువ్వాడ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరాభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీ పడకుండా అన్ని వేళలా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వం నుంచి వివిధ రకాల నిధులతో పూర్తిస్థాయిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నగరాన్ని సుందరీకరణకు తన వంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు, ఇరుకైన రోడ్లను విస్తరించి డబుల్ రోడ్లుగా, ప్రధాన రహదారులను విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, షేక్ జాన్బీ, మందడపు మనోహర్రావు, గాజుల వసంత, దస్తగిరి వీరయ్య, యాదగిరి, దస్తగిరి, కొత్తా రవి, నాగుల్మీరా, కొంగర జ్యోతిర్మయి, కొలకాని రమాదేవి, శ్రీనివాస్, పరమేష్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు
ఖమ్మం: బయట వ్యాపారులకు రైతు బజార్ అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ను రైతులు అడ్డుకున్నారు. ఖమ్మం ప్రధాన రైతుబజారు వద్ద రైతులు, వ్యాపారుల మధ్య ఘర్షణ మంగళవారం తీవ్రస్థాయికి చేరింది. వ్యాపారులు బయటనుంచి కూరగాయలు తెచ్చి రైతు బజార్ ఎదుట విక్రయిస్తుండడంతో రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రైతులు రైతుబజార్ ఎదుట బైఠాయించారు. సమస్య పరిష్కరించేందుకు వచ్చిన ఎమ్మెల్యే వ్యాపారులకు రైతు బజార్లో స్టాళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజార్లో స్టాళ్ల ఏర్పాటుకు వ్యాపారులను ఎలా అనుమతిస్తారంటూ రైతులు నిలదీశారు. ఆయన వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకోవడంతో అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి పోలీసుల సాయంతో బయటపడ్డారు.